పెత్తందారుల అభివృద్ధి కోసమే అమరావతి

వికేంద్రీక‌ర‌ణ‌పై చ‌ర్చ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వెయ్యి రోజులుగా కృత్రిమ, రియల్‌ ఎస్టేట్‌ ఉద్యమం నడిపిస్తున్నాడు

అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు

పచ్చళ్ల వ్యాపారం కూడా మా వారిదే జరగాలనేది పెత్తందారీల మనస్తత్వం

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ కంటే కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పది

చంద్రబాబు హయాంలో దోచుకో, పంచుకో, తినుకో..

లక్షా 65 వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించాం

లంచం, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

ఇంటింటికీ, మనిషి మనిషికీ మంచి చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం

పెట్రోల్, డీజిల్‌ పోసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

అమ‌రావ‌తి: పెత్తందారుల అభివృద్ధి కోసమే చంద్ర‌బాబు అమరావతి రాజ‌ధాని అంటున్నార‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని  ​ధ్వజమెత్తారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్‌ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు అని సీఎం వైయ‌స్ జగన్‌ ప్రశ్నించారు. అసెంబ్లీ స‌మావేశాల మొద‌టి రోజు వికేంద్రీక‌ర‌ణ‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి స‌వివ‌రంగా మాట్లాడారు.  

*58 ఏళ్ల రాష్ట్రం– రాజధాని కోసం ఉద్యమాలు లేవు*
ఈ రోజు వికేంద్రీకరణ దాని ప్రభావం మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. 1956 నుంచి 2014 వరకు ఈ 58 సంవత్సరాలు కలిసి ఉన్న రాష్ట్రం...విడిపోతున్నప్పుడు కానీ.. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు కానీ, చంద్రబాబు  ఒక్కరోజు కూడా ఎలాంటి ఉద్యమాలు చే యలేదు. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఆయన బృందం ఎలాంటి బాధాపడలేదు.

*ఎమ్మెల్సీ ఎన్నికల్లో లంచమిస్తూ...*
చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నిక్లలో ఓట్లు కొనుగోలు చేసేందుకు కోట్లు లంచమిస్తూ దొరికిపోయి ఆయనే ఈప్రాంతమంతా టెంపరరీ అనే పేరుపెట్టి, కనీసం 58 నెలల కాలం కూడా రాజధానిగా పరిపాలించిన ప్రాంతం గురించి అంటే అమరావతి గురించి ఉద్యమాలట. బాబు ఎలాంటి అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమాలు అట. ఇలాంటి ప్రాంతం గురించి ఇవాళ రకరకాల డ్రామాలు జరుగుతున్నాయి. 

*కట్టని, కట్టలేని రాజధానికోసం కృత్రిమ ఉద్యమం..*
రాష్ట్రాన్ని విడగొట్టడానికి వీల్లేదని ఒకరోజు ఉద్యమాలు కానీ, యాత్ర కానీ చేయని ఈ పెత్తందార్లు అందరూ, ఈ మహానుభావులందరూ వారు కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్‌ గురించి వేయి రోజులగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని, రియల్‌ ఎస్టేట్‌ ఉద్యమాన్ని మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ.. .మరోవైపు ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతూ ఈరోజు ఒక డ్రామాను నడుపుతున్నారు.

*పెత్తందార్ల సొంత అభివృద్ధి కోసమే...*
దశాబ్దాలుగా నిర్మించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే కూడా, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ కంటే కూడా ఈ కట్టని, కట్టలేని అమరావతి వీరి దృష్టిలో ఎంతో గొప్పది. ఎందుకు వీరి దృష్టిలో అమరావతి ఎంతో గొప్పది అని ఆలోచన చేయాలి ? ఎవరి అభివృద్ధి కోసం వీరంతా ఉద్యమాలు, ఆలోచన చేస్తున్నారన్నది కూడా ఆలోచన చేయాలి ? బీసీల అభివృద్ధి కోసమా ? కాదే ? ఎస్సీల అభివృద్ధి కోసమా ? అదీ కాదు.  ఎస్టీల అభివృద్ధి కోసమా ? అదీకాదు. పోనీ మైనార్టీల అభివృద్ధి కోసమా అది కూడా కాదే ? పేద ఓసీల అభివృద్ధి కోసమా ?అదీకాదు ? మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమా ? అది కూడా కాదు, లేదు.
కేవలం ఈ పెత్తందార్ల సొంత అభివృద్ధి కోసం మాత్రమే.

చంద్రబాబు గారు దిగిపోయిన 2019లో రాష్ట్ర బడ్జెట్‌ ఆయన హయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగాఉంటూ ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం మనం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూస్తే.. దాదాపు ఒకటే ఉంటుంది. పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు రూ.2.27 లక్షల కోట్లు అయితే ఈరోజు రూ.2.50 లక్షల కోట్లు. అది కూడా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత.

చంద్రబాబు హయాంలో జగనన్న అమ్మఒడి ఎందుకు లేదు ? వైయస్సార్‌ ఆసరా ఎందుకు లేదు ? అదే చంద్రబాబు హయాంలో చేయూత పథకం, రైతు భరోసా పథకం ఎందుకు లేదు? ఏకంగా నవరత్నాల పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్లు కేవలం బటన్‌ నొక్కి డీబీటీ అంటే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఎలాంటి అవినీతి, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవ్వగలుగుతున్నాం. కరోనా ఉన్నా కూడా అందించాం. 

*అప్పుడు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోయాయి...*
చంద్రబాబు హయాంలో 31 లక్షల ఇళ్లపట్టాలు ఎందుకు లేవు ?  21 లక్షల ఇళ్ల నిర్మాణం ఎందుకు జరగలేదు ? ఈ డబ్బులన్నీ ఆయన హయంలో ఎక్కడికి పోయాయి ? అప్పుడూ ఇంతే బడ్జెట్, ఇప్పుడూ ఇంతే బడ్జెట్‌. ఈ రోజు ఎందుకు ఈ పథకాలన్నీ జరుగుతున్నాయి ? అప్పుడు ఎందుకు జరగలేదు ?డబ్బులన్నీ ఎవరెవరి జేబులోకి పోయాయి ? 

ఎన్నికలప్పుడు మేనిఫెస్టో గురించి ప్రచారంలో ఉన్నప్పుడు ‡ అప్పలనర్శయ్య మాట్లడుతూ ఇవన్నీ అవుతాయా ? అని ప్రశ్నించాడు. ఈరోజు మనం ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం ? ఆ రోజు చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అన్నది అందరూ ఆలోచన చేయాలి. ఆ రోజు దోచుకో, పంచుకో, తినుకో డీపీటీ పథకం. 
చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. దోచుకోవడం పంచుకోవడం. వారు ఏం దోచుకున్నా పంచుకున్నా అడిగేవాడు ఉండడు, రాసేవాడూ ఉండడు. మనలాంటి వాళ్లు ప్రశ్నిస్తే... మైకులు నొక్కేస్తారు. దుష్ప్రచారాలు చేస్తారు.

*పెత్తందారీ మనస్తత్వం....*
చంద్రబాబు ఆయన బృందం ఆలోచనలు ఎలా ఉంటాయంటే.. రాజధాని అంటే మా బినామీ భూముల ప్రాంతం మాత్రమే రాజధానిగా ఉండాలి. ఇంకెక్కడా ఉండకూడదు అనేది పెద్దందారీ మన స్తత్వం ఉన్న మనుషుల ఆలోచనలు. పత్రిక అంటూ ఉంటే అది కేవలం ఈనాడు, చంద్రజ్యోతి మాత్రమే ఉండాలి. మరే పత్రికా ఉండనే ఉండకూడదు అనేది వీరి ఆలోచన. 

వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. పచ్చళ్లు అమ్మినా కూడా అవి మా వాళ్లు పచ్చళ్లే అమ్మాలి అని ఉంటుంది. చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేసినా కూడా మా వాడి చిట్‌ ఫండ్స్‌ వ్యాపారం మాత్రమే జరగాలి అని ఉంటుంది.
డిపాజిట్స్‌ సేకరణ చేసినా మా వాడే, అది కూడా ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించి చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. మావాడైతే ఏమైనా చేయవచ్చు. 
డెయిరీలు, పాలు అంటే ప్రభుత్వ రంగంలో లాభాల్లో ఉన్న చిత్తూరు డెయిరీని కూడా మూసివేయాలి. నా హెరిటేజ్‌ కోసం ఆ డెయిరీల పీక పిసికేయాలన్నదే ఈ పెత్తందార్ల మనస్తత్వం. ఈ రంగం ఆ రంగం ఆనే తేడా లేదు, వారు వీరు ఆనే తేడా లేదు. ఎవ్వరూ కూడా మార్కెట్‌లో ఉండకూడదు. నేను నా మనుషులు మాత్రమే ఉండాలి. అది ఇండస్ట్రీ అయినా, సినిమా అయినా ఏదైనా నేను నా మనుసులు మాత్రమే ఉండాలన్నది వీరి మనస్తత్వం. 

కార్పొరేట్‌ చదువులు తీసుకున్నా కూడా కేవలం మా నారాయణ, మా చైతన్య మాత్రమే ఉండాలి. గవర్నమెంటు బడులలో మాత్రం ఇంగ్లిషు మీడియం ఉండకూడదు. అన్ని వ్యవస్ధలు కూడా నా మనుషుల చేతుల్లోనే ఉండాలి. ప్రతిపక్ష పార్టీలలోకూడా నా మనుషులే ఉండాలి. అదే ఈ పెత్తందారీ మనస్తత్వం ఉన్న మనుషుల మెంటాలిటీ. 

రాజధానితో పాటు ఏది తీసుకున్న వీళ్ల ఆలోచనలు, డిజైన్స్‌ అన్నీ ఈ మాదిరిగానే ఉంటాయి. వీటికి అందమైన పేర్లు కూడా పెడతారు. అలాంటి కుట్రపూరితమైన ఒక డిజైన్‌ పేరు.. ఒకటే రాజధానిగా అమరావతి. ఈ డిజైన్‌ పేరు ఈ మధ్య మనం బాగా వింటున్నాం.

నిజంగా ఇది సాధ్యమయ్యే పనేనా అన్నది అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు ఇంతకముందు చాలా సందర్భాలలో నేను, నా సహచర మంత్రులు సమాధానం చెప్పారు. అదేవిధంగా నా మాట విన్న తర్వాత నిజమే కదా అని చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడ్డం జరిగింది. 

*అయినా కూడా సమయం, సందర్భం అదే కాబట్టి మరలా నాలుగు మాటలు చెపుతాను.*

*అమరావతితో సహా నాకు అన్ని ప్రాంతాలు సమానమే*
అమరావతి అనే ప్రాంతం మీద నాకు ఎలాంటి కోపం లేదు. నాకు ఎందుకు కోపం ఉండాలి. ప్రతి ప్రాంతం బాగుపడాలి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలన్న తపన, తాపత్రయం ఉంటుందే తప్ప, ఏ ప్రాంతం మీద వ్యతిరేకత, ప్రజల మీద వ్యతిరేకత ఎప్పుడూ ఉండవు.

అమరావతి ఇటు విజయవాడకు దగ్గరగా లేదు, అటు గుంటూరుకు దగ్గరగాలేదు. విజయవాడ నుంచి అయినా 40 కిలోమీటర్లు, గుంటూరు నుంచి అయినా 40 కిలోమీటర్లు ఉంటుంది. దేనికీ దగ్గరగా లేని ఈ ప్రాంతంలో కేవలం రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేటీ వంటి కనీస మౌలిక వసతులు కోసమే..ఈ 53వేల ఎకరాలకు గానూ,  చంద్రబాబునాయుడు గారు తనంతట తానే ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని స్వయంగా లెక్క ఇచ్చారు.
 
కేవలం 53 వేల ఎకరాలు అంటే  8కిలోమీటర్ల రేడియస్‌లో రూ.1.10 లక్షల కోట్లు ఈ కనీస మౌలిక వసతులు కోసమే ఖర్చయ్యే పరిస్థితి ఉందని వాళ్లంతట వాళ్లే ఇచ్చిన నివేదిక. రాజధాని అంటే భవనాలు మిగిలిన వాటిని కూడా కలుపుకుంటే.. ఇటువంటి అమరావతిలో మిగిలినవాటికి కనీసం రూ.4 నుంచి రూ.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పడం విన్నాం.

5 యేళ్లలో చంద్రబాబు చేసిన ఖర్చు రూ.5674 కోట్లు.
 ఇంత ఖర్చవుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడుగారు తన ఐదేళ్ల పరిపాలనలో ఏ మేరకు ఖర్చు చేశాడో సభ ద్వారా ప్రజలకు మరొక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అంతగా ఒక మనిషి భ్రమలు కల్పించి, డిజైన్లు, గ్రాఫిక్స్‌ చూపించి మోసం చేస్తే... నిజానికి 420 కేసు పెట్టాలి. 

5 సంవత్సరాలలో ఆ పెద్దమనిషి సంవత్సరానికి రూ.1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. రూ.5674 కోట్లు మాత్రమే ఐదేళ్లలో ఖర్చు చేసి...మరో రూ.2297 కోట్లు మనల్ని కట్టమని బకాయిలుగా వదిలేశాడు. రాజధాని మీద ఇంత ప్రేమున్న వ్యక్తి ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలుగా వదిలేసివెళ్లాడన్నది ఆలోచన చేయాలి. ఈ పెద్దమనిషి ఇంతగా ఎందుకు రాజధానికి ప్రాకులాడూతూ.. ఆయన బినామీలందరికీ కూడా ఇక్కడ భూములుండి.. .ఇక్కడ అభివృద్ధి చెందితే ఆ భూములకి రేట్లు పెరుగుతుందని తెలిసి కూడా... ఒక ప్రభుత్వంగా ఎందుకు రూ.2297 కోట్లు బకాయిలు పెట్టాడు. 
ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతకన్నా ఎక్కువ పెట్టలేని పరిస్తితి. ఆయన ఐదేళ్లలో రూ.5674 కోట్లు పెట్టాడు, ఇంకో ప్రభుత్వం అంతకన్నా మెరుగ్గా ఐదేళ్లలో  రూ.6వేల కోట్లు పెడుతుందేమో... అంటే ఏడాదికి రూ.1000 కోట్లు, లేదా రూ.2వేల కోట్లు కూడా పెట్టలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉందన్న సంగతి అందరం తెలుసుకోవాలి. 

*80 శాతం ప్రజలు తెల్లరేషన్‌ కార్డు దారులే....*
మన పరిస్థితి ఏంటంటే.. .80శాతం పై చిలుకు ప్రజలు తెల్లకేషన్‌ కార్డు మీదే బ్రతుకుతున్న పరిస్థితి. మన అవసరాలేంటి, మన ప్రజలకు చేయాల్సిందేంటి అన్నది రాజకీయ నాయకులు మర్చిపోకూడదు.

*వంద సంవత్సరాలు పడుతుంది.*
 ఇలాంటి పరిస్థితుల్ల రూ.1.10 లక్షల కోట్లు పెట్టాలంటే... ఇప్పటికి రూ.5 వేల కోట్లు పెడితే.. మిగిలిన రూ.1.05 లక్షల కోట్లు పెట్టడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ 100 సంవత్సరాల కాలంలో కేవలం ఈ రోడ్లు, డ్రైనేజీకు, కరెంటుకు పెట్టే రూ.1లక్ష కోట్లు వందేళ్లలో ద్రవ్యోళ్భనం వల్ల కనీసం రూ.20–30 లక్షల కోట్లు అవుతుంది. సమయం గడిచే కొద్దీ, రేట్లు పెరిగే కొద్దీ ఇవాళ లక్ష కోట్లు అనేది వంద సంవత్సరాల కాలంలో రూ.20–30 లక్షల కోట్లు అయితే మనం దీన్ని ఏ రకంగా పూర్తి చేయగలుగుతాం అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.

ఈ ప్రాంతం మీద నాకు ఎటువంటి వ్యతిరేకతా లేదు. ఈ ప్రాంతంలో కూడా రాజధాని పెట్టడానికి నేను సిద్దపడ్డా. ఇక్కడ రాజధాని తీసేయడం లేదు. విశాఖపట్నంలోనూ, కర్నూలులోనూ రాజధానిని అదనంగా చేయాలన్ననే తప్ప... ఇక్కడ తీసేయాలని నేనెప్పుడూ అనలేదు. నాకు మంచి చేయాలనే తపన ఉంది. ఈ పది సంవత్సరాలలో నేను రూ.30–40 వేల కోట్లు ఖర్చుపెట్టినా...  ఈ లక్ష కాస్తా రూ.3 లక్షల కోట్లు అవుతుంది. ఎప్పటికీ పూర్తి కావు. పనులన్నీ కూడా సగంలో కనిపిస్తాయి. అవి కూడా భవనాలు కాదు.. రోడ్లు, నీళ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు మాత్రమే. ఇదొక డ్రీమ్‌ చేజింగ్‌.

*రాష్ట్రం అంటే...* 
మన రాష్ట్రం అంటే... 8 కిలోమీటర్ల రేడియస్‌ మాత్రమే కాదు.. రాష్ట్రం ఉంటే 1,62,967 చదరపు కిలోమీటర్ల భూభాగం. మన రాష్ట్రం అంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం. కేవలం 50 వేల ఎకరాల లబ్దికోసం మాత్రమే ఉన్న భూమి కాదు. చంద్రబాబు దృష్టిలో రైతులు అంటే కేవలం 35వేల ఎకరాల భూమిలిచ్చిన రైతులు మాత్రమే అనుకుంటే కుదరదు. మన దృష్టిలో రైతులంటే ఈ 35 వేల ఎకరాలిచ్చిన రైతులతో పాటు రైతుభరోసాను అందుకుంటున్న మరో 50 లక్షల మంది రైతులు అన్నది మర్చిపోకూడదు. 

చాలా సందర్భాల్లో చంద్రబాబు ఆయనతో పాటు దుష్టచతుష్టయం సభ్యులందరూ వాళ్ల పేపర్లలోనూ, టీవీల్లోనూ కామన్‌గా అనే మాట... ఇది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని. దీనిపై ఆలోచన చేస్తే.. ఇక్కడ ఎన్ని ఎకరాల భూములన్నాయి, అవి అమ్మితే ఎంత వస్తుంది. ఈవిషయాలు అందరికీ తెలుసుండాలి. 
ఇక్కడ గ్రీన్‌  ట్రిబ్యునల్, రివర్‌ కన్జర్వేషన్‌ పరిధిలో ఉన్న ప్రాంతాలు.. అంటే కృష్టా నదీ పరివాహక ప్రాంతాలు  దాదాపు 820 ఎకరాలు ఇక్కడ ఉన్నాయి. లంక భూములు,  ఎన్జీటీ, నదీ గర్భంలో ఉన్నవి, కరకట్ట భూములు కూడా ఉన్నాయి. ఈ భూమి తీసేస్తే... మరో 4997 ఎకరాల భూమి ఉంది. మొత్తం 5817 భూమి ఉంది. వీటిలో 820 ఎకరాల భూమి అమ్మాలనుకున్నా ఎన్జీటీ కోర్టు అంగీకరించదు. 

05–02–2019న చంద్రబాబు ప్రభుత్వంలోనే ఇచ్చిన జీవో ప్రకారమే 5020 ఎకరాలు మాత్రమే కమర్షియల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఉంది అని చెప్పారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 దొంగలముఠా సభ్యులందరూ కూడా పదివేల ఎకరాలు, 20 వేల ఎకరాలు ఉన్నాయని చెప్తారు. ఇష్టమొచ్చినట్లు రాస్తారు, టీవీల్లో చూపిస్తారు. అందరూ కలిసి ప్రజలను మోసం చేస్తారు. 

రామోజీయా ?, రాధాకృష్ణా ? ఈ భూములు ఎవరు కొంటారు ? 
5020 ఎకరాలు మాత్రమే ఆయన లెక్కల ప్రకారం ఉన్న భూమి. ఈ భూమిని ఎకరాకు రూ.20 కోట్ల చొప్పున  ఇవాళ మన చేతిలోకి డబ్బు వచ్చేటట్టు అమ్మితేనే...  రూ.1లక్ష కోట్లతో ఈ భూమిలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇవాళ ఈరోజు ఇంత ధర ఉందా. ఇంత ధరకు బాబు కొంటాడా ? పోనీ రామోజీరావు కొంటాడా? రాధాకృష్ణ కొంటాడా? పోనీ టీవీ5 నాయుడు కొంటాడా? ఇంత ధర లేనప్పుడు ఈ మధ్య కాలంలో ఈనాడు రాసింది.. ఎకరం రూ.10 కోట్లకు కొంటారా అని వీళ్లు మనల్ని తిరిగి అడుగుతున్నారు ? మీరే ఎకరా రూ.10 కోట్లకు కొంటారా అని మమ్నల్ని అడుగుతున్నారు ? మీరే కొనలేరు, ఈ రేటు రాదని చెబుతున్నారు, మరి ఈ ప్రాజెక్టు ఎలా చేయగలుగుతాం అని నేను మిమ్నల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ? ఎకరాకు రూ.20 కోట్లు వస్తే రూ.1 లక్ష కోట్లు అవుతుంది. ఎకరాకు రూ.10 కోట్లు రాదని మీరే చెప్తున్నారు. మరలా మీరే గజం రూ.17వేలకు కూడా ఎవరూ రాలేదు అని రాస్తారు.  4 బిడ్లు మాత్రమే వచ్చాయి అని రాస్తారు. అలా చూసుకున్నా.. 2500 గజాలు ఎకరాకు వస్తున్నా.. ఎకరా రూ.4 కోట్లు అవుతుంది. దానికి కూడా ఎవరూ రావడం లేదు. 
మరి ఏ రకంగా ఈ ప్రాజెక్టు మనం చేయగలుగుతాం ?. ఇంత డబ్బులు ఎక్కడ నుంచి తీసుకుని రాగలుగుతాం ? ఇంత డబ్బులు మనం తీసుకునిరాలేకపోతే ఈప్రాజెక్టు అడుగులు మందుకు పడకపోతే ఈ ప్రాంతంలో ఉన్న రైతులేం కావాలి ? బినామీలు ఎలాగూ పోతారు. మరోవైపు రూ.1.10 లక్షల కోట్లు ఇక్కడ పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది.

*పది శాతం డబ్బుతో విశాఖపట్నం అభివృద్ధి.*
ఇందులో కేవలం 10శాతం అంటే రూ.1.10 లక్షల కోట్లకు గానూ... కేవలం రూ.10 వేల కోట్లు విశాఖలో పెడితే చాలు. విశాఖపట్నాన్ని మనం ఎక్కడికో తీసుకునిపోతాం. ఎందుకంటే విశాఖలో ఇప్పటికే రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి కనీస వసతులు ఉన్నాయి. వీటి మీద మనం డబ్బులు పెట్టాల్సిన పనిలేదు. కేవలం మెరుగులు దిద్దేందుకు మాత్రమే కాస్తా, కూస్తో డబ్బులు పెట్టాలి. విశాఖపట్నం మాత్రమే ఎందుకు చెబుతున్నాననంటే... విశాఖపట్నం అంటే నాకు ఎక్కువ ప్రేమ లేదు, అమరావతి అంటే తక్కువ ప్రేమ ఉందని కాదు. అమరావతి ప్రజలైనా, విశాఖపట్నం ప్రజలైనా నాకు సమానమే. కాకపోతే విశాఖపట్నం రాష్ట్రంలో అతిపెద్ద నగరం. ఇది నిజం. దశాబ్ధాలుగా అక్కడ అభివృద్ధి జరిగింది. అక్కడ జరిగిన అభివృద్ధికి మరికాస్తా తోడ్పాటునందిస్తే... మరో రూ.10 వేల కోట్లు పెడితే ఇంకా పెద్ద నగరం అవుతుంది. ఇది వాస్తవం. 

అక్కడ విశాఖపట్నంలో మనం చేయగలం. అక్కడ మనం చేయగలిగిన చోట వీళ్లు  చేయకుండా అడ్డుకుంటారు. ఇక్కడ మనం చేయలే ం, బాబూ చేయలేదు. అయినా బాబు చేయలేని దాన్ని, ఎవరూ చేయలేని దాన్ని మనం చేయాల్సిందే అని చెప్పి.. రోజూ ధర్నాలు, డ్రామాలు, డ్యాన్సులు ఇదే జరుగుతోంది. మన మీద బురద జల్లాలని దుర్భిద్ధితో డ్రామాలు ఆడుతున్నారు. దీనిమీద ప్రజలందరూ ఆలోచన చేయాలి.

*చంద్రబాబు విజయవాడకేం చేశాడు ?* 
విశాఖçపట్నాన్ని కాస్తా పక్కనపెడితే.. విజయవాడకు చంద్రబాబు ఏం చేశాడో చూద్దాం. మన ప్రభుత్వం వచ్చాక.. ఈ ప్రాంత అభివృద్ది మీద ఎంత శ్రద్ధ పెట్టామన్నది ఈ సభ సాక్షిగా కొన్ని విషయాలు చెప్తాను.
విజయవాడకు పశ్చిమ బైపాస్‌ అభివృద్ధి చెందుతుంది. గన్నవరం సమీపంలోని చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు రూ.1321 కోట్లతో 30 కిలోమీటర్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీనిలో 17.08 కిలోమీటర్లు పూర్తయింది. 65 శాతం పనులను 65 శాతం నిధులు వెచ్చించి పూర్తి చేశాం. వచ్చే ఏడు పిబ్రవరి నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయి. ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పనులన్నీ ఎందుకు పూర్తి చేయలేదు. గొల్లపూడి నుంచి కృష్టానది మీదుగా బ్రిడ్జి కట్టి.. చిన కాకాని వద్ద చెన్నై జాతీయ రహదారిని కలిసే రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. ఇది 18 కిలోమీటర్లు రోడ్డు. రూ.1600 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 33 శాతం పనులను 31 శాతం నిధులు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. 2024లో ఇది పూర్తవుతుంది. 

ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు రాకుండా... దీన్ని అడ్డుకున్నది ఎవరు. ఎందుకీ ప్రాజెక్టును రానివ్వలేదు. ఎందుకు దీన్ని అడ్డుకున్నారు. భూసేకరణ చంద్రబాబునాయుడు గారు రాకముందే రాజశేఖర్‌రెడ్డి గారు హయాంలోనే పూర్తయింది. పనులు మొదలుపెట్టి పూర్తి చేయాల్సింది ఎందుకు చేయలేదు ? విజయవాడ– మంగళగిరి బాగా విస్తరించడానికి ఈ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుంది. కారణం విజయవాడ, మంగళిగిరి అభివృద్ధి కాకూడదు. కారణం అమరావతిలో బినామీల భూముల విలువ పెరగాలి.
 
 ఇదే విజయవాడ బాగు పడాలని చెప్పి రూ.100 కోట్లు ఇచ్చి, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనులు కూడా చేయించడం జరుగుతోంది. ఇదే విజయవాడ నదికి ఆనుకుని ఉన్న ప్రజలు ఎప్పుడు వర్షాలు వచ్చినా, మూడు, నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి మొత్తం కృష్ణలంక ప్రాంతం మునిగిపోయేది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పెద్ద మనిషి ఏనాడూ పట్టించుకోలేదు. అక్కడ రీటెయినింగ్‌ వాల్‌ కట్టడం కోసం రూ.137 కోట్లతో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వాల్‌ పూర్తి చేశాం. నదికి అటువైపు మరో కిలోమీటర్‌ మేరకు రీటెయినింగ్‌ వాల్‌ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. దీనివల్ల అక్కడ.. ప్రకాశం బ్యారేజీలో ఈ స్థాయిలో వరదలు వచ్చినా ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే పెద్దమనిషి చంద్రబాబుగారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరకట్ట రోడ్డు.
కరకట్టకు ఇటువైపున ఆయన నివాసం. ఉండకూడని ప్రదేశంలో
ఆయన ఉంటున్నాడు. అది వేరే విషయం. అదే కరకట్టకు ఇంకోవైపు ఆశ్చర్యం. ఒకవైపు వాహనం వస్తే, మరో వెహికిల్‌ పోవడం కష్టం. కానీ ఈ పెద్దమనిషి కనీసం 5 ఏళ్లు ఆ రోడ్డును వెడల్పు చేయలేదు. కనీసం ఆ పనులు కూడా మొదలు పెట్టలేదు.
రూ.150 కోట్లు ఇచ్చి మనం ఆ పనులు మొదలు పెట్టాం. ఇదే విజయవాడలో బందరు రోడ్‌లో అంబేడ్కర్‌ పార్క్‌. రూ.260 కోట్ల వ్యయంతో విజయవాడ ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు, సాయంత్రం వాకింగ్‌ చేయడం కోసం పార్క్‌ నిర్మిస్తున్నాం. వేగంగా పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయి.
ఇదే విజయవాడలో కనకదుర్గమ్మ గుడి. ఆ తల్లి చల్లని దీవెనలతోనే మనం క్షేమంగా ఉన్నాం. కానీ ఏ రోజైనా కానీ ఆ గుడిని అభివృద్ది చేయాలని ఆ పెద్దమనిషి ఆలోచన చేయలేదు. అదే మన ప్రభుత్వం ఆ గుడి కోసం రూ.70 కోట్లు ఇచ్చింది. అదే చంద్రబాబు తన హయాంలో 40 గుడులు కూల్చేశాడు.

ఏదైనా చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే పనులు జరుగుతాయి. డ్రామాలు చేస్తే చివరకు గ్రాఫిక్స్‌ మాత్రమే మిగులుతాయి.
వికేంద్రీకరణ అనేది ఒక అవసరం. రాజధానులకు మాత్రమే కాదు. పరిపాలన అనేది మారుమూల గ్రామాలకు సైతం ఎఫెక్టివ్‌గా అందాలంటే వికేంద్రీకరణ అవసరం.
వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణల విషయంలో మనందరి ప్రభుత్వం ఎలా ముందుకు అడుగులు వేసిందో చెబుతాను.

మూడేళ్ల క్రితం రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు ఉంటాయా? ఎలా ఉంటాయి? వాటి వల్ల ఎలా మేలు జరుగుతుంది? అని అనుకున్నారు. కానీ ఈరోజు అన్నీ కనిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా? చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎం అంటాడు. గతంలో 5 ఏళ్లు పరిపాలన చేశాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. కానీ ఆయన కనీసం ఏనాడైనా ఊహించాడా? గవర్నెన్స్‌ను ఈ మాదిరిగా ఇంప్రూవ్‌ చేయగలుగుతాం. వ్యవస్థలో అవినీతి లేకుండా చేయగలుగుతాం. వివక్ష లేకుండా మంచి చేయగలుగుతాం. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఏర్పాటు చేసి, మన పిల్లలు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి, అక్కడే కూర్చోబెట్టి, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఉండి, ప్రతి మనిషి, ప్రతి కుటుంబానికి సేవలందించమని ఏ రోజైనా ఆయన ఆలోచన చేశాడా?

మూడేళ్ల క్రితం రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు లేవు. ఇవాళ ఏకంగా 15,004 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో దాదాపు 600 రకాల సేవలందిస్తున్నాం. ప్రతి 2 వేల మందికి ఒక సచివాలయం. వాటిలో దాదాపు 1.20 లక్షల మన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఇక్కడ ఒక సంతోషకరమైన విషయం ఆ 1.20 లక్షల ఉద్యోగుల్లో 83 శాతం నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. నా చెల్లెమ్మలు. నా తమ్ముళ్లు. ఈ విషయం సంతోషంగా చెబుతున్నాను. వికేంద్రీకరణ అంటే ఇది.
మూడేళ్ల క్రితం గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఎఫెక్టివ్‌గా తేగలుగుతాం. అవినీతికి తావు లేకుండా చేయగలుగుతాం. వివక్ష లేకుండా సేవలందించగలుగుతాం అని ఈ చంద్రబాబునాయుడు బుర్రకు కనీసం ఏరోజైనా తట్టిందా?
ఇవాళ 2.70 లక్షల గ్రామ వలంటీర్లు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలందిస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ శహభాష్‌ అనే విధంగా సేవలందిస్తున్నారు.
వికేంద్రీకరణ అంటే ఇది. ప్రతి నెలా ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి తలుపు తట్టి, సామాజిక పెన్షన్‌ ఇస్తున్నారు. ఇది చంద్రబాబుకు ఏనాడైనా తట్టిందా?
రేషన్‌ సరుకు. ఇంటి వద్దే డోర్‌ డెలివరీ చేస్తున్నాం. ఏమన్నా అంటే 14 ఏళ్లు సీఎం అంటాడు. చంద్రబాబుకు ఇది ఏనాడైనా తట్టిందా? ఇది వికేంద్రీకరణ అంటే.
గ్రామ సచివాలయంలో ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా, కచ్చితంగా గడువు పెట్టి, అది ఇచ్చే మెకానిజమ్‌ పెట్టాం. ఇది ఆ పెద్దమనిషికి కనీస ఏ రోజైనా తట్టిందా? వికేంద్రీకరణ అంటే ఇది.
ఇక రైతు భరోసా కేంద్రాలు. ఈ కాన్సెప్ట్‌ ఆ పెద్దమనిషికి కనీసం ఏనాడైనా తట్టిందా.
ఇవాళ రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఇది వికేంద్రీకరణ అంటే.
వ్యవసాయ శాఖ కార్యాలయం రాజధానిలో ఉంటుంది. అందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే, అక్కడ స్థలాల రేట్లు పడిపోతాయని ఎవరైనా ఉద్యమం చేస్తే ఎలా ఉంటుంది? ఇవాళ వారు చేస్తోంది అదే!
అన్నీ ఇక్కడే ఉండాలి. అన్నీ ఇక్కడికే రావాలి. రాజధానిలో భూముల రేట్లు పెరగాలి. అదే వారి ఉద్దేశం.

వికేంద్రీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, విలేజ్‌ క్లినిక్‌లు ఇవన్నీ కూడా మన గ్రామంలనే అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. వికేంద్రీకరణ అంటే ఇది.
ఇటీవలే నేను పులివెందులలోని వేల్పుల వద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించాను. అక్కడ డిజిటల్‌ లైబ్రరీ ఉంది. 30 మంది పిల్లలు అక్కడ పని చేస్తున్నారు. హైబ్యాండ్‌విడ్త్‌తో అక్కడ ఇంటర్నెట్‌ ఉంది. వికేంద్రీకరణ అంటే ఇది. ఆ పెద్దమనిషికి కనీసం ఏనాడైనా తట్టిందా?
గత 75 ఏళ్లలో కేవలం 2 జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేస్తే, వికేంద్రీకరణకు అర్ధం చెబుతూ, 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. 51 రెవెన్యూ డివిజన్లను 75కు పెంచాం. అదే విధంగా 91 పోలీస్‌ డివిజన్లు ఉంటే వాటిని 103కు పెంచి వికేంద్రీకరణకు అర్ధం చెప్పాం.

చివరకు కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ పెట్టమని చంద్రబాబుగారు నాకు లేఖ రాశారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ఏం గాడిదలు కాశాడో తెలియదు. కుప్పంలో ప్రజలు ఒత్తిడి చేస్తే, ఈరోజు నన్ను అడగక తప్పని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. 14 ఏళ్లు సీఎం. 40 ఏళ్ల ఇండస్ట్రీ. అది ఆయన పని. ఇది నిజమైన వికేంద్రీకరణ.
పరిపాలన వికేంద్రీకరణ ఏ విధంగా ఫలితాలనిస్తోంది అన్నది మొన్నటి గోదావరి వరదల్లో చూశాం. గత 40 ఏళ్లలో ఏనాడూ ఆ స్థాయిలో వరదలు రాలేదు. కేవలం వికేంద్రీకరణ వల్లనే వరదల్లో బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందాయి. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ముట్టాయి. అందుకే ఒక్కరు కూడా తమకు అవి అందలేదని చెప్పలేదు. అది వికేంద్రీకరణ అంటే.

కోవిడ్‌ సమయంలో కూడా మన వలంటీర్ల సేవలు అద్భుతం. మొన్న గోదావరి వరదల్లో కూడా వలంటీర్లు కట్టల వద్ద నిఘా వేసి, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.
గతంలో గోదావరికి వరదలు వస్తే, కేవలం ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే. కానీ మొన్న ఏకంగా ఆరుగురు కలెక్టర్లు. ఆరుగురు ఎస్పీలు. ఇంకా సచివాలయాల సిబ్బంది. మొత్తం 30 వేల మంది సైనికుల్లా పని చేశారు.
మన రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండగా, మరో 16 కాలేజీలు వికేంద్రీకరణలో రానున్నాయి. పార్వతీపురంలో మరో మెడికల్‌ కాలేజీ కూడా రానుంది.

మన రాష్ట్రంలో టయర్‌–1 సిటీలు లేవు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు లేవు. అందుకే ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగా ఏకంగా 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు సూపర్‌ స్పెషాలిటీ వైద్య నిపుణులు వస్తారు.
అందుకే నేను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉంటున్న మూడేళ్ల ఉంచి ప్రతిసారి వికేంద్రీకరణ గురించే మాట్లాడాను. ఇంకా చెప్పాలంటే శ్రీబాగ్‌ ఒప్పందం మొదలు శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ, బోస్టన్‌ గ్రూప్, ఎక్స్‌పర్ట్స్‌ గ్రూప్‌ వరకు కూడా అందరి అభిప్రాయం ఇదే. వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలి.

*ఇక్కడ ఒక సామెత గుర్తుకు వస్తుంది*. ‘తిమిరి ఇసుము నుంచి తైలమ్ము తీయవచ్చు. మృగతృష్ణలో నీరు త్రావవచ్చు. కుందేటి కొమ్ము సాధించవచ్చు. మూర్ఖుని మనసు రంజింప శక్యమేనా’.. ఇది అన్నది భర్తృహరి.  ఆయన సుభాషితం. దీని అర్ధం. ఇసుక నుంచి నూనె తీయొచ్చు. ఎండమావిలో నీరు తాగొచ్చు. కుందేటి కొమ్ము సాధించవచ్చు కానీ.. చంద్రబాబు వంటి వాణ్ని, ఈ దుష్ట చతుష్టయాన్ని ఈ మూర్ఖత్వం నుంచి ఒప్పించడం మాత్రం ఎవరి వల్లా కాదని.
వికేంద్రీకరణ వల్ల ఇంత మంచి జరుగుతుంటే, ఇంత మంచి కనపడుతుంటే, దీన్ని కూడా డ్రమటైజ్‌ చేసి, వక్రీకరించి, అబద్ధాలు జోడించి, ప్రాంతాల మధ్య భావోద్వేగాలు పెంచుతున్నారు.
అసలు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఉత్తరాంధ్రకు వెళ్లి, అక్కడి దేవుడిని ఏమని మొక్కుతారు. అభివృద్ధి అంతా ఇక్కడే ఉండాలని, అక్కడి, ఆ ప్రాంత దేవుడిని మొక్కుతారట. ఉత్తరాంధ్ర ప్రజలు ఇది చూసి గమ్ముగా ఉండాలంట. వారికి భావోద్వేగాలు ఉండవా?
మరి వాళ్లకు భావోద్వేగాలు ఉన్నప్పుడు వారిని రెచ్చగొట్టడానికి ఏకంగా ఈ మనిషి వీరందరినీ అక్కడికి పంపించడం ధర్మమేనా? అంటే వారు వారు కొట్టుకోవాలి.

ఈ పెద్దమనిషికి బాగా తెలుసు. ఆయనకు గతంలో 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కుప్పం కూడా పోతుంది. ఏ సీట్లు రావు. అందుకే పెట్రోల్‌ పోసి భావోద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. నారా హమారా అంటూ.. యాత్రలు మొదలు పెట్టించి, రాజకీయాల కోసం దిక్కుమాలిన పని చేస్తున్నాడు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లాభం పొందాలని చూస్తున్నాడు. అంత నీచమైన స్థాయికి ఏ నాయకుడూ పోడు.
కేవలం చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. అందరూ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీరంతా పోతే తప్ప, రాష్ట్రం బాగుండదు. వారు పోతే ప్రజలంతా సంతోష పడతారు.
ఇక్కడ ఒక సేయింగ్‌ గుర్తుకు వస్తోంది. ‘నేను మాత్రమే బాగుండాలంటే అది స్వార్థం. అందరం బాగుండాలంటే అది ఒక సమాజం’.
మనం తీసుకొస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో కనీసం 90 శాతం ప్రజలకు మేలు చేస్తున్నాయి. గ్రామ సచివాలయం మొదలు, రాష్ట్ర స్థాయి వరకు మన ఎజెండా ఒక్కటే. ఇంటింటికీ, ప్రతి మనిషికి మేలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.

నేను మరోసారి ఈ విషయం స్పష్టం చేస్తున్నాను. నేను ఈ ప్రాంతానికి వ్యతిరేకం కాను. అందుకే మూడు రాజధానుల్లో ఒకటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను.
నాటి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలోని 33 నియోజకవర్గాలలో మన పార్టీ 29 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందింది. మంచి చేస్తున్నాం కాబట్టే, 2019 ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో మన పార్టీ పూర్తి స్వీప్‌ చేసింది. ఇది కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే కాదు. రాష్ట్రమంతా అవే ఫలితాలు వచ్చాయి.

ఎంపీటీసీ ఎన్నికల్లో 86 శాతం.. 8,298 చోట్ల వైయస్సార్‌సీపీ గెల్చింది. ఎంపీపీలు 637 వైయస్సార్‌సీపీకి అంటే 98 శాతం వచ్చాయి, జడ్పీటీసీలు 639 వైయస్సార్‌సీపీకి అంటే 98 శాతం వచ్చాయి. జడ్పీ ఛైర్మన్లు మొత్తం 13 గెల్చుకుంది. అది 100 శాతం. 14 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 100 శాతం గెల్చాం. మున్సిపాలిటీలు 86 చోట్ల పోటీ జరిగితే 84 చోట్ల వైయస్సార్‌సీపీ గెల్చింది.
ఇలా ప్రతి అడుగులో కూడా వికేంద్రీకరణ ఒక మంత్రంగా, అభివృద్ధి అనేది ప్రతి ఇల్లు, ప్రతి మనిషికి అందేలా పారదర్శకంగా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ, అలా చేయగలమా? ఇవ్వగలమా? అని మేధావులకూ సందేహం వచ్చే పరిస్థితుల్లో.. దేవుడి దయతో దాన్ని సాకారం చేసి చూపాం.

ఇలానే ప్రజలు దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు ఈ చర్చ వల్ల కనీసం చంద్రబాబుకు, ఆయన పార్టీకి, ఆయనను మోస్తున్న దుష్ట చతుష్టయానికి జ్ఞానోదయం కావాలని, తద్వారా అయినా కనీసం వారు ప్రోత్సహిస్తున్న ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడాన్ని ఆపుతారని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను.
 

Back to Top