మత్స్యకారుల స్వ‌ప్నం సాకారం చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణానికి సీఎం వైయ‌స్‌ జగన్ నేడు శంకుస్థాపన

నెల్లూరు : కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేస్తున్నారు. చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణానికి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న కృష్ణపట్నం పోర్టు నిర్వాసితులకు మత్స్యకారేతర ప్యాకేజీ సైతం పంపిణీ చేయనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రలో కోరిన విన్నపాన్ని సీఎం హోదాలో ఆచరణలో అమలు చేస్తున్నారు.

సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నంలో పోర్టు నిర్మాణంతో సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇబ్బందిగా మారింది. ఫిషింగ్‌ జెట్టి ఏర్పాటు చేయాలన్న ఈ ప్రతిపాదన 16 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. హార్బర్‌ నిర్మించాలని కూడా గతంలో పలు సర్వేలు, పరిశీలనలు చేపట్టారు. అందుకోసం పాలకులు అంచనాలు కూడా రూపొందించారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. వైయ‌స్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని భావించారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల కలగా మిగిలిపోయిన ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేలటూరు జెన్‌కో మూడో యూనిట్‌ ప్రారంభోత్సవానికి గురువారం రానున్న సీఎం  శంకుస్థాపన చేయనున్నారు.

నెరవేరనున్న మంత్రి కాకాణి హామీ  
మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధికి అండగా జెట్టి నిర్మాణం చేపడుతామని 2019 ఎన్నికల్లో అప్పటి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు గురువారం జెట్టి నిర్మాణానికి  తొలిమెట్టు పడనుంది. కృష్ణపట్నం పోర్టు నిర్వాసితులకు మత్స్యకారేతర ప్యాకేజీ పెండింగ్‌లో ఉంది. నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజీ కోసం ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేపట్టిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి అప్పట్లో తీసుకెళ్లారు. అధికారంలోకి రాగానే మత్స్యకారేతర ప్యాకేజీ వర్తింపజేస్తామని మాట ఇచ్చారు. అదే విషయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 16,337 మందికి మత్స్యకారేతర ప్యాకేజీ వర్తింపజేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు రూ.35.75 కోట్లు గురువారం పంపిణీ చేయనున్నారు. 

రూ.25 కోట్లతో ఫిషింగ్‌ జెట్టి
ముత్తుకూరు మండలంలోని నేలటూరు పట్టపుపాళెం వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణం చేపట్టనున్నారు. జెట్టి అందుబాటులోకి వస్తే ఉప్పు కాలువల్లో, క్రీక్‌ల్లో బోట్లు, వలలను భద్రపరుచుకునే బాధ మత్స్యకారులకు తప్పుతోంది. ఫిషింగ్‌ జెట్టీ వద్ద భద్రపరుచుకొనే అవకాశం  ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి బోట్లు, వలలను కాపాడుకోవచ్చు. సముద్రంలో వేట చేసిన మత్స్య సంపదను ఈ జెట్టి వద్ద ఎండబెట్టుకొని, భద్రపరుచుకోవచ్చు. పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.

పైగా వలలు అల్లుకొనే వెసులుబాటు లభిస్తుంది. రోడ్డు సదుపాయం ఏర్పడుతుంది. కొనుగోలుదారులు నేరుగా ఈ జెట్టిల వద్దకు వచ్చి మత్స్యసంపదను కొనుగోలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. క్రమంగా ఈ జెట్టిల వద్ద కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులోకి రానున్నాయి. చేపలు, రొయ్యలు చెడిపోకుండా ఈ కోల్డ్‌ స్టోరేజ్‌లో భద్రపరుచుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ ఫిషింగ్‌ జెట్టి క్రమంగా మినీ ఫిషింగ్‌ హార్బర్‌గా రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదని పలువురు వివరిస్తున్నారు.  

Back to Top