వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు 

 పేదల ఇళ్లకు పేరు ఖరారు
 

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు అని పేరు  ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం జీవో జారీ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య కార్యక్రమమైన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’  కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది.

సంతృప్త స్థాయిలో కులం, జాతి, మతంతో సంబంధం లేకుండా అర్హులందరికీ నివాస స్థల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించనుంది. మిషన్‌ మోడ్‌లో స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మించేందుకు విధివిధానాలు రూపొందించి అర్హులను ఎంపిక చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.’ అని జీవోలో పేర్కొన్నారు. 

ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 14వ తేదీ అంబేడ్కర్‌ జయంతి రోజుకు వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్నందున ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదన్నారు.  జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధికి సంబంధించి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తూ, జాగ్రత్తలు తీసుకుని వారికి స్థలాలను చూపించాలని ఆదేశించారు.  

పేదలకు మేలు చేస్తుంటే రాజకీయమా!
- సుమారు 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తూ.. వారి కుటుంబాల్లో మార్పులు తీసుకు వస్తుంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వారు మనుషులే కాదనిపిస్తోంది.
- పేదలకు మంచి జరగకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాలి. 
- పేదలకు ఇస్తున్న ప్లాట్లు, వాటిని అభివృద్ధి చేసిన తీరును సవివరంగా తెలియజెప్పాలి. 
- ప్లాట్లను ముందుగానే అలాట్‌ చేస్తూ లాటరీ ప్రక్రియ పూర్తి చేయాలి.
- వారి వారి ప్లాట్ల వద్ద లబ్ధిదారులను నిలుచోబెట్టి ఫొటో తీయాలి. జియో ట్యాగింగ్‌ చేయాలి.
- నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం కేటాయించాలి.
- గత సమీక్షతో పోలిస్తే.. ఇళ్ల పట్టాల విషయంలో ఈసారి మంచి ప్రగతి కనిపిస్తోంది. 
 

Back to Top