అమరావతి: బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో టీడీపీ నేతలు శాసన మండలిలో మోకాలడ్డుతున్నారు. సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మండలిలో ప్రతిపక్షం హడావుడి చేస్తోంది. దీంతో మండలిలో మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. బిల్లుల ఆమోదంపై మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రుల మధ్య వాగ్వాదం నడిచింది. తొలుత ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి చేద్దామని మండలి డిప్యూటీ చైర్మన్ చెప్పగా.. మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సీఆర్డీయే రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను ముందుగా చేపట్టాలని మంత్రి కోరారు. దీంతో ద్రవ్యవినిమయ బిల్లు రాజ్యాంగ ఆబ్లిగేషన్ అని యనమల రామకృష్ణుడు అడ్డుతగిలారు. అది అయ్యాక మిగిలిన బిల్లులపై ఆలోచిద్దామని చెప్పారు. యనమల వ్యాఖ్యలపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు చివరిగా చేపట్టడం సంప్రదాయం అని బుగ్గన స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత వేరే బిల్లులు చేపట్టారా..? అని నిలదీశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ 15 నిమిషాలు మండలిని వాయిదా వేశారు.