త్యాగధనుల పోరాటాల ఫలితం.. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం

  ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం :భారతదేశ స్వతంత్ర పోరాటంలో పలువురు వ్యక్తులు విశేషమైన పాత్ర వహించారని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం శాంతి నగర్ కాలనీ లో గాంధీజీ గుడి వద్ద 105 అడుగుల జాతీయ జెండాను జిల్లా అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. విదేశీయుల ఉక్కు పిడికిలి నుండి భరతమాతకు  విముక్తి  కల్పించిన పోరాటయోధుల పాత్రను భావితరాలు గుర్తెరగాలని ఆయన సూచించారు.వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ సమైక్యత, సమగ్రత కు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.స్వతంత్ర పోరాటంలో స్పూర్తిదాయక పాత్ర వహించిన మహాత్మా గాంధీ ధన్యజీవిగా నిలిచారని ఆయన కొనియాడారు.శాంతి, అహింసలే ఆయుధాలుగా బ్రిటిషర్లతో పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మా గాంధీ అన్నారు.దక్షిణాఫ్రికా నుండి భారత్‌  వచ్చాక, అనతి కాలంలో ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగారన్నారు.శాంతియుత పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించారన్నారు.
అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని గుర్తు చేశారు. ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శం అన్నారు.250 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి మహాత్ముడు చూపిన పోరాట పంథా ప్రధాన కారణమన్నారు.అన్నదాతలకు మద్దతుగా గాంధీజీ శాంతి యుతంగా పోరాటం చేసి విజయం సాధించారన్నారు.. ఖిలాపత్ ఉద్యమంలో గాంధీజీ పోషించిన పాత్ర కారణంగా.. అనతి కాలంలో ఆయన జాతీయ నేతగా ఎదిగారన్నారు.భారతీయుల నుంచి అందుతున్న సహకారం వల్లే బ్రిటిషర్లు భారత్ ను  పరిపాలించగలుగుతున్నారని  గుర్తించి,సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారన్నారు. స్వయం పాలన, స్వరాజ్య సాధనను గాంధీజీ లక్ష్యంగా నిర్దేశించుకుని పోరాడారన్నారు..మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారన్నారు.75 ఏళ్ల వజ్రోత్సవం వేళలో భారత స్వతంత్ర స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆజాదిక అమృత మహోత్సవం విజయవంతం చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాత్కర్, గుండ లక్ష్మి దేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top