డీజిల్ సంక్షోభంతో వ్యవసాయం, ఆక్వాకల్చర్ రంగాలు కుదేలు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళ‌న 

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న డీజిల్ సరఫరా అంతరాయం నాలుగో రోజుకీ పరిష్కారం కాకపోవడంతో వ్యవసాయం, ఆక్వాకల్చర్ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అధికారికంగా సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో డీజిల్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా..క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి భిన్నంగా క‌నిపిస్తోంది.  సరఫరాను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, ఆక్వాకల్చర్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్ర‌భుత్వం చెబుతున్నా..డీజిల్ కొర‌త తీర‌డం లేదు.  రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీజిల్ అందుబాటు గణనీయంగా తగ్గిపోయింది. పలు పెట్రోల్ బంకుల్లో “No Stock” బోర్డులు కనిపిస్తుండగా, రైతులు, వాహనదారులు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల రేషన్ విధానంలో పరిమితంగా మాత్రమే డీజిల్ ఇస్తుండగా, సాధారణ సరఫరా కంటే సగానికి పడిపోయినట్లు సమాచారం.

 వ్యవసాయంపై తీవ్ర ప్రభావం

డీజిల్ కొరత కారణంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నిలిచిపోవడంతో పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా వరి పంట కోతలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కోతలు ఆలస్యమైతే దిగుబడి నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు ఆగిపోవడంతో అదనపు ఖర్చులు పెరిగి రైతులపై భారం పెరుగుతోంది.రొయ్యలు, చేపల పెంపకంలో డీజిల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏరిఏటర్లు, నీటి పంపులు నడపడానికి డీజిల్ అవసరం. ప్రస్తుతం కొరత కారణంగా జనరేటర్లు పనిచేయక ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతోంది. 1–2 గంటలు కూడా ఏరిఏషన్ ఆగితే మొత్తం పాండ్ నష్టపోయే ప్రమాదం ఉందని ఆక్వా రైతులు చెబుతున్నారు. హార్వెస్టింగ్ ఆలస్యం, కోల్డ్ స్టోరేజ్, రవాణా వ్యవస్థలపై ప్రభావంతో భారీ ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయి.

 రవాణా, మార్కెట్‌పై ప్రభావం

లారీలు, ట్రాక్టర్లు నడవక సరుకు రవాణా మందగించింది. కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 4 వేల టన్నుల చేపలు ఉత్తర, ఈశాన్య భారత మార్కెట్లకు పంపిణీ అవుతాయి. ప్రస్తుతం ఈ రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో ధరల మార్పులు, నష్టాలు పెరుగుతున్నాయి. అలాగే ఉత్తర భారతానికి వెళ్లే పండ్ల రవాణాపైనా తీవ్ర ప్రభావం పడుతోంది.  రాష్ట్ర స్థాయిలో నిల్వలు ఉన్నప్పటికీ, సరఫరా వ్యవస్థలో లోపాల వల్ల డీజిల్ అందుబాటులో లేకపోవడం స్పష్టమవుతోంది. ఈ పరిస్థితి ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఎందుకు కనిపిస్తోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంక్షోభం మరికొన్ని రోజులు కొనసాగితే రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయి సమస్యలను గుర్తించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top