ఎస్‌ఈబీకి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ సహా జూదాల కట్టడి బాధ్యతలు

ఆదోని మ‌త ఘ‌ర్ష‌ణ‌ల కేసు ఉప‌సంహ‌ర‌ణ‌

కేబినెట్‌లో కీల‌క నిర్ణ‌యం

అమ‌రావ‌తి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ సమావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  ఎస్‌ఈబీ బలోపేతంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఎస్‌ఈబీ పరిధిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది.  ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ సహా జూదాల కట్టడి బాధ్యతలను ఎస్‌ఈబీకి అప్ప‌గించ‌నున్నారు. డ్రగ్స్, గంజాయి నిరోధించే బాధ్యతలూ కూడా ఎస్‌ఈబీకి అప్పగించాలన్న ఆలోచనలో ఏపీ సర్కార్‌ ఉంది. అలాగే నవంబర్ 24న జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సున్నా వడ్డీ కింద 10 వేల రూపాయల రుణ సదుపాయం కల్పించనుంది. ఇక, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు-2019లోని 75,76 క్లాజుల రద్దు సవరణకు నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినేట్. పులివెందుల మండలం కె.వి.పల్లి గ్రామం...ఆముదాల వలసలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు 11 ఎకరాల భూమి కేటాయించింది ఏపీ సర్కార్. అగ్నిమాపక సంస్థ బలోపేతానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు నుంచి నాలుగు జోన్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా వివిధ పోస్ట్‌లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఆదోనిలో మత ఘర్షణల కేసుల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.  అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని ముందు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవీ అందుకు ముందుకు రాలేదు. దీంతో పేరుగాంచిన ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సు చేసింది. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులపై చర్చించి  కేబినెట్ ఆమోదించింది. 

Back to Top