విజయవాడ: పారదర్శకంగా గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు దళారులను నమ్మొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలో 5114 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తారని చెప్పారు. ఓఎంఆర్ షీట్లను జిల్లాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధానపత్రాలను నాగార్జున యూనివర్సిటీకి తరలించి స్కానింగ్ చేస్తారని చెప్పారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తామన్నారు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని చెప్పారు.ఇసుక రవాణాలో ఇబ్బందులు లేకుండా జీపీఎస్ విధానం అమలు చేస్తామన్నారు. ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త పాలసీని తప్పుదోవ పట్టించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.