విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలి 

నూతన విద్యావిధానంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సమీక్ష

ఈనెల 16న పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యాకానుక ప్రారంభం

ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

నూతన విద్యావిధానం స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరణ ఖరారు

టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలి 

అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పడుతుంది

విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల వల్ల మంచి ఫలితాలు

తాడేప‌ల్లి: విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో నూతన విద్యావిధానంపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడంపై తయారుచేసిన ప్రతిపాదనలు అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. ఈ నెల 16వ తేదీన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న‌న్న విద్యా కానుక పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. 

నూతన విద్యావిధానం స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరణ ఖరారు
శాటిలైట్‌ స్కూల్స్‌ ( పీపీ–1, పీపీ–2)
ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2. 1, 2)
ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌  ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)
ప్రీ హైస్కూల్స్‌  ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)
హైస్కూల్స్‌ ( 3 నుంచి 10వ తరగతి వరకూ )
హైస్కూల్‌ ప్లస్‌  (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ)
పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణవల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌   44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్‌ అవుతాయని వివరించిన అధికారులు.

 వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలి: సీఎం
నూతన విద్యావిధానం స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరణ ఖరారు చేయ‌డంతో అందుకు త‌గ్గ‌ట్టుగా టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాల‌న్నారు. టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాల‌ని సూచించారు. 

వివిధ తరగతుల్లో ఉన్న సబ్జెక్టులు, వాటి వివరాలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అడిగి తెలుసుకున్నారు. ఆర్టీఈ నిబంధనలను అనుసరిస్తున్నామని  అధికారులు తెలిపారు. ఆ నిబంధనలను పాటిస్తూనే... 3వ తరగతి నుంచి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో విషయ నిపుణులైన టీచర్లద్వారా చక్కటి బోధన అందించడానికి తగిన సంఖ్యలో టీచర్లను పెట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని   సీఎం ఆదేశాలు జారీ చేశారు. నూతన విద్యా విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటార‌ని తెలిపారు.

ఇంగ్లిషు మీడియంలో బోధన  :
ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఇంగ్లీష్ మీడియం బోధ‌న అందితే ప్రపంచస్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులు తయారు అవుతార‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. చిన్ననాటినుంచే వారికి నైపుణ్యం ఉన్న టీచర్లు అందుబాటులో ఉంటార‌ని తెలిపారు. సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలోకూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయ‌న్నారు. 
దీనివల్ల ఉపాధ్యాయులపై పనిభారం కూడా తగ్గుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పడుతుందని చెప్పారు. 

తెలుగు త‌ప్ప‌నిస‌రి..
ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం ఆదేశించారు. నూతన విద్యావిధానం, నాడు –నేడుల కోసం మొత్తంగా సుమారు రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 
నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని సూచించారు. ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నూతన విద్యా విధానం ఉద్దేశాలను వారికి వివరంగా తెలియజేయాలని సూచించారు. 

నూతన విద్యా విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.  దీనిపై ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.  

విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల వల్ల మంచి ఫలితాలు:
అమ్మ ఒడి, ఇంగ్లిషు మీడియం, నాడు – నేడు తదితర విప్లవాత్మక మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని సీఎంకు అధికారులు వివ‌రించారు. 2014–15 నాటికి రాష్ట్రంలోని అన్నిరకాల స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ 72.33 లక్షలు కాగా 2018–19 నాటికి అది 70.43 లక్షలకు పడిపోయిందని అధికారులు చెప్పారు. అమ్మ ఒడి పథకం వల్ల 2020–21 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 73.06 లక్షలకుచేరుకుందని వివ‌రించారు. 2.63 లక్షలమంది పిల్లలు అధికంగా చేరారని సీఎంకు అధికారులు వివ‌రాలు అంద‌జేశారు.

  ప్రభుత్వ పాఠశాలల్లో 2014–15 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య 42.83 లక్షల మంది .కాగా 2018–19 నాటికి ఆ సంఖ్య 37.21 లక్షలకు పడిపోయిందన్నారు.  2020–21 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 43.44 లక్షలకు చేరిందని తెలిపిన అధికారులు. ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకం పెరిగిందని, అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపాలన్న కోరిక బలపడిందని   అధికారులు తెలిపారు.  అమ్మ ఒడి పథకం ద్వారా స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించిన డేటా వివరాలు పక్కాగా ఉన్నాయని  పేర్కొన్నారు. 

సామాజిక తనిఖీల ద్వారా ( సోషల్‌ ఆడిట్‌) కచ్చితమైన డేటా రూపొందిందని   అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు. చదువుకుంటున్న పిల్లలకు సంబంధించిన వివరాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇంత పక్కాగా లేవని అధికారులు పేర్కొన్నారు.

సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top