త్వరలో  ‘ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీ’

29 వేల రేషన్‌ షాపుల పరిధిలో పంపిణీపై జిల్లా స్థాయిలో సమీక్షలు

క్షేత్ర స్థాయిలో ఇబ్బందులపై నివేదిక కోరిన అధికారులు

వాహనాలు సైతం సిద్ధం చేసిన పౌర సరఫరాల శాఖ   

  అమరావతి: త్వరలో చేపట్టనున్న ‘ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీ’కి సంబంధించి రేషన్‌ షాపుల వారీగా అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. అవసరమైన మేరకు మరిన్ని చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిం చాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. పంపిణీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోవడంతో పట్టణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకే సారి అధిక మొత్తంలో బియ్యం తీసుకువెళ్లేందుకు వీలుగా నాలుగు చక్రాల వాహనాలు వినియోగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 29,784 రేషన్‌ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 1,50,15,765 బియ్యం కార్డులు ఉన్నాయి.   

►ఒక రేషన్‌ షాపులో ఎన్ని కార్డులు ఉన్నాయో గుర్తించి, వాటి ఆధారంగా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.
►వివరాలను గ్రామాలు, పట్టణాల వారీగా విడివిడిగా తయారు చేశారు.
►ప్రతి రెండు వేల కార్డులకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల ఎదుటే తూకం వేసి బియ్యం పంపిణీ చేస్తారు. 
►ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలి.
►నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే దిగ్విజయంగా అమలవుతోంది.
►లబ్దిదారులు బియ్యం తీసుకునేందుకు వీలుగా ఉచితంగా బ్యాగు అందించనున్నారు.
►మార్గమధ్యంలో బియ్యం కల్తీకి అవకాశం లేకుండా గోదాముల నుంచి వచ్చే ప్రతి బ్యాగుపై స్ట్రిప్‌ సీల్‌ వేయనున్నారు.
►ప్రతి బ్యాగుపై బార్‌ కోడ్‌ కూడా ఉంటుంది.  నాలుగు చక్రాల వాహనంలోనే ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషిన్‌ ఉంటుంది. 
►రాష్ట్రంలో 13 వేలకుపైగా వాహనాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

Back to Top