జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన సునామీని తలపించింది. విజయవాడ రోడ్డులోని వైయస్ఆర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వద్దకు చేరింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సామాజిక నినాదం హోరెత్తింది. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు తమ ఇంటి ముంగిటకే వస్తున్నాయంటూ సామాజిక సాధికార బస్సు యాత్ర వెంట ఉత్సాహంగా కదిలారు. సమ సమాజ స్థాపనకు పునాది: మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్రానికి వైయస్ జగన్ సీఎం అయ్యాకే సమ సమాజ స్థాపన జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా బడుగు, బలహీన, వర్గాలకు మేలు చేసింది జగన్ ఒక్కరేనని స్పష్టం చేశారు. ఆయా వర్గాలకు చెందిన ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని.. దీనికి సీఎం వైయస్ జగన్ దార్శనికతే కారణమని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు భరోసా: మంత్రి రజిని రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ ప్రాధాన్యమిస్తూ.. వారికి భరోసా కల్పిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శాసనసభలో 17 మంది బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు.. అన్ని రకాల పదవుల్లో 60% అవకాశం కల్పించడం ఓ చరిత్రగా చెప్పారు. భావితరాల బంగారు భవిత కోసం జగనన్నకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు జైలుకు పంపితే, జగనన్న పార్లమెంట్కు పంపాడు: ఎంపీ నందిగం సురేష్ చేయని తప్పుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తనను జైలుకు పంపితే.. దళితుడనైన తనను దేశ ప్రధాని పక్కన పార్లమెంట్లో కూర్చునే గొప్ప అవకాశాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదని కోర్టుల ద్వారా చంద్రబాబు పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహనరావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వసంత కృష్ణప్రసాద్, కొలుసు పార్థసారథి, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరులో అభిమానుల ‘ఆత్మీయ’ వరద నంద్యాల: సామాజిక సాధికార యాత్రకు ప్రజలు పోటెత్తారు. ఆత్మకూరు పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కనుచూపు మేర ఎటుచూసినా, ఇసుకేస్తే రాలనంతలా జనం తరలివచ్చారు. సుమారు 500 బైక్లతో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గజ మాలలు, డప్పు వాయిద్యాలు, బాణసంచా పేలుళ్లతో తమ అభిమాన నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు. కరోనాలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు: డిప్యూటీ సీఎం అంజాద్బాషా కరోనా కాటేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్బాషా ప్రశంసించారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే.. నమ్మిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం కాబట్టే.. తామంతా కాలర్ ఎగరేసి ఓట్లడుగుతున్నట్టు తెలిపారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వారిని ఓట్లడుగుతారని ఎద్దేవా చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించి అమలు చేశారు: మంత్రి కారుమూరి బీసీ డిక్లరేషన్ సభలో చెప్పిన ప్రతి మాటనూ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైయస్ జగన్ అమలు చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు పదవులు ఇవ్వలేదని, కేవలం సీఎం వైయస్ జగన్ మాత్రమే యాదవులకు సముచిత గౌరవం ఇచ్చారని చెప్పారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. తన కులం వారికి కాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఏనాడూ రాజ్యసభ టికెట్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించేలా సీఎం వైయస్ జగన్ కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను అమెరికా వెళ్లినప్పుడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనతో మాట్లాడిన మాటలను కారుమూరి గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న ఓ రిక్షా కార్మికుడు.. వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్మెంట్తో నేను చదువుకుని అమెరికాకు రాగలిగా.. మా కుటుంబమంతా వైయస్ఆర్ కుటుంబానికి రుణపడి ఉంటుంది’.. అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడని చెప్పారు. దళితుల పట్ల నిబద్దతను చాటుకున్న సీఎం వైయస్ జగన్ : మంత్రి ఆదిమూలపు పూర్వకాలంలో దళితులు చదువుకుంటే నాలుక కోసేవారని, చెవుల్లో సీసం పోసేవారని.. కానీ, సీఎం జగన్ తన కేబినెట్లో ఓ దళితుడిని విద్యాశాఖ మంత్రిగా చేసి దళితుల పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2019లో 151 కి.మీ వేగంతో ఫ్యాన్ను తిప్పారని, 2024 ఎన్నికల్లో 175 కి.మీ వేగంతో ఫ్యాన్ను తిప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఇసాక్ బాషా, ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, తొగురు ఆర్థర్, కర్నూలు మేయర్ రామయ్య పాల్గొన్నారు.