<strong>గుంటూరు :</strong> మహానేత దివంగత రాజన్న తనయ శ్రీమతి షర్మిల రాకతో అభిమానుల్లో ఉత్తేజం సరికొత్తగా ఉరకలెత్తుతోంది. గుంటూరు జిల్లా ఊళ్లన్నీ కదిలి వచ్చి ఆమెకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీమతి షర్మిల పాదయాత్ర పట్ల తమ అభిమానాన్ని ప్రకటిస్తున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులతో శ్రీమతి షర్మిల ప్రేమగా, ఆప్యాయతతో పలుకరిస్తూ మునుముందుకు సాగిపోతున్నారు. వారి వారి కష్టాలను శ్రద్ధగా వింటున్న జననేత సోదరి శ్రీమతి షర్మిల భవిష్యత్తు పట్ల భరోసా కల్పిస్తున్నారు.<br/>‘అమ్మా.. సాగునీళ్ళు అందుతున్నాయా.. పంటలు ఎలా ఉన్నాయి.. గిట్టుబాటు ధర వస్తుందా.. కూలీ ఎంత ఇస్తున్నారు..’ అంటూ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి షర్మిల గుంటూరు జిల్లా బెల్లకొండలో రైతులు, రైతు కూలీలను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం నుంచి సత్తెనపల్లి మండలం, రాజుపాలెంలోని కస్తూర్బా పాఠశాల వరకు మార్గం మధ్యలో పలువురు రైతులు, రైతు కూలీలను ఆమె ఇదే విధంగా పలకరించారు. గంగిరెడ్డిపాలెం శివారు పొలాల్లో చిన్న వెంకటస్వామి సాగుచేస్తున్న టమోటా పంటను పరిశీలించారు. దిగుబడి, గిట్టుబాటు ధర గురించి అడిగారు. కాస్తో కూస్తో పండిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆ రైతు సమాధానం ఇచ్చారు.<br/>రాజుపాలెం మండలంలోని శివారు పొలాల్లో రైతులు సుబ్బమ్మ, పగడాల అచ్చమ్మలతోనూ శ్రీమతి షర్మిల మాట్లాడారు. అప్పు కట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ బ్యాంకు అధికారులు తమను బెదరిస్తున్నారని అచ్చమ్మ వాపోయింది. నీ కష్టాలన్నీ తీరే రోజులు త్వరలో వస్తాయని, అధైర్యపడ వద్దని శ్రీమతి షర్మిల ఆమెకు భరోసా ఇచ్చారు. రాజుపాలెం పాదయాత్రలో అడుగడుగునా వ్యవసాయ కూలీలు కలిసి తమ సమస్యలను శ్రీమతి షర్మిలకు ఏకరువు పెట్టారు. ప్రభుత్వం కరవు పని కల్పిస్తే కొంతైనా మేలు జరుగుతుందని చెప్పారు. వారికీ శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.<br/>పాదయాత్రలో పాల్గొన్న అభిమానులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ మాబు సుభాని, పార్టీ నేత పులివర్తి రత్నబాబు స్వయంగా కార్యకర్తలకు భోజనాలు వడ్డించారు. మహానేత వైయస్ఆర్ కుమార్తె శ్రీమతి షర్మిల సమక్షంలో గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆసుల కోటేశ్వరరావు తన అనుచరులు 100 మందితో కలసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీమతి షర్మిల వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.<br/>పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కేంద్ర పాలక మండలి సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పెదకూరపాడు నాయకుడు నూతలపాటి హనుమయ్య సమక్షంలో సంగు వెంకటేశ్వర్లు, ఎస్.బాబు, ఆసు ఎల్లమందరావు, పులిబండ్ల రాంబాబు, పి.శ్రీనివాసరావు, దండే రాజేశ్ తదితరులు పార్టీలో చేరారు.<br/>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్నాయుడు ఆధ్వర్యంలో అభిమానులకు మంచినీటి సరఫరా చేశారు. రాజుపాలెంలో పార్టీ నాయకుడు చిట్టా విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నాయకులు ఆరిమండ వరప్రసాద్రెడ్డి, గజ్జెల నాగభూషణ్రెడ్డి, మండల కన్వీనర్ తోట ప్రభాకర్రావు, పొత్తూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు రాజుపాలెంలో ఓ చిన్నారికి శ్రీమతి షర్మిల పేరు పెట్టారు. కొండమోడుకు చెందిన షేక్ సైదా హుస్సేన్, సుభాన్బీల కుమార్తెకు షాదాబీ అని నామకరణ చేశారు.