చారిత్రక విజయానికి మూడేళ్లు

2019 మే 23న ఓట్ల లెక్కింపులో వైయ‌స్ఆర్‌సీపీ అపూర్వ విజ‌యం

151 అసెంబ్లీ స్థానాలు..22 ఎంపీ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల విజ‌య‌దుందుభి 

విశ్వసనీయతకు పట్టం కట్టిన జనం 

వైయస్‌ జగన్ మూడేళ్ల‌ పాలనలో 95 శాతం హామీలు అమ‌లు

తాడేపల్లి: కనివిని ఎరుగని రీతిలో వెలువడ్డ ప్రజా తీర్పు. ఒకే ఒక్క నాయకుడిపై పెల్లుబికిన అపార ప్రజాభిమానం. 2019, మే 23వ తేదీ ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టాన్ని స్వర్ణాక్షరాలతో రాసింది. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలిచ్చిన ఆ గట్టి తీర్పు ప్రజా పాలనకు గట్టి పునాది వేసింది. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పాలకుడిగా పట్టం కట్టింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజ‌యానికి నేటితో మూడేళ్లు పూర్తి అయ్యింది. 

ఒంట‌రిగా బ‌రిలోకి వైయ‌స్ఆర్‌సీపీ
2019లో జరిగిన సార్వాత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కవైపు నిలిచాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవు. తాను అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని సంక్రమంగా అమలు చేయలేదు. ఎన్నికల వేళ నిరుద్యోగ భృతి అంటూ..పసుసు-కుంకుమ అంటూ తాయిళాలు ప్రకటించారు. మరోవైపు జనసేన నాయకుడు పవన్‌తో లాలూచీ ఒప్పందాలు పెట్టుకొని వైయస్‌ఆర్‌సీపీ విజయానికి అడ్డుకునేందుకు చంద్రబాబు తొక్కని అడ్డదారి లేదు. అయితే ప్రజలు ఇవేవి పట్టించుకోకుండా జననేత వైయస్‌ జగన్‌కు పట్టం కట్టారు. ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌గా మారింది. ఫలితాలు ఏకపక్షంగా వెలుబడ్డాయి. 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏకంగా 151 సీట్లను ఓటర్లు కట్టబెట్టారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు..తనకున్న ఎమ్మెల్యేలు చాలదన్నట్లుగా అప్పట్లో వైయస్‌ఆర్‌సీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారు. యధృచ్చికంగా టీడీపీకి 23  ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చి చంద్రబాబు చెంప చెల్లుమనిపించారు.

ప్రజా సంకల్ప యాత్ర..జైత్రయాత్రగా మారి ..
 ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని నాటి ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర..జైత్రయాత్రగా మారి ఎన్నికల్లో ఘన విజయానికి నాంది పలికింది.  తన  రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై సాగిన వైయస్‌ జగన్‌ పాదయాత్రికుడిగా కోట్లాది జనాలకు ఆత్మబంధువైపోయారు.  తమ కోసం నడిచొచ్చిన ఆత్మీయుడైపోయారు. సుదీర్ఘ పాదయాత్ర దారెంబడి ప్రజల కష్టాలు వింటూ.. వారిని ఓదారుస్తూ.. ధైర్యాన్ని నూరిపోస్తూ.. భవిష్యత్తుపై గట్టి నమ్మకాన్ని కలిగించారు యువనేత. ఒక్క అవకాశం ఇస్తే.. ప్రజల తలరాతను మారుస్తానని అపార ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన ప్రజలకు వైయస్‌ జగన్‌ ఒక ఆశాజ్యోతిగా కనిపించారు. ఆయన నడక.. నడత.. మాట తీరులో ఓ విలక్షణ నాయకుడిని చూశారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు.. 

 ఫ్యాన్‌‌ గాలికి సైకిల్ తుక్కు తుక్కు..
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని ఉత్కంఠ. అపార అనుభవజ్ఞుడిని అని చెప్పుకునే బాబుగారు ఈసారి కూడా ఏదో మాయ చేస్తారనే అనుకున్న వాళ్లూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే అధికార పక్షనేతగా చంద్రబాబు అన్ని ప్రయోగాలు చేశారు. ఆఖరు నిమిషం దాకా తన విద్యలు ప్రదర్శించారు. కానీ, అవేవీ ఫలించలేదు. ఎన్నికల రోజు లక్షలాదిగా పోలింగ్‌బూతులకేసి సాగిన ప్రజాసమూహాలకు వైయస్‌ జగనే కనిపించారు. చెవుల్లో ఆయన మాటలే ప్రతిధ్వనించాయి. మాట తప్పని నైజం.. పదే పదే గుర్తుకు వచ్చింది. ఆయనిచ్చిన నవరత్నాల హామీపై గట్టి నమ్మకం కలిగింది. తమ బిడ్డల మంచి భవిష్యత్తు కోసం తమ కుటుంబాల్లో వెలుగుల కోసం ‘జగనే రావాలి.. జగనే కావాలి’ అన్న బలమైన కాంక్షతో ‘ఫ్యాను’ గుర్తుపై బలంగా ఓట్లేశారు ప్రజలు.ఆ రోజు పడ్డ ఓట్లు ఓ నమ్మకంపై.. విలువలు.. విశ్వసనీయతపై..

 బెస్ట్ సీఎంగా వైయ‌స్ జ‌గ‌న్ 
మే 23న ఎన్నికల కౌంటింగ్‌ అలా మొదలవ్వగానే.. ఇలా వైయస్‌ఆర్‌ సీపీ జైత్రయాత్ర సాగించిందని అందరికీ అర్థమైపోయింది. అనూహ్యమైన రీతిలో వెలువడ్డ ఎన్నికల ఫలితాలు ఒక అనితరసాధ్యుడి విజయానికి సాక్షిగా నిలిచాయి. ఐదుకోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు, బాధ్యత అంతా ఆ యువనేత భుజస్కంధాలపై పడింది. ఆ ప్రజా తీర్పు సరైనదే అని నడుస్తున్న ప్రజలా పాలన అడుగడుగునా.. రుజువు చేస్తోంది. ప్రజలకు తనిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ.. ముందుకు సాగుతున్న ఏపీ సీఎం.. ఎన్నికల విజయంలోనే కాదు.. పాలనలోనూ తనకు సాటెవ్వరూ లేరని ముందుకు సాగుతున్నారు. కలనైనా మేనిఫెస్టోను మరవక, అన్ని వర్గాల ఆర్థిక ప్రగతికి.. సంక్షేమ రథాన్ని కదిలిస్తున్నారు. మూడేళ్ల‌లో దాదాపు 95 శాతం హామీలు అమ‌లు చేసి ప్ర‌జా రంజ‌క పాల‌న అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మార్చేందుకు అనుక్షణం పరిశ్రమిస్తున్నారు. ప్రజలు తనకందించిన అపూర్వ విజయాన్ని.. అన్ని వేళలా మరవక గుర్తుచేసుకుంటున్న సీఎం ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌... వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. మూడేళ్ల‌ పాలనలో అనేక చారిత్రాత్మక చట్టాలు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మూడేళ్ల‌లోనే దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. వ‌రుస‌గా రెండేళ్లు స్కోచ్ అవార్డును సీఎంవైయ‌స్ జ‌గ‌న్ సొంతం చేసుకున్నారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచి ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కరోనా కట్టడి..లాక్‌డౌన్‌లో పేదలకు అండగా ఉంటున్న తీరు దేశాన్నే ఆకర్శించింది. అందరికి ఆదర్శంగా నిలిచారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వైయస్‌ జగన్‌ ఓ పాలకుడే కాదు.. ప్రజా సేవకుడు కూడా...ఇది కాదా రాజన్న రాజ్యం అంటూ ప్రజలు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకుంటూ..వైయస్‌ జగనే చిరకాలం సీఎంగా ఉండాలంటూ ఆంధ్రావని ఆకాంక్షిస్తోంది.

తాజా వీడియోలు

Back to Top