ఆ అడుగులు..కోట్లాది జీవితాల్లో వెలుగులు

 
పుష్క‌ర వ‌సంతంలోకి అడుగిడుతున్న‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి రేటికి ప‌న్నెండేళ్లు

నాడు వైయ‌స్ జ‌గ‌న్‌, విజ‌య‌మ్మ‌తో పార్టీ ఆవిర్భావం..నేడు కోట్లాది హృద‌యాల్లో సుస్థిర స్థానం

విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌నే ఊపిరిగా వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య యాత్ర‌

``వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత నేను వేసిన ప్రతి అడుగులో నా వెన్నంటే నిలిచిన లక్షలాది వైయస్ఆర్ సీపీ శ్రేణులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. రాజన్న ఆశయాల కోసం పుట్టిన ఈ పార్టీలో మీ అందరితో కలిసి పయనించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వచ్చింది.. రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషిచేసి.. మీ అందరూ నా పై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపేందుకు పాటుపడుతున్నాను``

- వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి

 దేశ రాజకీయాల్లో విప్లవం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవశకం... కాంగ్రెస్ అనే భారతదేశ అతిపెద్ద పార్టీకి నూట పాతికేళ్ల నిండు చరిత్రలో ఎన్నడూ ఎదురుకాని పెను సవాలు. ఇవన్నీ యెడుగూరి సందింటి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి  పర్యాయ పదాలు. జాతీయ పార్టీని ఎదురించి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తల్లి  వైయస్‌ విజయమ్మతో కలిసి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్థాపించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు మహా వృక్షంగా ఎదిగింది. ఈ వృక్షం కింద ఎందరికో రాజకీయ భవిష్యత్‌ ఇస్తోంది. మార్చి 12, 2011న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాది వద్ద ప్రారంభమైన పార్టీ నేడు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌తే ప్రాణంగా ఆవిర్భ‌వించిన పార్టీ..నేడు కోట్లాది మంది హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించింది.

వైయస్‌ జగన్‌ అంటే న‌మ్మ‌కం..
జన హోరుని చూసి మైమరచిపోయి తొడగొట్టే హీరో కాదాయన. సినిమాల్లో విలన్ల ముందు తిప్పినట్టు జనం ముందు మీసాలు మెలేసే పాతకాలపు కథానాయకుడు అసలే కాదు. ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు. తన తండ్రి పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నవాళ్లు ఆ చెట్టు మీదే రాళ్లేస్తుంటే సహించలేకపోయిన నిజమైన వారసుడు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ఇసుమంతైనా తెలీని శక్తులు తనపైనా, తన విశ్వాసాలపైనా ఆధిపత్యం చెలాయించబోతే ఎదురు తిరిగిన నిజమైన విప్లవకారుడు. అందుకే ఇపుడాయన హీరో. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమానిస్తున్న నిజమైన కథానాయకుడు. ఈ రోజు ఆయన ఒక శక్తి. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి లేరు... ఇక తమని ఆపేవారెవరు..? అని గంతులేయబోయిన దుష్టశక్తుల పాలిట సింహస్వప్నం. ఇపుడు ఆయన పేరు తలవనిదే ఆయనను అభిమానించే వారికే కాదు శత్రువులకూ రోజు గడవదు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి రేప‌టికి సరిగ్గా పన్నెండేళ్లు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైయస్‌ విజయమ్మతో ప్రారంభమైన ఓ పార్టీ నేడు దేశంలోని అతిపెద్ద పార్టీల సరసన చేరింది. రాష్ట్ర చరిత్రలోనే 51 శాతం ఓట్లు, 80 శాతం పైగా సీట్లతో 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 151 స్థానాలతో, భారత లోకసభలో 22 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ విభాగంలోను అత్యున్నత ఫలితాలు అందుకుంది. పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఈ34 నెలల్లోనే చారిత్రాత్మక నిర్ణయాలు, విప్లవాత్మక చట్టాలు చేసి ప్రజా రంజక పాలన అందించి బెస్ట్‌ ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. స్కోచ్ అవార్డులు అందుకున్నారు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు అన్నింటి 50 శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్మాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతిని రూపుమాపేందుకు రివర్స్‌ టెండరింగ్‌ వ్యవస్థను తీసుకువచ్చారు.  సంక్షేమ పథకాలను గడప వద్దకే చేర్చి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నారు. అధికార వికేంద్రీకరణ నిర్ణయంతో ముందుకు వెళ్తున్న వైయస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. దటీజ్‌ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. ఇటీజ్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటూ పార్టీ శ్రేణులు కాలర్‌ ఎగిరేస్తున్నారు.  

ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించి ప్ర‌జ‌ల్లో సుస్థిర‌మైన న‌మ్మ‌కాన్ని ఏర్ప‌రుచుకున్న‌ పార్టీగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మునుపెన్న‌డూ లేనివిధంగా అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించి ప్ర‌జ‌ల్లో త‌న‌కున్న ఆద‌ర‌ణ‌ను వైయ‌స్ జ‌గ‌న్ జ‌గానికి చాటారు. జ‌న‌మే త‌న బ‌ల‌మ‌ని, జ‌నం కోస‌మే త‌న ప‌య‌న‌మ‌ని అలుపెర‌గ‌ని శ్రామికుడిలా వారి బాగుకోస‌మే శ్ర‌మిస్తున్న జ‌గ‌న్‌కు జ‌న‌మంతా జేజేలు కొడుతున్నారు. రాష్ట్రం ద‌శాదిశా మార్చేలా ఎన్ని చిక్కుముడులు ఉన్నా వాట‌న్నింటిని చిరున‌వ్వుతో విప్పుకుంటూ ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో తానేం చేయాలో నిర్ధిష్ట‌మైన ల‌క్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ అడుగులు ముందుకే ప‌డుతున్నాయి. 

రాకాసి మూక‌లు రాజ్యాధికారం కోసం ఎన్ని న‌క్క‌జిత్తులు, కుట్ర‌లు కుతంత్రాలు ప‌న్నినా త‌న‌దైన వ్యూహంతో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూనే ఉన్నారు..వారి నీచ‌బుద్ధిని జ‌నానికి తెలియ‌జేస్తూనే ఉన్నారు. త‌న అస్థిత్వాన్ని దెబ్బ‌తీయాల‌ని అంద‌రూ ఏక‌మై స‌మూహంలా విష ప్ర‌చారాలు చేస్తున్నా ఏమాత్రం జంకు లేకుండా..తాను న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం వాట‌న్నింటిని పంటికింద‌నే భ‌రిస్తూ మేరున‌గ‌ధీరుడిలా ప‌రిపాల‌న సాగిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్ప‌టికీ వీరుడే..విజ‌య‌సార‌ధుడే...జ‌న‌నాయ‌కుడే..

   రేపు రాష్ట్ర‌వ్యాప్తంగా ఆవిర్భావ వేడుక‌లు
 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. శ‌నివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించాలని, ఘనంగా వేడుకలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుల చేశారు. ఈ మేర‌కు పార్టీ పండుగ ఘ‌నంగా నిర్వ‌హించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధ‌మ‌వుతున్నాయి.
 

Back to Top