అందరికీ చదువులు...అందరికీ వెలుగులు

ఇక సర్కారీ బళ్లలో సమస్యలకు సెలవ్‌.....
 

  ముఖ్యమంత్రి కాగానే వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వపాఠశాలలపై ప్రత్యేక శ్రద్ద చూపడం మొదలు పెట్టారు. తన ప్రాధాన్యతాంశాల్లో విద్యారంగం ఒక్కటన్నది చెప్పకనే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రాధమిక విద్యనుంచే మార్పుల పర్వానికి శ్రీకారం చుట్టిన సీఎంను విద్యావేత్తలు, సామాజికశాస్త్రవేత్తలు, టీచర్లు అభినందించడం మొదలయింది.
ప్రతిపక్షనేతగా 3,648 కిలోమీటర్ల సుదీర్ఘపాదయాత్ర చేసిన జగన్‌ చెంతకు పాఠశాలల పిల్లలు పరుగుపరుగున వచ్చిన సందర్భాలెన్నో. విద్యాసంవత్సరం ముగుస్తున్నా, అందని టెక్ట్స్‌బుక్స్‌పై, పాఠశాలల్లో వసతుల లేమిపై ఆయనకు ఎంతో చెప్పుకున్నారు. వారితో పాటు టీచర్లూ తమ సమస్యలు చెప్పుకున్నారు. మధ్యాహ్నభోజన పథకంలో పనిచేసే కార్మికులు తమ గోడును వెళ్ల బోసుకున్నారు. ఇక విద్యార్థినులైతే టాయిలెట్లు లేక తాము ఎంత ఇబ్బంది పడుతున్నదీ జగన్‌కు చెప్పుకుని బాధపడ్డారు. చాలా స్కూళ్లకు ప్రహారిగోడలు లేక, పోకిరీలకు అడ్డాలుగా మారిన వైనాల్ని వివరించారు. 
నాడు వైయస్‌ జగన్‌ అన్నీ విన్నారు. చూశారు. అప్పుడు వారికి నేనున్నానని భరోసా ఇచ్చారు.
వైయస్‌ జగన్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుంచే ప్రభుత్వశాఖల పనితీరును సమీక్షించడం మొదలుపెట్టారు. అదే వరసలో మొదటగా ప్రభుత్వపాఠశాలలకు చెందిన మధ్యాహ్నభోజన పథకం గురించి అక్షయ ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్సార్‌ అక్షయపాత్ర పేరిట ...ఇక మధ్యాహ్నభోజన పథకం సమర్ధవంతంగా నడవాలని జగన్‌ ఆకాంక్ష. పిల్లలకు పౌష్టికాహారం అందించి తీరాలన్న పట్టుదల. ఆ దిశలో ఇప్పటికే ఆయన అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నభోజనపథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటిదాకా ఇస్తున్న రూ.1000లను రూ.3వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు. 
ప్రభుత్వపాఠశాలల్లో మౌలికవసతులు కల్పించడం, విద్యార్థినీవిద్యార్థులు చదువుకోవడంలో ఎలా ంటి ఇబ్బందులు పడకుండా చూడటం చాలా ముఖ్యమన్నారు. ప్రతి శనివారం 
నోబ్యాగ్‌ డే గా చూడాలని..ఆరోజు విద్యార్థి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచే క్రీడలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని...అందుకు ప్రణాళిక సిద్దం చేయాలని విద్యాశాఖకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
పాఠశాలల ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వస్కూళ్ల ఫొటోలు తీసి పంపాలని చెప్పారు ఏపీ సీఎం. తర్వాత కాలంలో వాటిని మెరుగుపర్చిన తీరును ఫొటోలు తీస్తే, పనితీరు స్పష్టంగా తెలిసిపోతుందని సీఎం జగన్‌ ఆలోచన. అలాగే రాష్ట్రంలోని దాదాపు 40వేలకు పైగా వున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియంలోనూ బోధన జరగాలని, తెలుగు బోధన తప్పని సరిగా వుండాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం, చదువుల విషయంలో చేసే ఖర్చు...మంచి ఫలితాలు సాధిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. 
చదువు చైతన్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో వెలుగులు పంచుతుంది. ఆ వెలుగులు పేద, సామాన్యప్రజల పిల్లలందరికీ  అందాలన్న ఏపీ సీఎం వై.యస్‌.జగన్‌ సంకల్పం. చిత్తశుద్దితో చేసే ఏ పనైనా అనుకున్న లక్ష్యం సాధించితీరుతుందన్నది ఆయనకు బాగా తెలుసు.  

 

Back to Top