ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌

 పీఆర్సీపై సీఎస్‌ కమిటీ నివేదికలో ముఖ్యమైన అంశాలు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ఏడు రకాల విశ్లేషణలు చేసిన సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) మాదిరిగానే ఇవ్వాలని సిఫారసు చేసింది. 11వ పీఆర్సీ నివేదికను సోమవారం సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందచేసిన అనంతరం వెలగపూడి సచివాలయంలో కార్యదర్శుల కమిటీ సభ్యులతో కలసి సీఎస్‌ మీడియాతో మాట్లాడారు. అధికారుల కమిటీ మూడు సార్లు సమావేశమైందని, ఉద్యోగ సంఘాలతో ఒకసారి సమావేశం నిర్వహించామని చెప్పారు. అనంతరం నివేదిక రూపొందించామని, దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

ఎంత ఇస్తే ఎంత భారం?
ఫిట్‌మెంట్‌ ఎంత శాతం ఇస్తే ఎంత భారం పడుతుందనే అంశాలను విశ్లేషిస్తూ ఏడు మోడల్స్‌ సూచించాం. 23 శాతం ఫిట్‌మెంట్‌ అయితే ప్రభుత్వంపై ఏటా రూ.11,557 కోట్ల అదనపు భారం పడుతుంది. 27 శాతం అయితే రూ.13,422 కోట్లు, కేంద్ర వేతన సంఘం అమలు చేస్తున్న 14.29 శాతం అయితే రూ.9,150 కోట్లు భారం పడుతుంది. 

ఏడో సీపీసీ ప్రకారం ఇస్తే...
23 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే అదనపు పెన్షన్, హెచ్‌ఆర్‌ఏతో రూ.10,211 కోట్ల అదనపు భారం పడుతుంది. 23.5 శాతం ఫిట్‌మెంట్‌ అయితే అదనపు పెన్షన్,  హెచ్‌ఆర్‌ఏతో రూ.11,413 కోట్లు భారం పడుతుంది. 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి హెచ్‌ఆర్‌ఏ, క్వాంటమ్‌ పెన్షన్‌ 7వ సీపీసీ ప్రకారం ఇస్తే రూ.12,736 కోట్ల అదనపు భారం పడుతుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర వేతన సంఘం ఇస్తున్న ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని సిఫారసు చేశాం. ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇది మంచి విధానం. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే అమలు చేస్తున్నారు. ఇక్కడా కూడా ఇది అమలు చేయాలి.

2018 నుంచి అమలు 
ఈ పీఆర్సీని 2018 నుంచి అమలు చేయాలని సిఫారసు చేశాం. ఈ ఏడు సిఫారసుల్లో ఏది అమలు చేసినా ప్రభుత్వంపై సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద సుమారు రూ.16 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించింది. 

ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌.. ఉద్యోగ సంఘాలకు ప్రతి
11 పీఆర్సీ నివేదికను ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. ఉద్యోగ సంఘాల నేతలకు కాపీని అందచేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, హోంగార్డులను పీఆర్సీ నివేదికలో కలిపాం. గతంలో ఈ విధానం లేదు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా చేర్చాం. ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఇతర సంక్షేమ చర్యలను కూడా సూచించాం. వైద్యం, ఇతర సౌకర్యాలపైనా సిఫారసులు చేశాం.

జీతాల వ్యయం ఏపీలో 36 శాతం.. తెలంగాణలో 21 శాతం 
నివేదిక తయారు చేసే క్రమంలో ఇతర రాష్ట్రాల ఉద్యోగుల జీతాలను కూడా పోల్చి చూశాం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో ఉద్యోగుల జీతాల వ్యయం ఏపీలో ప్రస్తుతం 36 శాతం ఉంది. చత్తీస్‌ఘడ్‌లో 32 శాతం, మహారాష్ట్రలో 31, పశ్చిమబెంగాల్‌ 31, ఒరిస్సా 29, మధ్యప్రదేశ్‌లో 28 శాతం, హర్యానాలో 23 శాతం, తెలంగాణలో 21 శాతం ఉంది.

మిగతావి కూడా పరిష్కరిస్తాం..
సీపీఎస్‌కి పీఆర్సీకి సంబంధం లేదు. నివేదిక తయారు చేసేముందు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. కేంద్రం, వివిధ రాష్ట్రాల్లో వేతనాలు, గత 30 సంవత్సరాల్లో వేతనాలపై అధ్యయనం చేశాం. భవిష్యత్తులో ఎలా ఉండాలో  చూసి నివేదిక ఇచ్చాం. ఉద్యోగ సంఘాల 71 డిమాండ్లలో పీఆర్సీ ఒకటి కాగా మిగిలిన వాటిపై రాష్ట్ర, జిల్లా స్థాయి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్స్‌ పరిశీలిస్తున్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తాం. 

హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌(హెచ్‌ఆర్‌ఏ)
11వ పీఆర్సీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి తరలివెళ్లిన ఉద్యోగులకు మూల వేతనంలో 30 శాతం లేదా నెలకు రూ.26 వేలకు మించకుండా ఇవ్వాలి. పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 22 శాతం లేదా నెలకు రూ.22,500లు ఇవ్వాలి. రెండు నుంచి పది లక్షల జనాభా లోపు ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 20 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా ఇవ్వాలి. 50 వేల నుంచి రెండు లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 14.5 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 12 శాతం లేదా నెలకు రూ.17 వేలకు మించకుండా ఇవ్వాలి.

సెక్రటరీల కమిటీ: కేంద్ర ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులకు 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 24 శాతం, 5 లక్షల నుంచి 50 లక్షలలోపు ఉన్న నగరాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 16 శాతం, ఐదు లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 8 శాతాన్ని హెచ్‌ఆర్‌ఏగా ఇవ్వాలి.

సిటీ కాంపెంసేటరీ అలవెన్స్‌(సీసీఏ)
11వ పీఆర్సీ కమిటీ: విశాఖపట్నం, విజయవాడల్లో రూ.400 నుంచి రూ.1000, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో రూ.300 నుంచి రూ.750 చొప్పున ఇవ్వాలి.
సెక్రటరీల కమిటీ: కేంద్ర ఆరో వేతన సంఘం సీసీఏను రద్దు చేసింది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీసీఏను రద్దు చేయాలి.

అడ్వాన్స్‌ ఇంక్రిమెంట్స్‌
11వ పీఆర్సీ: ఉన్నత అర్హతలు సాధించిన వారికి మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వవచ్చు. సాధారణ పరిస్థితుల్లో అడ్వాన్స్‌ ఇంక్రిమెంట్స్‌ ఇవ్వకూడదు.
సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ కమిటీ సిఫార్సును అమలు చేయాలి.

కరవు భత్యం(డీఏ)
11వ పీఆర్సీ: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న తరహాలోనే ఏడాదికి రెండు సార్లు జనవరి 1, జూలై 1న డీఏలు ఇవ్వాలి. 1–1–2019 నుంచి కేంద్రం డీఏను ఒక శాతం పెంచితే.. రాష్ట్ర ప్రభుత్వం 0.91 శాతం పెంచాలి.
సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ చేసిన సిఫార్సును అమలు చేయాలి. 

– ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసిన సీఎస్‌ కమిటీ
– 11వ వేతన సంఘం సిఫార్సులపై నివేదిక ఇచ్చిన సీఎస్‌ కమిటీ
– రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పలు అంశాలను నివేదికలో ప్రస్తావించిన సీఎస్‌ కమిటీ
– ఇన్ని ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను నివేదికలో ప్రస్తావించిన సీఎస్‌ కమిటీ
– 2018–19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ. 52,513 కోట్లు కాగా, 2020–21 నాటికి ఆ వ్యయం రూ. 67,340 కోట్లకు చేరుకుంది. 
– 2018 –19లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం అయితే, 2020–21 నాటికి అది 111 శాతానికి చేరుకుంది. 
– ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయం 2018–19లో 32 శాతం అయితే, 2020–21 నాటికి 36 శాతానికి పెరిగింది. 
– ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020–21లో తెలంగాణాలో ఇది కేవలం 21 శాతమే. ఛత్తీస్‌గఢ్‌లో 32 శాతం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో 31 శాతం, ఒడిశా 29శాతం, మధ్యప్రదేశ్‌ 28 శాతం, హరియాణ 23 శాతం

నివేదికలోని కీలక అంశాలు:

– రాష్ట్ర విభజన అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపింది
– తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ. 1,70,215 మాత్రమే.
– రూ. 6,284 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాల్సి ఉంది
– రెవిన్యూ లోటు కింద ఉన్న రూ. 18,969.26 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.
– కోవిడ్‌ –19 కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది
– కోవిడ్‌ కారణంగా రూ.20 వేల కోట్ల అదనపు భారం పడింది
– ఇంతటి కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకోసం అనేక నిర్ణయాలు తీసుకుంది.
– జులై 1, 2019 నుంచి 27శాతం ఐఆర్‌ను ఇచ్చింది
– ఐ.ఆర్‌. రూపేణా ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ. 4,569.78 కోట్లు, మొత్తంగా రూ. 15.839.99 కోట్లు చెల్లించింది.

– అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచింది.
– 3,01,021 ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లుకు పెరిగింది.

– కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది.
– ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు, యూనివర్శిటీలు, సొసైటీలు, కేజీవీబీ, మోడల్‌ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింపు చేసింది.
– ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా వీరికి అమలు చేస్తోంది.
– ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 360 కోట్ల మేర ఏడాదికి ప్రభుత్వంపై భారం పడుతోది. 

– ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసింది.
– దీని వల్ల 2020 నుంచి జనవరి నుంచి ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులగా మారారు.
– జనవరి 2020 నుంచి అక్టోబరు 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.

– పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకు వచ్చింది. 
– 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. 
– ఏడాదికి రూ. 2,300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.

– ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ తదితర సిబ్బందిని భారీగా నియమించాం.
– దీనివల్ల అదనంగా ఏడాదికి రూ.820 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడింది.

– అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అప్కాస్‌ను ప్రారంభించింది.
– మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జీతాలను జమ చేస్తోంది.
– ఈపీఎఫ్‌ మరియు ఈఎస్‌ఐ వంటి సదుపాయాలను కల్పించింది. 
– అప్కాస్‌ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 2,040 కోట్ల భారం పడుతోంది.

– ఎంపీడీఓలకు ప్రమోషనల్‌ ఛానల్‌ అంశాన్ని ఈ ప్రభుత్వం పరిష్కరించింది. 
– గ్రేడ్‌–1 వీఆర్వోలకు ప్రమోషన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసింది.
– రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,795 వీఆర్వో, వీఆర్‌ఏ పోçస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది.
– మహిళా ఉద్యోగులకు ఏటా అదనంగా ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసింది.
– రీలొకేట్‌ అయిన ఉద్యోగులకు 30శాతం హెచ్‌ఆర్‌ఐ చెల్లిస్తోంది.

Back to Top