ముగిసిన సీఎం వైయ‌స్ జగన్ ఢిల్లీ పర్యటన

 ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి ఏపీకి బయల్దేరారు. రెండు రోజుల పాటు సీఎం వైయ‌స్‌ జగన్‌.. పలువురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్‌ గోయల్‌, షెకావత్‌‌, జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లను సీఎం కలిశారు. వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌.. రాత్రి వరకు సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం వైయ‌స్‌ జగన్‌ నిన్న రాత్రి 9 గంటల నుంచి 10.35 వరకు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సుహృద్భావ వాతావరణంలో సమావేశం సాగింది. అలాగే శుక్రవారం ఉదయం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం భేటీ అయ్యారు.

Back to Top