ప్ర‌తిప‌క్షానికి ప‌ట్టం

-తూర్పు రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి భంగ‌పాటు 
-వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుతో యండ‌ప‌ల్లి శ్రీ‌నివాసులురెడ్డి గెలుపు
– పని చేయని మంత్రి నారాయణ మంత్రాంగం
 
నెల్లూరు:  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై సామ, దాన, బేధ, దండోపాయాలు ప్రయోగించి శాస‌న మండ‌లి ఎన్నికలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయానందం 24 గంటలు కూడా గడవక ముందే ఆవిరైంది. తూర్పు రాయలసీమ పరిధిలోని ఉపాధ్యాయుల బాటలోనే పట్టభద్రులు కూడా టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని మట్టి కరిపించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తిచ్చిన‌ పీడీఎఫ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి 5195 ఓట్ల మెజారిటీతో రెండో సారి శాసన మండలికి ఎన్నికయ్యారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలు గెలవడానికి మంత్రి నారాయణ చేసిన మంత్రాంగం ఫలించలేదు.

అభ్యర్థి ఎంపికే మైనస్‌
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తన విద్యా సంస్థల మాజీ ఉద్యోగి, తనకు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని మంత్రి నారాయణ బరిలోకి దించారు. సీఎం చంద్రబాబుతో తనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన పట్టాభిని అభ్యర్థిగా ప్రకటింప చేశారు. వ్యవహార తీరు, ప్రజల్లో మంచి పేరు లేకపోవడం పట్టాభికి వ్యతిరేక వాతావరణం సృష్టించాయి. దీనికి తోడు జిల్లా పార్టీ ముఖ్య నేతలెవరితో సంప్రదించకుండా, వారి అభిప్రాయం తెలుసుకోకుండా పట్టాభిని ఎంపిక చేయడం పట్ల టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం వెల్లడయ్యాయి. మూడు జిల్లాల్లో టీడీపీ ముఖ్య నేతలే ఆయన అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేక ఈ ఎన్నికల వ్యవహారానికి దూరంగా వ్యవహరించారు. సీఎం జోక్యంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పార్టీ నేతలు అయిష్టంగా పట్టాభి కోసం పనిచేశారు. పట్టాభిని అభ్యర్థిగా ప్రకటించిన రోజే పీడీఎఫ్‌ అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి విజయం ఖాయమైందని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. పార్టీ నేతల సహాయ నిరాకరణ గమనించిన మంత్రి నారాయణ పట్టాభిని గెలిపించుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఒక వైపు పార్టీ నేతలను బుజ్జగిస్తూనే మరో వైపు ఎన్నికల నిర్వహణ కోసం తాను చేయాల్సిన పనులు చేశారు. తన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు పరిచయం ఉన్న వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంలో సఫలమయ్యారు. ఈ ఓట్లతో విజయం సాధించగలమని ధీమాతో వ్యవహరించారు. నెల్లూరు జిల్లాలోని 67,547 ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టగలిగితే విజయం కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన పనిలేదనే వ్యూహం అమలు చేశారు. ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేశారు. మూడు జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్ల జాబితాలు దగ్గర పెట్టుకుని తన విద్యా సంస్థలు, తనకు నమ్మకమైన పార్టీ నేతల ద్వారా వారందరినీ కలిసి ఓటు అభ్యర్థించే ఏర్పాటు చేశారు. ఓటర్లకు తాయిలాలు కూడా అందించే ఏర్పాట్లు చేశారు. ‘‘ అభ్యర్థి పట్టాభి కాదు నేనే అనుకోండి’’ అనేలా అన్నీ తానై వ్యవహరించారు. ఇంత చేసినా మంత్రి తన మనిషి పట్టాభిని గెలిపించుకోలేక పోయారు. పీడీఎఫ్‌ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి విజయం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, దాని అనుబంధ ఉపాధ్యాయ, ఇతర సంఘాల నాయకులు, కార్యకర్తలు మూడు నెలల పాటు తీవ్రంగా శ్ర‌మించి పట్టాభిని ఓడించగలిగారు.

సొంత జిల్లాలోనే దక్కని దన్ను
టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి సొంత జిల్లా అయిన నెల్లూరులోనే ఓటర్లలో పట్టు దక్కలేదు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ కోసం టీడీపీ శ్రేణులు, నారాయణ సంస్థల ఉద్యోగులు ప్రచార ఆర్భాటం చేశారు తప్ప ఓటర్లను ఆకర్షించలేక పోయారు. పీడీఎఫ్‌ అభ్యర్థి, ఆయన మద్దతు దారులు మూడు నెలల పాటు ఎలాంటి హడావుడి లేకుండా ఓటర్లందరినీ కలిసి ఓటు అభ్యర్థించడం కలిసి వచ్చింది. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు ప్ర‌చారంలో పాల్గొని ప్ర‌భుత్వ మోసపూరిత విధానాల‌ను వివ‌రించ‌డంతో ప‌ట్ట‌భ‌ద్రులు పీడీఎఫ్ అభ్య‌ర్థిని గెలిపించి, అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. దీంతో, టీడీపీ నైరాశ్యంలో మునిగిపోయింది. 

తాజా వీడియోలు

Back to Top