ప్ర‌జా ప్ర‌స్థానానికి ప‌దిహేనేళ్లు





- దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర‌కు 15 సంవ‌త్స‌రాలు
- మ‌హానేత‌ను స్మ‌రించుకుంటున్న తెలుగు ప్ర‌జ‌లు
- రాజ‌న్న రాజ్యం మ‌ళ్లీ రావాల‌ని కోరుకుంటున్న ఆంధ్ర‌ప్ర‌జ‌లు

 హైదరాబాద్: ఆంధ్రప్ర‌దేశ్ చ‌రిత్ర‌ను మ‌లుపుతిప్పిన ఒక మ‌హా ఘ‌ట్టానికి నేటితో ప‌దిహేనేళ్లు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం కు శ్రీకారం చుట్టి నేటితో 15 సంవ‌త్స‌రాలు అవుతోంది. స‌రిగ్గా ఇదే రోజున అంటే 2003, ఏప్రిల్ 9 వ తేదీన ఈ యాత్ర‌ను ప్రారంభించారు.  ఏడేళ్ల వరుస కరువుతో పంట, పాడి పోయి పల్లెలన్నీ కన్నీరు పెడుతున్న రోజులవి.. కరెంటు బిల్లు కట్టలేదని రైతుల్ని లాక్కెళ్లి జైల్లో పెడుతున్న భయంకరమైన పాలనది.. కష్టజీవులు పొట్టచేత పట్టుకొని వలసపోగా ఊళ్లన్నీ గొల్లుమంటున్న కాలమది.. అది చంద్రబాబు జమానా.. జనం ఆశలన్నీ మోడువారిన సమయమది. అప్పుడు.. ‘నేనున్నానంటూ..’ అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే అది ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వ‌ర‌కు
ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జాప్ర‌స్థానం పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి 2003 ఏప్రిల్ 9న‌ ప్రారంభించిన పాద‌యాత్ర‌ జూన్ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు. నడి వేసవిలో 50 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా 68 రోజుల పాటు 11 జిల్లాల్లో ప‌ర్య‌టించారు. అలుపెర‌గ‌ని రీతిలో జ‌రిగిన ఈ యాత్ర‌లో అనేక‌మంది దివంగత మ‌హానేత తో మ‌మేకం అయ్యారు. 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే 690 గ్రామాల ప్రజలను పలకరిస్తూ 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్ని ప‌ల‌క‌రిస్తూ, నేనున్న ఆంటూ భరోసా ఇస్తూ  వైఎస్ రాజశేఖరరెడ్డి సాగించిన ఈ యాత్ర దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

సువ‌ర్ణ‌యుగానికి నాంది
పాద‌యాత్ర‌లో చూసిన ఇబ్బందులు, సాధ‌క‌బాధ‌కాల్ని వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌దా గుర్తించుకొన్నారు. అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరిపోయేలా ప‌థ‌కాలు రూపొందించారు. వ్య‌వ‌సాయానికి  ఉచిత విద్యుత్ ఇచ్చారు. నిరుపేద‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, 104 వాహ‌నాలు స‌మ‌కూర్చారు. మ‌హిళ‌ల కోసం  డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పించారు. వ్య‌వ‌సాయ దారుల‌కు జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టుల్ని సంక‌ల్పించారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సువ‌ర్ణ‌యుగం అన‌ద‌గ్గ పాల‌న‌కు ఈ ప్రజా ప్ర‌స్థానం యాత్ర నాంది ప‌లికింది. 

వైయ‌స్ జ‌గ‌న్‌తోనే రాజ‌న్న రాజ్యం
మ‌హానేత మ‌ర‌ణంతో రాష్ట్రంలో ప‌రిస్థితులు మ‌ళ్లీ మొద‌టికొచ్చాయి. చంద్ర‌బాబు 600 అబ‌ద్ధ‌పు హామీలు ఇచ్చి గ‌ద్దెనెక్కి ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచారు. ప‌దిహేనేళ్లు ప్ర‌త్యేక హోదా తెస్తామ‌న్న చంద్ర‌బాబు మాట త‌ప్పారు. ఇస్తామ‌న్న కేంద్ర ప్ర‌భుత్వం మోసం చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ధ్యేయంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు గ‌తేడాది న‌వంబ‌ర్ 6న మ‌హానేత స్ఫూర్తితో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టారు. ఇవాళ్టికి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 132వ రోజుకు చేరింది. ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో కొన‌సాగుతోంది. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు అమ‌ల‌వుతాయ‌ని, రాజ‌న్న రాజ్యం వైయ‌స్ జ‌గ‌న్ తెస్తార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్నారు.

Back to Top