స్మార్ట్‌ పోలీసింగ్‌లో ఏపీకి నంబర్‌ వన్‌ ర్యాంక్

ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడి

పోలీసుల‌కు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ అభినందన‌లు

స‌చివాల‌యం: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించడంలో భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఏపీ పోలీస్‌ శాఖను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మనస్ఫూర్తిగా అభినందించారు. ఇదే రీతిలో ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించి ఈ ప్రస్థానాన్ని కొనసాగించాలని సీఎం ఆకాంక్షించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పోలీస్‌ ఉన్నతాధికారులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి.. స్మార్ట్‌ పోలీసింగ్‌ సర్వే రిపోర్ట్‌ను సీఎంకు అంద‌జేసి.. వివరాలు వెల్లడించారు. 

స్మార్ట్‌ పోలీసింగ్‌పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్ (ఐపిఎఫ్‌) సర్వే నిర్వహించింది.  తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాలలో సర్వే కొన‌సాగింది. 2014 డీజీపీల సదస్సులో స్మార్ట్‌ పోలీసింగ్‌ పద్దతులను పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపున‌కు స్పందించి స్మార్ట్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ సర్వే నిర్వ‌హిస్తోంది. ఏడేళ్లుగా నిర్వహిస్తున్న సర్వేలో ఏపీ పోలీస్‌ శాఖ తొలిసారిగా మొదటి ర్యాంకు సాధించింది. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపీఎఫ్ సర్వే నిర్వహించింది. ఐపీఎఫ్‌లో సభ్యులుగా రిటైర్డ్‌ డీజీలు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌర సమాజానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. 

ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత, చట్టబద్ద, పారదర్శక పోలీసింగ్, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపీ నంబర్‌ వన్ స్థానంలో నిలిచింది. పోలీస్‌ సెన్సిటివిటీ, పోలీసుల ప్రవర్తన, అందుబాటులో పోలీస్‌ వ్యవస్ధ, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం విభాగాలలో కూడా అత్యుత్తమ ర్యాంకు సాధించింది. 

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, అడిషనల్‌ డీజీ (బెటాలియన్స్‌) శంకబ్రత బాగ్చి, డీఐజీ (టెక్నికల్‌ సర్వీసెస్‌) పాలరాజు, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ త‌దిత‌రులు ఉన్నారు. 

Back to Top