విజయవాడ: రెండో విడత ‘జగనన్న అమ్మఒడి’ పథకం ఈనెల 11వ తేదీన అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారమే జీఓ–3ను విడుదల చేశామని చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో రేపు సీఎం వైయస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభిస్తారని, కంప్యూటర్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 1,76,589 మంది తల్లులు కొత్తగా లబ్ధిపొందనున్నారని చెప్పారు. ఈ ఏడాది 44,00,891మందికి అమ్మఒడి అందజేయనున్నట్లు వివరించారు.
అమ్మఒడి పథకం అమలు చేస్తున్న తరుణంలో నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం దారుణమని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. పథకాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని, వాటిని అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. నెల్లూరు అర్బన్ ప్రాంతంలో ఈ పథకం ప్రారంభం అవుతుంది కనుక కోడ్ పరిధిలోకి రాదన్నారు.