రైత‌న్నా..నేనున్నా..

హామీ ఇచ్చా..అమ‌లు చేస్తున్నా..

నేడు రైతుల ఖాతాల్లోకి రూ.199.94 కోట్లు 

రబీ 2020–21, ఖరీఫ్‌–21 సీజన్‌ల సున్నా వడ్డీ రాయితీ జమ

ఖరీఫ్‌–2022 సీజన్‌కు చెందిన ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా..

బటన్‌ నొక్కి జమ చేయనున్న సీఎం వైయ‌స్ జగన్‌

అమరావతి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో రైతుల క‌ష్టాలు కళ్లారా చూసిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ రోజు నేను విన్నాను..నేను ఉన్నాన‌ని మాట ఇచ్చారు..ఇచ్చిన హామీని అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లు చేసి వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌కు అండ‌గా నిలిచారు. ఏ సీజ‌న్‌లో జ‌రిగిన పంట న‌ష్టానికి ఆ సీజ‌న్ ముగిసేలోపు చెల్లిస్తామ‌న్న మాట‌ను మ‌రోసారి వైయ‌స్ జ‌గ‌న్ నిల‌బెట్టుకుంటూ ఇవాళ రైతుల‌కు ఇన్‌ఫుట్ స‌బ్సిడీ, వైయ‌స్ఆర్ సున్నా వ‌డ్డీ పంట రుణాలు రైతుల ఖాతాల్లో నేరుగా జ‌మ చేయ‌నున్నారు.

రబీ 2020–21, ఖరీఫ్‌–2021 సీజన్లకు చెందిన వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్‌–2022 సీజన్‌లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైయ‌స్‌ జగన్‌ సోమవారం బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేయనున్నారు. రబీ 2020–21 సీజన్‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, ఖరీఫ్‌–2021 సీజన్‌లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమచేయనున్నారు. అదే విధంగా ఖరీఫ్‌–2022 సీజన్‌లో జూలై నుంచి అక్టోబర్‌ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఖరీఫ్‌ సీజన్‌ ముగియక ముందే జమచేయనున్నారు.

ఇప్పటివరకు రూ.1,795కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ..
ఇక గడిచిన మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమచేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 21.31 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.79 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేసినట్లవుతుంది.

అలాగే, గడిచిన మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ములు చేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 73.88 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందినట్లు అవుతుంది. గడిచిన మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల కింద రైతన్నలకు రూ. 1,37,975.48 కోట్ల సాయం అందించారు. 

గతంలో అంతా గందరగోళమే..
గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతన్నలు మధ్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించేవారు.

కానీ, ప్రస్తుతం ఈ–క్రాప్‌ ఆధారంగా నమోదైన వాస్తవ సాగుదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నారు. అంతేకాక.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్‌ ఆడిట్‌ కింద రైతుభరోసా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించడమే కాదు.. అర్హత ఉండి జాబితాల్లో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

Back to Top