‘సామాజిక’ సంచలనం

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నేరుగా రూ.1.31 లక్షల కోట్లు

సామాజిక సాధికారత దిశగా చిత్తశుద్ధితో సీఎం జగన్‌ అడుగులు

కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ దాకా సింహభాగం పదవులు వారికే

ఆయా వర్గాల ముఖ్యమంత్రులకూ సాధ్యం కాని రీతిలో సామాజిక న్యాయం

ఇటు సంక్షేమం.. అటు చదువులకు చేయూతతో పేదరిక నిర్మూలన  

అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యాదీవెన లాంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ పదవుల దాకా సింహభాగం పదవులిచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సీఎం జగన్‌ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. 

దేశంలో  సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయా వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులకు సాధ్యం కాని రీతిలో సీఎం జగన్‌ సాధికారత దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయంలో దేశానికే  ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు.  

చేతల్లో సామాజిక న్యాయం..
► ముఖ్యమంత్రి జగన్‌ 2019 జూన్‌ 8న తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో కూడిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే అందులో నలుగురు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు.  

► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్, శాసనమండలి ఛైర్మన్‌గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌ రాజు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం కల్పించారు. 

► 2022 ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయంపై సీఎం జగన్‌ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 

► టీడీపీ అధికారం ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరికి కూడా రాజ్యసభకు వెళ్లే  అవకాశం కల్పించలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను (50%) రాజ్యసభకు పంపి సీఎం జగన్‌ చిత్తశుద్ధి చాటుకున్నారు.  

► శాసన మండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది ఎమ్మెల్సీలు ఉండగా ఇందులో 18 మంది (57 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. 

స్థానిక సంస్థలలోనూ.. 
► స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్‌ ఉత్తర్వులు జారీ చేస్తే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు హైకోర్టులో టీడీపీ నేతలతో కేసులు దాఖలు చేయించారు. దీంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లకు అడ్డుపడ్డా పార్టీపరంగా బీసీలకు 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులిచ్చారు. 

► రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది.  ఇందులో 237 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. 

► 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో బీసీలకు 6 (46%) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గా లకు 9 జడ్పీ ఛైర్మన్‌ పదవులు (69%) ఇచ్చారు. 

► రాష్ట్రంలోని 14 కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 14 కార్పొరేషన్‌ మేయర్‌ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) సీఎం జగన్‌ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలిపితే 14 కార్పొరేషన్‌ మేయర్‌ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే కేటాయించారు. 

► 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే 84 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించింది. ఇందులో 44 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులను బీసీలకు (53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు కలిపి 58 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులు (69 శాతం) ఇచ్చారు. 

చట్టం చేసి నామినేటెడ్‌ పదవులు
► నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తూ సీఎం జగన్‌ చట్టం చేసి మరీ ఆయా వర్గాలకు అవకాశం కల్పించారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఆయా వర్గాలకు రిజర్వు చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి.  

► 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 76 పదవులు(39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. 

► ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవులలో 53 పదవులు(39శాతం) బీసీలకే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్‌ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవుల్లో 201 బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 484 పదవుల్లో 280 (58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు.  

► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు చెందిన వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్‌లలో 684 డైరెక్టర్‌ పదవులు ఉండగా అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు.  

సంక్షేమంలో సింహభాగం..
► మూడున్నరేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా రూ.1.77 లక్షల కోట్లను ప్రభుత్వం అందించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.1.31 లక్షల కోట్ల మేర (74 శాతం) లబ్ధి చేకూరింది. డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి అన్ని వర్గాలకు మొత్తం రూ.3.19 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే రూ.2.50 లక్షల కోట్ల (79 శాతం) మేర మేలు జరిగింది.  

తాజా వీడియోలు

Back to Top