విశాఖ హామీలు వాల్తేరు సముద్రంలో కలిపిన చంద్రబాబు

విశాఖ పట్నం పేరు చెబితే విశాలమైన సముద్ర తీరం, పోర్టు, ఉక్కు కర్మాగారం గుర్తొస్తాయి. వాటితోపాటే చంద్రబాబు విశాఖకు చేసిన హామీలు కూడా. అబ్బబ్బో ఒకటా రెండా వందలాది హామీలు సాగర కెరటాల్లా యమవేగంగా ఇచ్చేశారు బాబుగారు. హుద్ హుద్ తుఫానంత ధాటిగా ఇచ్చిన హామీలు తుఫాను తర్వాత పునరావాసంలాగే ఏమీ తేలకుండా పోయాయి. విశాఖను మెగా సిటీ చేస్తామన్నారు. తర్వాత స్మార్ట్ సిటీ అన్నారు. ఆపనులన్నీ నత్ననడకనే సాగుతున్నాయి. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అని ఆ ఊసే మర్చిపోయారు. అమరావతిలో సింగపూరుకు డైరెక్టు ఫ్లైట్ ఏర్పాటు చేయడం కోసం నానా తంటాలూ పడుతున్నారు. విసిఐసి పారిశ్రామిక వాడ సంగతి చెప్పుకోవడానికేం లేదు. మెట్రో రైల్ కోసం భౌగోళిక తదితర సర్వేలు పూర్తి చేసి కూడా దాన్ని అర్థంతరంగా వదిలేసారు. ఇక రైల్వేజోన్ పై కేంద్రతో పోరాడ్డంలో దారుణంగా విఫలమయ్యారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఏమయ్యాయో తెలియదు. మెగా ఐటి హబ్ గా విశాఖను తయారు చేస్తామని ప్రగల్బాలు పలికారు. వస్తున్న అరకొర కంపెనీలకు భూములు ధారాధత్తం చేస్తున్నారు. ఇన్నేళ్లలు గట్టిగా లక్షమందికి కూడా ఐటి రంగం ఉపాధి కల్పించలేక పోయింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్ పార్క్, ఎగ్జిబిషన్ మరియు కన్వెక్షన్ సెంటర్, లాజిస్టిక్ పార్కు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెరైన్ యూనివర్సిటీ, విశాఖ  కృష్ణపట్నం మధ్య 1516 పోర్టుల నిర్మాణం, సిటీని మెడికల్, ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడం ఇవన్నీ మాటలకే పరిమితం అయ్యాయి. 
ఒక్కసారి చంద్రబాబు గారి రికార్డు చూస్తే ఆయన 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 60 సార్లు విశాఖలో పర్యటించారు. వచ్చిన ప్రతిసారి కొన్ని కొత్త కొత్త హామీలను విశాఖవాసులపై చల్లేసి వెళ్లిపోయారు. మౌలిక సదుపాయాల మిషన్ అంటూ ఒకటి విశాఖలో మెదలుపెట్టి ఆనక దాని సంగతే వదిలేసారు. విశాఖలో కూచిపూడి కళాక్షేత్రం అన్నారు వాటి ఊసే లేదు. రాష్ట్రంలో మూడు జాతీయ క్రీడా ప్రాంగణాలు కట్టబోతున్నాం అందులో ఒకటి విశాఖకే అని నమ్మబలికారు. అదేమైందో తెలియదు. బిట్స్ పిలానీ, సరళ బిర్లా లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయని చెప్పారు. వారికి భూములు కట్టబెట్టారు. కానీ అవేమీ శంకుస్థాపనలు కూడా చేయలేదు ఇంతవరకూ. విశాఖలో పారిశ్రామిక సదస్సులు పెట్టి లక్షల కోట్ల ఎమ్ఓయూలు కుదుర్చుకున్నామన్నారు. భారీ సంస్థలు పెట్టుబడులతో వస్తున్నాయన్నారు. అవన్నీ ఎటు పోయాయో నేటికీ తెలియదు. ఇక విశాఖ మణిహారంలా బీచ్ లను సుందరీకరణ చేస్తామన్నారు. భీమిలి కాకినాడ లైన్ లో రహదారి, విశాఖ బీచ్ ను మెరీనా బీచ్ లా చేయడం, భీమిలి విశాఖ పోర్టు మధ్య బీచ్ కారిడార్ అభివృద్ధి మాటలకే పరిమితం అయ్యాయి. రిసార్టులు, సైన్స్ సిటీ, ఓషన్ రివర్, బొటానికల్ గార్డెన్, బర్డ్స్ పార్క్, అరకు, లంబసిగిల్లో రిసార్ట్స్, ఇంటర్నేషనల్ హోటల్స్ అని ఊదరకొట్టినవన్నీ ఉత్తిదే అని తేలిపోయింది. విశాఖలో అగ్రిటెక్ సదస్సులు, బిల్ గేట్స్ వంటి వారితో భారీ సభలు, మహిళాపారిశ్రామిక సదస్సులు, పెట్టుబడిదారుల సదస్సు, సిఇఓల సదస్సు, స్పీకర్ల సదస్సులంటూ ఎన్నో నిర్వహించారు చంద్రబాబు. వాటివల్ల విశాఖకు కొత్తగా లభించిన లాభం ఏమీలేదు కానీ, త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లకు మాంచి గిరాకీ పెరిగింది. వ్యవసాయ భూముల్లో స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉదారంగా రాయితీలిస్తోంది. విశాఖలో బీచ్ ఫెస్టివల్ అని కూడా చేయాలనుకున్నారు చంద్రబాబు. కానీ విశాఖ వాసులే కాదు యావత్ రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు.  
నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు విశాఖ నగరానికి కానీ, జిల్లాలో ఇతర ప్రాంతాలకు గానీ పావలా ప్రయోజనం చేకూర్చలేదు. ఆయన ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 10 జిల్లాలు పూర్తి చేసుకుని విశాఖలో అడుగు పెడుతున్న సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని యువనేత ముందు ఉంచాలనుకుంటున్నారు జిల్లా వాసులు. పేరుకు పెద్ద నగరమైనా ఉపాధికోసం యువత ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. బాబు హాయాంలో హుద్ హుద్ తుఫాను వచ్చి విశాఖ నగరం కళావిహీనం అయ్యిందని, అప్పటి నుంచీ తుఫాను బాధితులకు సరైన పరిహారాలు అందనే లేదని బాధపడుతున్నారు. ప్రతి జిల్లాకీ చేసినట్టే విశాఖ జిల్లాకూ బాబు వాగ్దానాలెన్నో చేసి వదిలేసాడని ఆగ్రహిస్తున్నారు. 

 
Back to Top