అమరావతి: చెరుకూరి రాము (సీహెచ్ రామోజీ) తన 70వ జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో–2006 నవంబర్ మొదటి వారం రామోజీ గ్రూపుపై ‘పిడుగు’ పడినంత పనైంది. రామూ కుటుంబ (హెచ్ యూ ఎఫ్–అవిభక్త హిందూ కుటుంబం) నిర్వహణలోని మార్గదర్శి ఫైనాన్సియర్స్ వందల కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేయడం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధమని వెల్లడైంది. దీంతో అంతకు ముందు మార్గదర్శి ఫైనాన్సియర్స్ లో తమ సొమ్ము దాచుకున్న వందలాది మంది డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వం వెంటనే (2006 డిసెంబర్) అధికారికంగా స్పందించింది. కనీసం తన పేరుతో బోర్డు కూడా లేకుండా దశాబ్దాలుగా పనిచేస్తున్న ఈ కంపెనీపై దర్యాప్తునకు ఎన్.రంగాచారి కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. సొంత పేరుతో బోర్డుతో పాటు సొంత కార్యాలయాలు కూడా లేని ఈ కుటుంబ కంపెనీ అప్పట్లో రామూ తొలి ఒరిజినల్ కంపెనీ ‘మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆఫీసుల నుంచే పనిచేసేది. ఫలితంగా, రాష్ట్ర సర్కారు ఈ కంపెనీ పత్రాల కోసం రామూ చిట్టీల కంపెనీ ప్రధాన కార్యాలయంలో, బ్రాంచీలలో అధికారులతో తనిఖీలు చేయించింది. ఈ తనిఖీలు అన్యాయమనీ, వాటిని తనకు హక్కుగా దక్కిన పత్రికా స్వాతంత్య్రంపై చేసిన దాడులుగా పరిగణించాలని ‘రాజగురువు’ కోర్టుల తలుపులు తట్టారు. ఏపీలో తనపై వైఎస్ సర్కారు తీసుకుంటున్న చర్యలను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎసెల్పీ) కూడా దాఖలు చేశారు. ‘‘మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో రాష్ట్ర సర్కారు స్పందన (రంగాచారి కమిటీ వేయడం) మా మీడియా వ్యాపారాన్ని దెబ్బదీయడానికి ఉద్దేశించిన చర్య. ‘ఈనాడు’ దినపత్రికను, 12 టీవీ చానల్స్ ను నడపనీయకుండా మమ్మల్ని ఆర్థికంగా కుంగదీయడమే లక్ష్యంగా తలపెట్టిన కార్యక్రమం ఇది,’’ అంటూ ఈ ఎసెల్పీలో రాము సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. తక్షణమే మార్గదర్శిపై చర్యలను నిలిపివేయాలని ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ స్పందిస్తూ, ‘ ఆర్థిక సంస్థలు (ఫైనాన్స్ కంపెనీలు) ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోకూడదు?’ అని ప్రశ్నించారు. ఇక్కడ కీలక విషయం ఏమంటే రాము పిటిషన్ విచారించిన మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వీ.రవీంద్రన్ విచారణ జరుపుతూ, ‘ముఖ్యమంత్రి తప్పుచేస్తే మీరు వెంటనే దాని గురించి చెబుతారు. అలాగే, మీరు తప్పు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యతీసుకుంది. మీ క్లయింటు (రామోజీరావు) రెండు టోపీలు పెట్టుకుని తిరుగుతున్నారు. ఒకటి వార్తాపత్రిక యజమానిగా, రెండోది చిట్ ఫండ్ కంపెనీ అధిపతిగా పెట్టుకుంటున్నారు,’ అని రాచపుండు రాము లాయర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది జరిగింది 2007 జూన్ మాసంలో. ఇదంతా గుర్తుచేయడానికి కారణం పెదపారుపూడి రాముడి నెత్తి మీద ఇప్పుడు కూడా మనకు కనిపించని అనేక టోపీలు ఉన్నాయి. ఎప్పుడూ తెల్ల బట్టలే ధరించినాగాని–సందర్భాన్ని బట్టి టోపీలు మార్చుతారు కుల మార్గదర్శి. సెంచరీ కొట్టే క్రమంలో 86వ రన్ తీయడానికి దగ్గరలో ఉన్న రాము ఏకకాలంలో ఇన్ని టోపీలు ధరించడం నిజంగా గ్రేట్.