బాబుకు వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ లేఖ‌

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు  వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శనివారం బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చొద్దని ప్రతిపక్ష నేత కోరారు. వైయస్‌ జగన్‌ సీఎంకు రాసిన బహిరంగ లేఖ ఆయన మాటల్లో యథావిధిగా..

కరెన్సీ సంక్షోభం ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు కోట్ల ప్రజలకు నిద్రాహారాలు లేకుండా చేస్తోంది. కరువు మొత్తంగా 13 జిల్లాల్లో, ప్రత్యేకించి రాయలసీమలో విలయతాండవం చేస్తోంది. పాలన పేరిట మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఏ ఒక్క సామాజిక వర్గంగానీ, ఏ ఒక్క పల్లె– ఏ ఒక్క పట్టణంలో నివసిస్తున్ను మనిషిగానీ భరోసాగా లేరు. పరిశ్రమలు, పోర్టుల పేరు చెప్పి వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కుని మీకు కావాల్సిన వారికి కట్టబెట్టే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా సాగిస్తున్నురు. బందర్‌ పోర్టు పేరిట మీరు చేస్తున్న దురాగతాలు ఏ స్థాయిలో ఉన్నయన్నది ఈ నెల 1న అక్కడి పల్లెల్లో పర్యటించి నేను స్వయనా తెలుసుకున్నాను. మీ పాలనలో సంక్షేమ పథకాల అమలు ఎలా ఉన్నదీ వారి మాటల్లోనే వినండి. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటివి అమలు కాక, చదువుల కోసం..వైద్యం కోసం పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ పొలాలు అమ్ముదామన్నా, అమ్ముకునే వీలు లేకుండా రిజిస్ట్రేషన్‌ బంద్‌ చేసి వారి నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని బాధితులు చెప్పడం మా మనసును కలచివేసింది. ఇదేం దుర్మార్గం చంద్ర బాబు గారూ? వైద్యం కోసం పేదలు పొలాలు అమ్ముకోవాల్సిన దుర్భరమైన పరిస్థితులు మీ పుణ్యాన రాష్ట్రంలో మళ్లీ గ్రామ గ్రామానా ఇంటింటా వచ్చాయంటే ఎంతటి దిక్కుమాలిన పాలన చేస్తున్నారు మీరు?. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు అధ్వాన్నంగా ఉందన్న బుద్ధీ జ్ఞానం తమకు ఏ కోశానా లేకుండా ఎలా పోయిందో రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వండి. రాష్ట్రంలో పేదలకు, ఆర్థికంగా అశక్తులకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీని మీరు ఒక పథకం ప్రకారం బలహీన పరుస్తున్నారా, లేక మీ అసమర్ధత వల్ల ప్రాణాలు పోసే ఆ పథకం బలహీనపడిందా అన్నది తేల్చాల్సిన సమయం వచ్చింది కాబట్టే ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

ముఖ్యమంత్రి గారూ..మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారి పథకమైన ఆరోగ్యశ్రీని మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవగా పేరు మార్చారు. సంతోషం! మా బాధ, భయం ఏమిటంటే..ఎన్టీఆర్‌ ఆరోగ్యానికి ఆయన చివరి రోజుల్లో తమరు ఎలాంటి ‘అమూల్యమైన సేవ’లు అందించారో ఈ పథకానికి కూడా అలాంటి సేవలే అందించి, కోట్ల ప్రజలకు సంజీవని అయిన పథకానికి పాడె కడుతున్నారన్నదే మా ఆందోళన. ఈ పథకానికి నిధుల అవసరం ఎంత? మీరు చేసిన నిధుల కెటాయింపు ఎంత అన్నది మరోసారి ప్రజల ముందు ఉంచుతున్నాను. 2016–2017కు సంబంధించి కనీసం రూ.910.77 కోట్లు కావాలి అని సంబంధిత విభాగం అణాపైసలతో సహౠ లెక్కగట్టి మీ ముందు పెడితే, నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి మీ ప్రభుత్వం కేటాయించినది ఎంత? రూ.568.23 కోట్లు! ఎక్కడి రూ.910 కోట్లు? ఎక్కడి రూ.568 కోట్లు. బకాయిలు పోతే నికరంగా కేటాయింపులు ఎంత? ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1 కోటి 30 లక్షల కుటుంబాలకు ఈ కేటాయింపులతో ఏం కొంచం అయినా న్యాయం జరిగే వీలుందా? ఈ విషయం మీద బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే మేం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అభ్యంతరం లేవనెత్తాం. మా ఆందోళన నిజం అని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో సైతం ఈ రోజు ఆరోగ్యశ్రీ అమలు దాదాపుగా పడక వేస్తున్న వైనంతో నిరూపణ అవుతోంది.

ఏమిటిది ముఖ్యమంత్రిగారు..? మీ జేబులు, మీ మనీ డంపులు నింపుకునే పథకాలకు అవసరం లేకపోయినా అదనపు కేటాయింపులా? కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో అవసరం లేకపోయినా, ఎవరూ అడగకపోయినా జీవోల ద్వారా ఎస్కలేషన్లా? కమీషన్లు కొట్టేందుకు వీలుగా పట్టిసీమలో 21.5 శాతం అదనపు చెల్లింపులా? కమీషన్లు రావడం లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ బడ్జెట్‌లో దాదాపు 50 శాతం కోతలా? ఏం సందేశం ఇస్తున్నారు చంద్రబాబుగారూ?

ఇసుక నుంచి బొగ్గు కొనుగోళ్ల దాకా, కాంట్రాక్టుల నుంచి రాజధాని భూముల కొనుగోళ్ల వరకు, సదావర్తి భూములు మొదలు గుడిని గుడిలో లింగాన్ని మింగే పనుల వరకు మీరు చేయని దుర్మార్గం ఏదన్నా ఉందా చంద్రబాబు గారూ? రైతు, కూలీ, సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు సవ్యంగా ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అందుకోలేని పరిస్థితుల్లోకి రాష్ట్రంలో పరిపాలన చేరుకోవటానికి కారణం మీ దృష్టి అంతా అవినీతి– మరింత అవినీతి–తిరుగులô ని అవినీతి అనే మూడు అంశాల చుట్టూ మాత్రమే పరిభ్రమించడం కాదా?

కావాల్సిన నిధులు కేటాయించకుండా ఆసుపత్రుల్లో చికిత్సలు ఎలా సాధ్యం? గుండె జబ్బులు, మల్టిఫుల్‌ ఫ్రాక్చర్లు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు..ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న రోగుల పరిస్థితి చూడండి! నెట్‌వర్స్‌ ఆసుపత్రులకు మీరు చెల్లించాల్సిన బిల్లులు గత ఆరు నుంచి తొమ్మిది నెలలుగా చెల్లించకపోవడం వల్ల..రోగులకు చికిత్స చేయటానికి వారు నిరాకరిస్తున్నారు. ‘‘ మా దగ్గర నిధులు లేవు..ఇష్టమైతేనే చేయండి..లేదంటే మానేయండి’’ అని సాక్ష్యాత్తు ఆరోగ్య మంత్రి కుండబద్దలు కొట్టిన దుర్మార్గమైన పరిస్థితిలో మొత్తంగా ఆరోగ్యశ్రీ ప£ý కాన్ని ప్రభుత్వం సర్వనాశనం చేసింది. బకాయిల చెల్లింపు విషయంలో మీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులు ఈ మధ్యే వెల్లడించారు. 500 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని..అవి చెల్లించని పక్షంలో సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రులు ఆల్టిమేటం ఇచ్చేవరకు పరిస్థితిని మీ ప్రభుత్వం విజయవంతంగా దిగలాగింది. పేదలకు సకాలంలో వైద్యం అందించలేని మీ ప్రభుత్వం వల్ల ఎవరికి ప్రయోజనం ముఖ్యమంత్రిగారూ?

వారానికి ఒకసారో, రెండుసార్లో రక్తశుద్ధి చేసుకుంటే తప్ప బతికేందుకు అవకాశాలు లేని పేషంట్లకు డయాలసిస్‌ అపాయింట్‌మెంట్‌ కావాలంటే ఏడాది తరువాత గానీ ఇవ్వలేం అని ఆ సదుపాయం ఉన్న ఆసుపత్రుల నుంచి సమాధానం వస్తోంది. ఇదే విషయాన్ని నేనే అనేక బహిరంగ సభల్లో వివరించి చెప్పాను. వారానికి రెండు సార్లు డయాలసిస్‌ కావాల్సిన పేషంట్‌ ఒక్కో దఫా రూ.3000 చొప్పున వారానికి ఆరువేలు..నెలకు రూ.24,000, ఏడాదికి రూ.3,12,000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్యశ్రీ ఉండి ఏం లాభం? అంత డబ్బు చెల్లించుకోగల సామర్థ్యం లేని రోగులే అత్యధికంగా ఉంటారు. వారు ఎలా బతకాలి? నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే పరిస్థితి ఇంతగా దిగజారిపోయింది. దాన్ని సరిదిద్దకుండా మీరు తూతూ మంత్రంగా రాష్ట్రవ్యాప్తంగా ఏదో పది డయాలసిస్‌ కేంద్రాలు అదనంగా పెట్టటం వల్ల ఒనగూరేది లేదు. క్యాన్సర్‌ పేషేంట్లకు అవసరమైన కీమో థెరఫీతో కూడిన వైద్యాన్నే చూడండి..క్యాన్సర్‌కు వైద్యం చాలీచాలని కేటాయింపులకు పరిమితం అయ్యారు. తెర వెనుక డీల్స్‌లో భాగంగా చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నుంచి మొదలు అన్ని వైద్య సేవల్ని కూడా ప్రైవేట్‌ పరం చేసి, డాక్టర్లకు టార్గెట్లు పెట్టి ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి కాసుల సేద్యం చేసుకుంటున్నారు.

ఇలాంటి అంశాల మీద మీకు మానవత్వంతో కూడిన ఆలోచనే ఉండదా? పేదల్ని, సమాన్యుల్ని, అభాగ్యుల్ని బతికించే ఆలోచనలే మీకు రావా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 104, 108, 48 లక్షల ఇళ్ల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు భూముల పంపిణీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌..ఇలా వైయస్‌ఆర్‌గారి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఆధునిక భారతదేశ చరిత్రలోనే ఒక్కో సువర్ణ అధ్యాయం. మీ పాలన పుణ్యాన ఆ పథకాలన్నింటికీ దుర్గతి పడుతోంది. ఫలితంగా పేదవాడికి భరోసాయే పోతోంది. ఒకప్పుడు 108 వాహనానికి ఫోన్‌ చేస్తే..నిమిషాల్లోనే వచ్చేది. ఇప్పుడు అదే 108 మీ చలవతో దైవాధీనం సర్వీసుగా మారింది.

ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ అని మీరు పేరు మార్చిన ఆరోగ్యశ్రీలో అర్హులకు జరుగుతున్న అవమానాల మీద..రకరకాల వ్యాధులతో, ఆరోగ్య సమస్యలతో వస్తున్న ప్రజలకు ఆసుపత్రులు మొండిచేయి చూపుతుండటం మీద మీకు కించిత్తు కూడా బాధ కలగటం లేదా? తెల్ల కార్డు ఉండి కూడా కార్పొరేట్‌ వైద్యం ఎక్కడా అందక ప్రజలు పడుతున్న అవస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్రద్ధ చూపాలి. నిధుల విడుదల విషయంలో ఎలాంటి లోటూ రాదన్న భరోసా ఇవ్వాలి. కుటుంబాలను, ప్రాణాలను నిలబెట్టే ఈ పథకం విషయంలో తక్షణం మీ పద్ధతి మార్చుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో, మీ మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆరోగ్యశ్రీ రోగులను, లేదా వారి బంధువులను కలుపుకుని మా పార్టీ తరఫున ధర్నాలకు దిగుతామని స్పష్టం చేస్తున్నాం.

–వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.
Back to Top