విశాఖ: అచ్యుతాపురం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అచ్యుతాపురం సెజ్ వద్ద ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ఉపముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, అనకాపల్లి ఎంపి సత్యవతితో పాటు స్వాగతం పలికిన వాళ్లలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ రవి సుభాష్, డి. ఐ. జి హరికృష్ణ,ఎస్పీ గౌతమీ శాలి ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యేలు యువి కన్నబాబు రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబూరావు, అన్నoరెడ్డి అదీప్ రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్,మాజీ డీసిసిబి చైర్మన్ సుకుమారవర్మ, గవర కార్పోరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, విశాఖ డెయిరీ వైస్ చైర్మన్ మరియు విశాఖ వెస్ట్ ఇన్ ఛార్జి ఆడారి ఆనంద్ తదితరులు ఉన్నారు. ► ముందుగా పరిశ్రమలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభిస్తారు. అనంతరం ఏటీసీ టైర్ల కంపెనీ రెండూ ఫేజ్కు, మరో 8 కంపెనీలకు శంకుస్థాపన చేస్తారు. ► తిరిగి మధ్యాహ్న సమయంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు, కోడల్ని సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం సమయంలోనే ఆయన తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. ►అచ్యుతాపురం, రాంబిల్లి క్లస్టర్ సెజ్కు 2000 సంవత్సరం తర్వాత అడుగులు పడ్డాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఈ సెజ్కు కీలక అనుమతులు వచ్చాయి. మొత్తం ఆరు వేల ఎకరాలను సేకరించారు. ► ఈ ప్రత్యేక ఆర్థిక మండలికి సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండటం ప్లస్ పాయింట్. ఇప్పటి వరకూ 60 వేల మందికి ఈ సెజ్లో ఉపాధి అవకాశాలు కల్పించారు. విశాఖ–చెన్నై కోస్టల్ కారిడార్లో అచ్యుతాపురం సెజ్కు కీలక స్థానం ఉందనే చెప్పాలి. పూడిమడక వద్ద ఏర్పాటు కానున్న హార్బర్ ద్వారా మరిన్ని దేశాలతో ఈ సెజ్ తన కార్యకలాపాల్ని విస్తరించనుంది. ► ఇప్పటికే బార్క్, బ్రాండిక్స్, ఆసియన్ పెయింట్స్ వంటి బ్రాండెడ్ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సెజ్లో యకహోమా కంపెనీ రూ.1,200 కోట్లతో తన కార్యకలాపాల్ని మంగళవారం ప్రారంభించనుంది. ► అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో.. రూ.1,002.53 కోట్లతో మరో ఎనిమిది పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్. ► అచ్యుతాపురం సెజ్లో తొలి దశలో రూ.1,384 కోట్లతో యూనిట్ ఏర్పాటు. రూ.816 కోట్లతో రెండో దశ పనులకు భూమి పూజ చేయనున్న సీఎం జగన్.