‘పులిచింతల ప్రాజెక్టు వద్ద వైయస్‌ఆర్‌ విగ్రహం’

 రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
 

 పులిచింతల: పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ‘పులిచింతల జల హారతి’ కార్యక్రమంలో అనిల్‌ కుమార్‌ తోపాటు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరె, సారెలను సమర్పించారు. అనంతరం పులిచింతల ప్రాజెక్టును మంత్రులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్టు వద్ద సుమారు 45 అడుగుల వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే వైయస్‌ఆర్‌ స్మృతి వనం, పార్కును నిర్మిస్తామని తెలిపారు. వైయస్‌ఆర్‌ విగ్రహంతో పాటు డా. కెఎల్‌ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రోడ్లు, భవనాలతోపాటు, నాలుగు కిలోమీటర్ల పాటు దిగువన ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ వారధి నిర్మిస్తామని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినట్టు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం శుభపరిణామం అన్నారు. మరో ఇరవై ఏళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్‌ సామినేని, ఎమ్మెల్యేలు నంబూరి శంకర్‌ రావు, జోగి రమేశ్‌ పాల్గొన్నారు.

Back to Top