దాపరికం..దోపిడీ కోసమే

సింగపూర్ కంపెనీలతో కలసి రూ.వేల కోట్లు కొట్టేసే వ్యూహం
♦ ప్రభుత్వ వాటా తగ్గించడమే పెద్ద స్కామ్
♦ సింగపూర్ కన్సార్టియంకు 58శాతం వాటా
♦ సర్కారు వాటా 42 శాతానికి పరిమితం

అంతా గోప్యం..  సుప్రీం మార్గదర్శకాలు బేఖాతర్
రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికలో.... స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో గృహాల నిర్మాణానికి డెవలపర్(కాంట్రాక్టర్) ఎంపిక కేసును విచారించిన సుప్రీం కోర్టు మే 11, 2009న తీర్పు ఇచ్చింది. ఆ క్రమంలో స్విస్ చాలెంజ్ విధానం అమలుకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని నిక్చచ్చిగా అమలు చేయాలంటూ అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేయడం గమనార్హం.
 
మార్గదర్శకం 1: స్విస్ చాలెంజ్ విధానం కింద ఏ తరహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలన్నది ప్రభుత్వం తొలుత గుర్తించి, వాటిపై బహిరంగ ప్రకటన చేయాలి.
 ఉల్లంఘన: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల వివరాలను బహిర్గతం చేయలేదు.
 
మార్గదర్శకం 2: ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మాస్టర్ డెవలపర్ ఎంపికకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించవచ్చు. లేదా ఎవరైనా స్వచ్ఛందంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించవచ్చు. మాస్టర్ డెవలపర్ ఎంపికలో సంస్థలతోగానీ.. కాంట్రాక్టర్లతోగానీ ఎలాంటి ముందస్తు సంప్రదింపులు చేయకూడదు.

ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియంతో ముందస్తు సంప్రదింపుల కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈలోగా జూలై 7న సీఎం చంద్రబాబు నేరుగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చలు జరిపారు. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని మౌలిక వసతుల కల్పన అథారిటీ నిరసించింది.
 
మార్గదర్శకం 3: ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోజర్(ఓపీపీ) చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. ఈ వ్యవహారంలో ఎలాంటి గోప్యత ఉండకూడదు.

ఉల్లంఘన: స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు బహిర్గతం చేయలేదు. వాటిని సీల్డ్ కవర్‌లో ఉంచినట్లు టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇది కౌంటర్ ప్రతిపాదనలు చేసే సంస్థలకు ప్రతికూలం.
 
మార్గదర్శకం 4: ఓపీపీ కన్నా మెరుగైన ప్రతిపాదనలతో తక్కువ ధరకు ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలను అన్వేషించాలి. కౌంటర్ ప్రతిపాదనల దాఖలుకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలి.
ఉల్లంఘన..: కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు.
 
మార్గదర్శకం 5: ఓపీపీతోపాటు కౌంటర్ దాఖలు చేసే సంస్థలకూ సమాన అవకాశాలు కల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.
ఉల్లంఘన: కేవలం విదేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలకే కౌంటర్ ప్రతిపాదనలు దాఖలు చేసే అర్హత కల్పించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం ఏడాదికి కనిష్టంగా రూ.150 కోట్ల నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తారు. టెండర్‌లో షెడ్యూలు దాఖలుకు ఏడాదికి కనీసం రూ.రెండు వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చడానికే సుప్రీం మార్గదర్శకాలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది.
 
ప్రభుత్వ వాటా తగ్గించారు... ఏపీఐడీఈ-2001 చట్టం తుంగలో తొక్కారు
ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ)-2001 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని సింగపూర్ సంస్థల కోసం తానే సవరించారు. రాష్ట్రంలో ఏ సంస్థకైనా గరిష్టంగా 33 ఏళ్లకు భూములు లీజుకివ్వాలని ఏపీఐడీఈ చట్టంలోని నిబంధనను.. 99 ఏళ్లకు లీజు లేదా భూమిపై పూర్తి హక్కులు కల్పించేలా మార్పులు చేశారు. ఇక ఆ చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించారు.
 
నిబంధన 1: ఏ ప్రాజెక్టులోనైనా ప్రభుత్వానికి కనిష్టంగా 51 శాతం వాటా ఉండాలి.
ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం.. తనకు 50 శాతం వాటా ఉండేలా అక్టోబరు 30, 2015న ప్రతిపాదించింది. కానీ.. గత జూలై 7న సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో సీఎం నేరుగా చర్చలు జరిపాక ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 48 శాతానికి పరిమితమైంది. సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 52 శాతానికి పెరిగింది.ఈ మర్మమేమిటన్నది సీఎం చంద్రబాబుకే ఎరుక.
 
నిబంధన 2: ప్రాజెక్టులపై  అజమాయిషీ ప్రభుత్వానికే ఉండాలి.
ఉల్లంఘన..: ఆరుగురు డెరైక్టర్లతో ఏడీపీ పాలక మండలిని ఏర్పాటు చేయాలని సింగపూర్ సంస్థలు ప్రతిపాదించాయి. ఇందులో నలుగురు సింగపూర్ సంస్థల ప్రతినిధులు.. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ఏడీపీ చైర్మన్‌గా తమ సంస్థలకు చెందిన డెరైక్టర్‌నే నియమించాలని కోరాయి. ఒక్కో డెరైక్టర్‌కు కనిష్ఠంగా 15 శాతం వాటా ఉంటుంది. ఏడాదికి నాలుగు సార్లు బోర్డు సమావేశమవుతుంది. 12 నెలలపాటూ ఒక డెరైక్టర్ బోర్డు సమావేశాలకు గైర్హాజరైతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది. ఆ స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తారు. ఒప్పందంలో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లపాటు ఎవరూ వాటాలను విక్రయించకూడదు.

ఆ తర్వాత కూడా ప్రైవేటు సంస్థ వాటా 26 శాతానికి తగ్గకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాలను విక్రయించాలని భావిస్తే తొలుత సింగపూర్ సంస్థలకే అవకాశం ఇవ్వాలి. సింగపూర్ సంస్థలు కొనేందుకు నిరాకరిస్తేనే ఇతరులకు విక్రయించాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని బట్టి చూస్తే సింగపూర్‌కు ఏ స్థాయిలో రాష్టర ప్రభుత్వం సాగిలబడిందో అర్థం చేసుకోవచ్చు.
 
నిబంధన 3: ప్రాజెక్టుల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఇద్దరు నిపుణులు సభ్యులుగా నియమించిన కమిటీ వాటిని పరిష్కరిస్తుంది.
ఉల్లంఘన..: సింగపూర్ కన్సార్టియం ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వివాదాల పరిష్కారానికి లండన్ కోర్టును వేదికగా ఎంచుకున్నారు.
 
కేల్కర్ కమిటీ ప్రతిపాదనలూ బుట్టదాఖలే..
దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు చేపట్టే విధానాలపై అధ్యయనం చేయడానికి విజయ్ కేల్కర్ అధ్యక్షతన 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. బీవోటీ(బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌పర్) నుంచి స్విస్ చాలెంజ్ వరకూ అన్ని విధానాలపై సమగ్ర అధ్యయనం చేసిన కేల్కర్ కమిటీ.. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయవద్దంటూ నవంబర్, 2015న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కానీ.. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన సీఎం చంద్రబాబు మాత్రం కేల్కర్ కమిటీ ప్రతిపాదనలను తుంగలోతొక్కి స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేస్తోండటం శోచనీయం.
Back to Top