మంత్రివై ఉండి బెదిరింపులకు దిగుతావా

♦ ఏపీ ప్రయోజనాల కోసం వైయస్ దీక్ష చేస్తున్నారు
♦ హరీశ్ కు  రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగదు
♦ వైయస్సార్‌సీపీ కార్యాలయాలపై దాడులు అమానుషం
♦ నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి

హైదరాబాద్: ప్రాజెక్టులు, నీటి వినియోగంపై తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. వైయస్  జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... మానుకోట చేస్తా అంటూ హరీశ్‌రావు బెదిరింపులకు దిగడమేమిటని నిలదీసింది. మంత్రి హోదాలో ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా హెచ్చరికలు చేస్తున్న హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.  హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

వైయస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం ఎంత బడ్జెట్ విడుదల చేశాయో ప్రకటించాలన్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యాలయంపై దాడిని, హైదరాబాద్‌లో పలు చోట్ల వైయస్సార్‌సీపీ జెండా గద్దెలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాచరికం అనుకుంటున్నారా?: నల్లా
‘సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ కొనసాగుతున్నదని అనుకుంటున్నారా?  అభినవ నిజాం నవాబు అనుకుంటున్నారా..’  అని నల్లా సూర్యప్రకాశ్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయిన హరీశ్‌రావు రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి మానుకోట పునరావృతమవుతుందంటూ హెచ్చరికలు చేయడం... రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు వైయస్ జగన్ దీక్ష చేస్తుంటే.. ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడమేమిటని నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో వైయస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి, జెండా గద్దెల కూల్చివేతను ఖండించారు.

 ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి: రాఘవరెడ్డి
వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో వైయస్ ప్రారంభించిన 36 ప్రాజెక్టుల్లో ఆరు పూర్తికాగా, 9 నిర్మాణదశలో ఉన్నాయని.. 21 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు రూ.10వేల కోట్లు కేటాయిస్తే వాటన్నింటినీ పూర్తి చేసి ఏకంగా 49 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వొచ్చన్నారు. కానీ అవి పూర్తయితే వైయస్సార్ కు  పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే పక్కన పెట్టారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీకి నష్టం జరుగుతుందునే వైయస్ జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా మానుకోట పునరావృతం అవుతుందంటూ హరీశ్ హెచ్చరికలు చేయడం సరికాదని పేర్కొన్నారు.  పచ్చకామెర్ల రోగులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లుగా టీఆర్‌ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని రాఘవరెడ్డి విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు దిగిపోయి.. డబ్బు వెదజల్లి గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. జేఏసీ పేరిట కొందరు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించడాన్ని ఖండించారు. 

To read this article in English: http://bit.ly/1sqePOC 

తాజా వీడియోలు

Back to Top