వ‌రుస‌గా మూడో ఏడాది.. నేడు ‘మత్స్యకార భరోసా’ 

1,19,875 కుటుంబాలకు రూ.119.87 కోట్లు అందజేత

కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

మూడేళ్లలో రూ.331.58 కోట్ల లబ్ధి

మత్స్యకారేతర వర్గాలకూ అర్హత కల్పించిన ప్రభుత్వం

అమరావతి: సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో అమలు చేస్తున్న వైయ‌స్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద ఈ ఏడాది మరింత మందికి లబ్ధి చేకూరనుంది. సంతృప్త స్థాయిలో (అర్హత గల వారిని ఒక్కరిని కూడా వదలకుండా) 1,19,875 కుటుంబాలకు  రూ.10 వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. సీఎం వైయ‌స్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఉదయం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా సొమ్ములు జమ చేయనున్నారు. గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది.

రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన సర్కారు
గతంలో రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ విధంగా 2019లో 1,02,478 కుటుంబాలకు రూ.102.48 కోట్లు లబ్ధి చేకూర్చగా, 2020లో 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్ల మేర సాయమందించారు.

ఇతర సబ్సిడీల రూపంలో..
బోట్లపై సముద్రంలోకి వేట కోసం బోట్లపై వెళ్లేందుకు వినియోగించే ఆయిల్‌పై సబ్సిడీ రూపంలో 2019–20లో 10.06 కోట్లు, 2020–21లో రూ.22.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్‌ చార్జీల సబ్సిడీ రూపంలో 53,500 మంది లబ్ధిదారులకు 2019–20లో రూ.720 కోట్లు, 2020–21లో నవంబర్‌ వరకు రూ.420 కోట్లు చెల్లించింది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 2019–20లో రూ.2.20 కోట్లు, 2020–21లో రూ.1.20 కోట్లను ఎక్స్‌గ్రేషియా రూపంలో చెల్లించింది. 

మత్స్యకారేతరులకూ వర్తింపు
మత్స్యకారులతో పాటు సముద్రంలో చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్న ఇతర సామాజిక వర్గాల వారిని కూడా ఈ ఏడాది అర్హులుగా గుర్తించాం. ఈ విధంగా బీసీలు 1,18,119 మంది, ఓసీలు 747 మంది, ఎస్సీలు 678 మంది, ఎస్టీలు 331 మంది అర్హులుగా నిర్ధారించాం. 
    – కె.కన్నబాబు, మత్స్య శాఖ కమిషనర్‌  

Back to Top