ప్రజాసమస్యలు గాలికొదిలి పారిపోయిన పచ్చసర్కార్

– అసెంబ్లీలో తేలిపోయిన అధికార పక్షం
–ప్రతిపక్ష నేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిక్కముఖం
– మైక్‌ కట్‌లు, వాయిదాలతోనే కాలయాపన 
– ప్రతిపక్షం ఆరోపణలకు పరుగో పరుగు
–తిట్లదండకంతో సభా సమయం వృథా చేసిన అధికార పక్షం


ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. గత నెల ఆరోతేదీన ప్రారంభమైన సమావేశాలు మార్చి 31 తేదీతో ముగిశాయి. 14 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలకు మాత్రం ప్రత్యేకత లేకపోలేదు. అమరావతిలో తొలిసారిగా జరిగిన సమావేశాలు కావడంతో అందరి ఆసక్తి ఈ సమావేశాలపై నెలకొంది. అసెంబ్లీని అద్భుతంగా నిర్వహించి తీరుతామని చంద్రబాబు, స్పీకర్‌ సహా ప్రగల్భాలు పలకడం తప్ప జరిగింది మాత్రం శూన్యం. ప్రజాసమస్యలపై ప్రతిపక్షం మాట్లాడిన ప్రతిసారీ షరామామూలుగానే ప్రతిపక్ష నాయకుడి ప్రసంగాలకు అడ్డుతగలడం.. మైక్‌లు కట్‌ చేయడమే జరిగింది. మరీ చోద్యం ఏంటంటే మీడియా పాయింట్‌లోనూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడకుండా టీడీపీ ఎమ్మెల్యేలు మైకులు లాక్కోవడం విడ్డూరం. హైదరాబాద్‌లో సమావేశాలు జరిగినంత కాలం సభలో ఎలాగూ మాట్లాడనీయలేదు.. అమరావతికి మారిన తర్వాత మీడియా పాయింట్‌కు వచ్చి కూడా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగలడం మరీ దారుణం. 

అసత్యాలు.. వ్యక్తిగత ఆరోపణలు..
తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం మొదలుకొని మార్చి 31న చివరి రోజు వరకు సమావేశాలంతా ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోయింది. గవర్నర్‌ ప్రసంగాన్ని చూస్తే టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను తీసుకొచ్చి చదివినట్టే ఉంది. చంద్రబాబు చెప్పుకొనే గొప్పలన్నీ గవర్నర్‌ ప్రసంగంలో స్పష్టంగా కనిపించాయి.  ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించినప్పుడు మాత్రం వ్యక్తిగత ఆరోపణలకు దిగడం అలవాటైపోయింది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజు నుంచి ఎన్నో విషయాలు తెరమీదకొచ్చాయి. అగ్రిగోల్డ్‌ వ్యవహారం, పదో తరగతి పేపర్‌ లీకేజీ, రోజా సస్పెన్షన్, ఆనంద్‌ ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీలో ఐదుగురు కూలీల మరణం., మిర్చి ధరల పతనం, ప్రత్యేక హోదా.. తదితర అంశాలను ప్రతిపక్షం ప్రస్తావించిన ప్రతిసారీ సమాధానం చెప్పలేక మైక్‌కట్‌లతో సర్కారు అభాసుపాలైంది. సభాధ్యక్షుడిగా హుందాగా వ్యవహరించాల్సిన ముఖ ముఖ్యమంత్రి స్వయంగా తాను మాట్లాడిన తర్వాత సభను వాయిదా వేయించాలని విప్‌ కాల్వ శ్రీనివాసులకు చెప్పడం ఆయన స్పీకర్‌కు సైగ చేయడం బయటకు లీక్‌ కావడం సర్కారు పరువును బజారున పడేసింది. ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి  ప్రతిపక్షానికి మైక్‌ ఇవ్వడం లేదు.. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ చేస్తున్న ఆరోపణలకు ఈ వీడియా సాక్షిగా నిలిచింది. ప్రతీసారి మైక్ ఇవ్వండి సార్ అని వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సభ నుంచే వెలేసే సంస్కృతి ఎక్కడుంది
శాసన సభ సమావేశాల సందర్భంగా అధికార ప్రతిపక్షాల నడుమ ఒక్కోసారి చర్చలు వాడివేడిగా సాగి నువ్వెంతంటే నువ్వెంత అని సవాల్‌ విసురుకునే దాకా వెళ్తాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం మామూలే. విచారణకు ఆదేశించమని ప్రతిపక్షం కోరడం.. దర్యాప్తు చేయించి నిరూపించుకుంటామని అధికార పక్షం చెప్పడం  సాధారణం. అయితే అవి విచారణ వరకు ఎన్ని వెళ్తాయనేది చెప్పలేం. ప్రతిపక్షం ఆరోపణ చేస్తే ప్రజాస్వామ్యంలో తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం మాత్రం అధికార పక్షంపైనే ఉంటుంది. దర్యాప్తుకు ఆదేశించి నిజాలను నిగ్గుతేల్చి నిప్పులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిదే. కానీ అగ్రిగోల్డ్‌ భూముల విషయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు మాత్రం సర్కారు విచారణకు ఆదేశించలేదు. అగ్రిగోల్డ్‌ బాధితుల పక్షాన వైయస్‌ జగన్‌ ఆధారాలతో వచ్చి మాట్లాడితే వ్యక్తిగత విమర్శలకు దిగడం విచిత్రం. సభలో ప్రతిపక్ష నాయకుడు కానీ.. మంత్రి ప్రత్తిపాటి కానీ ఒక్కరే ఉండాలని చకచకా తీర్మాణ పత్రం కూడా తీసుకొచ్చి చదవడం చూసి న్యాయనిపుణులు ఆశ్చర్యపోయారు. నిజానికి పార్లమెంటరీ వ్యవస్థలో ఇలా ఆరోపణలు నిరూపణ కానప్పుడు సభ నుంచి వెలేయడం ఎక్కడా లేదు... ఎప్పుడూ జరగలేదు. వైయస్‌ జగన్‌ ఆరోపణలపై జ్యుడీషియల్‌ ఎక్వైరీకి ఆదేశించి నిరూపణ కాకపోతే సభ నుంచి బయటకు పంపాలని అత్యుత్సాహం ప్రదర్శించిన చంద్రబాబు తనపై వచ్చిన ఓటుకు నోటు, అమరావతి భూ కుంభోకోణాల విషయంలో మాత్రం ప్రతిపక్షం కోరినట్టుగా సీబీఐ ఎంక్వైరీకి మాత్రం ఆదేశంచిలేదు. సభ జరగుతుండగానే పదో తరగతి పరీక్ష పేపర్‌లు కూడా వరుసగా నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో లీకయ్యాయి. అవన్నీ కూడా నారాయణ విద్యాసంస్థల్లోనే లీక్‌ కావడం విశేషం. అయితే ఈ సందర్భంలోనూ ప్రతిపక్ష నాయకుడు సీబీఐ దర్యాప్తు కోరితే దానికి మాత్రం చంద్రబాబు అంగీకరించకుండా అది లేకేజీ కాదు మాల్‌ ప్రాక్టీస్‌ అని కొత్త భాష్యం చెప్పడం ఒక ఎత్తయితే.. చివరికి లీకేజీకి సాక్షి సంబంధం ఉందంటూ ఆరోపణలు చేయడం విచిత్రమే. 

భూమా మరణంపై సభలో రాజకీయమా
అసెంబ్లీలో పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే భూమా నాగిరెడ్డి చనిపోయినప్పడు జరిగిన సంతాప తీర్మాణాన్ని రాజకీయ ప్రసంగంగా మార్చేసిన ఘనత చంద్రబాబుది. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరణించినప్పుడు వైయస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రతిపక్షం సభకు హాజరు కాలేదు. దీనిపై రాద్ధాంతం చేద్దామనుకుని చంద్రబాబు ప్రభుత్వం విమర్శల పాలైంది. వైయస్‌ జగన్‌ను కార్నర్‌ చేసేసి చావు నుంచి పబ్లిసిటీ పొందుదామని చూసిన టీడీపీకి నిరాశే మిగలింది. ఎంత రాజకీయ శత్రుత్వం ఉన్నా  సంతాప తీర్మాణాన్ని హుందాగా ప్రవేశపెట్టి చనిపోయిన వ్యక్తికి, ఆయన కుటుంబానికి గౌరవం ఇవ్వడం మన సంస్కృతి. కానీ చంద్రబాబు చేసింది వేరు. సంక్షోభంలోనూ అవకాశాలను వెతుక్కోవాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటాడు. ఆ విధంగానే భూమా మరణాన్ని రాజకీయం చేద్దామని తండ్రి చనిపోయి 24 గంటలు కూడా గడవకముందే కూతురు అఖిల ప్రియను సభకు రప్పించి చేసిన యాగీ అంతా ఇంతా కాదు. భూమాకు సంతాపం తెలిపేందుకు పెట్టిన సభను జగన్‌ను తిట్టడానికే అన్నట్టుగా మార్చేశారు టీడీపీ నాయకులు. సభ ప్రారంభానికి ముందు ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీ ఎందుకు రాలేదా అని ఆరాతీసిన జనాలకు వారి ప్రశ్నలకు సమాధానాలు దొరకడానికి ఎంతో సమయం పట్టలేదు. సభ పూర్తయ్యేటప్పటికే అంతా అర్థమైంది. సభకు రాకుండా సంతాప తీర్మాణానికి దూరంగా ఉన్న జగన్‌ను అందరూ ప్రశంసించారు. భూమా అఖిలప్రియను తల్లి విజయమ్మ, తానూ ఫోన్‌లో పరామర్శించి పెద్దరికం నిలబెట్టుకోవడమే కాకండా సరైన సమయంలో వెనక్కి తగ్గి భూమాకు నిజమైన నివాళి అర్పించాడు. రోజులు గడిచేకొద్దీ భూమా మరణానికి దారితీసిన పరిస్థితులు ఒక్కోటి బయటకు రావడంతో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీతోపాటు వైయస్‌ జగన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. 

Back to Top