మీ బాగోగులు చూసుకోవడం మా బాధ్యత

ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన విద్యార్థుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

విద్యార్థుల చదువుల గురించి సీఎం ఆరా 

విద్యార్థులను సురక్షితంగా తీసుకువ‌చ్చిన అధికారులకు అభినందన‌లు

శాసనసభ: యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ ‌నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అండగా ఉంటామని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భ‌రోసానిచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా.. వారికి వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులు, అధికారులు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు విద్యార్థులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించానని, నా ఆదేశాలను అందుకున్న వెంటనే వారంతా రంగంలోకి దిగార‌న్నారు. విద్యార్థుల‌ను ఉక్రెయిన్ నుంచి సుర‌క్షితంగా తీసుకొస్తూ చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు త‌న‌కు నివేదించార‌న్నారు. రాష్ట్రానికి చెందిన పిల్లలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకోవడం మా బాధ్యత అని సీఎం అన్నారు. దాన్ని అధికారులు సక్రమంగా నిర్వర్తించారన్నారు. విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడంలో సమర్థ‌వంతంగా వ్యవహరించిన అధికారులకు అభినందన‌లు తెలిపారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు తగిన పరిష్కారం లభించేలా మార్గాలను అధికారులు అన్వేషించాల‌ని సీఎం ఆదేశించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాయాలని నిర్ణయించారు. 

విద్యార్థులతో వివిధ అంశాలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. విద్యార్థుల చదువులు గురించి ఆరా తీశారు. విద్యార్థులు వారు కోర్సులను ఎంతవరకు పూర్తిచేశారో తెలుసుకున్నారు. తదుపరి వారి కోర్సులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈవిషయంలో ప్రభుత్వం పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 

వీవీఐపీల్లా చూసుకున్నారు: విద్యార్థులు

  • ఉక్రెయిన్‌నుంచి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని సీఎంకు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు. 
  • దేశం మొత్తంమీద ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అన్నిరకాలుగా చర్యలు తీసుకుందన్న సీఎం. 
  • ఉక్రెయిన్‌ సమీప దేశాలకు చేరుకున్న దగ్గరనుంచి ఆహారం, వసతి విషయాల్లో బాగా చూసుకున్నారన్న విద్యార్థులు.
  • దీంతోపాటు దేశంలో అడుగుపెట్టిన దగ్గరనుంచి కూడా స్వస్థలాలకు చేరేంత వరకూ కూడా ఫ్లైట్‌టిక్కెట్లు దగ్గరనుంచి ప్రయాణ, వసతి సదుపాయాలను ఏర్పాటు చేశారన్న విద్యార్థులు.
  • ఎయిర్‌పోర్టుల్లో వీవీఐపీల తరహాలో స్వాగతం పలికారని, ఆ తరహాలో అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న అధికారులు
  • చేసిన పనిని చెప్పుకోకుండా.. వెనుకనుండి యంత్రాంగాన్ని సీఎం నడిపిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్న విద్యార్థులు. 
  • ఈ తరహా చర్యలు తీసుకున్నప్పుడు సహజంగానే విపరీత ప్రచారం చేసుకుంటారని, సామాజిక మాధ్యమాల వేదికగా తమను తాము ప్రశంసించుకుంటారని.. అలాంటి పోకడలకు ఏపీ ప్రభుత్వం, అధికారులు దూరంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్న విద్యార్ధులు.
  • చేయాలనుకున్న పనిని చిత్తశుద్ధితో చేసిన తీరు తమకు స్ఫూర్తిదాయకమని సీఎంతో అన్న విద్యార్థులు.
  • డాక్టర్ వైయస్సార్‌ గారి స్ఫూర్తితో వైద్యవిద్యను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నానని తెలిపి కడపకు చెందిన విద్యార్థిని
  • మా అందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలని సీఎంను కోరిన విద్యార్థులు. 
  • తమకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు.

కార్యక్రమంలో ఏపీ ఉక్రెయిన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్, సీఈఓ కె దినేష్‌ కుమార్, టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సభ్యులు అహ్మద్‌ బాబు, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, యూకేలో ప్రత్యేక ప్రతినిధి రవి రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top