సీఎం వైయ‌స్‌ జగన్‌కు సినీ ప‌రిశ్ర‌మ కృతజ్ఞతలు

అమరావతి : కరోనా కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఊరటనివ్వ‌డం ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సినీ ప‌రిశ్ర‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. సినీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్, మ‌రో నిర్మాత దిల్ రాజు సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.   ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులు, ఇతర ఊరట చర్యలు చిత్ర పరిశ్రమ పునఃప్రారంభానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ కోసం రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన సీఎం వైయ‌స్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సాయం ఎనలేనిదని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ నెల 18న నిర్వ‌హించిన కేబినెట్ స‌మావేశంలో కరోనా కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ప్ర‌భుత్వం రాయితీలు ప్ర‌క‌టించింది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్న‌ట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని ఏపీ కేబినెట్ తెలిపింది. మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.దింతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. రీస్టార్ట్‌ ప్యాకేజీకింద వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు, ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు, వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీనికి రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు చేసిన స‌హ‌కారానికి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

 

Back to Top