మైలురాయిగా నిలిచే 'సమైక్య శంఖారావం'

హైదరాబాద్:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేయాలని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభ సమైక్య ఉద్యమంలో మైలురాయిగా నిలుస్తుందని ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు అభివర్ణించాయి. రాష్ట్ర విభజనకు నిరసనగా ఈ నెల 26న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ హైదరాబా‌ద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సమైక్య శంఖారావం బహిరంగ సభను నిర్వహిస్తున్నది. ఈ సభను విజయవంతం చేసేందుకు ఉద్యోగ సంఘాలు కూడా తమ వంతుగా నడుం బిగించి ముందుకు వచ్చాయి. సమైక్యవాదాన్ని చాటిచెప్పేందుకు ఈ సభకు భారీగా తరలి రావాలని వివిధ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. పార్టీలకు అతీతంగా సమైక్య వాదులంతా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీని అభినందించాయి.‌

సమైక్య శంఖారావం సభ సమైక్య ఉద్యమంలో ఓ మైలురాయిగా నిలుస్తుందని సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య ఎ‌న్ శామ్యూ‌ల్ గుంటూరులో ‌అన్నారు. సభకు పూర్తి మద్దతును ప్రకటించారు. సమైక్య సంఖారావం సభతో విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం మార్చుకోక తప్పదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు డాక్టర్ పి.జాన్స‌న్ ‌వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, టీడీపీలు చేతులు ఎత్తేసినా వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ మొదటి నుంచీ ఒకే విధానానికి కట్టుబడి, పోరాటం చేయడం అభినందనీయం అన్నారు. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కాలే‌జ్ ప్రిన్సిపా‌ల్ ఆచార్య ఇ. శ్రీనివాసరెడ్డి కోరారు.

‌మైక్యాంధ్రను కాంక్షించే విద్యార్థులంతా లక్షలాదిగా సమైక్య శంఖారావం సభకు తరలి రావాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్ట‌ర్ ఎం.వెంకటరమణ పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావానికి హైదరాబా‌ద్ విద్యు‌త్ ఉద్యోగుల జేఏసీ‌ (హై-జాక్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సభకు విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి‌రావాలని జేఏసీ నేతలు గణేశ్, నర్సింహులు పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావం సభకు ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు భారీగా హాజరు కావాలని ఏపీఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్య ఉద్యమంలో ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు ప్రముఖ పాత్ర పోషించారని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. విభజన ప్రక్రియ నిలిచిపోవాలంటే ఈ సభను జయప్రదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమైక్య సభను విజయవంతం చేయాలని ఆర్టీసీ వైయస్ఆర్ మజ్దూ‌ర్ యూనియ‌న్ కోరింది. సభకు భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు తరలి‌ రావాలని యూనియన్ రాష్ట్ర కోశాధికారి సి.బి.ఎస్.రెడ్డి, ప్రచార కార్యదర్శి జె.హెచ్.పా‌ల్‌లు విజ్ఞప్తి చేశారు.

మైనారిటీ ఉద్యోగుల మద్దతు :

‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం బహిరంగ సభకు యునెటైడ్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేష‌న్ (ఉమా) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఉమా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.‌ ‌సంషుద్దీన్ ఒక ప్రకటన విడుదల చేశారు. మైనార్టీ ఉద్యోగులం‌తా పెద్ద సంఖ్యలో హాజరై సమైక్య శంఖారావాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సభకు భారీగా తరలిరావాలని కోరుతూ సీమాంధ్ర జిల్లాలోని యునెటైడ్ మైనారిటీ ఎంప్లాయీ‌స్ అసోసియేషన్ అధ్యక్ష‌, కార్యదర్శులకు లేఖలు పంపారు.

మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సంఘీభావం :

సమైక్య శంఖారావం సభకు తరలివచ్చేందుకు మున్సిపల్, కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు సిద్ధమవుతున్నారు. సభకు వేలాదిగా తరలిరావాలని మున్సిపల్, కార్పొరేష‌న్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్.వర్మ తిరుపతిలో పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడుతూ సమైక్య నినాదంతో వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు ‌శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం సభను నిర్వహించేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

ఉపాధ్యాయ పోరాట సమితి :
సమైక్య శంఖారావం సభకు నెల్లూరు జిల్లా నుంచి వేలాదిగా తరలిరావాలని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి రాష్ట్ర మహిళా కన్వీనర్ ఎస్.రాజేశ్వరి ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీల‌కు అతీతంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావి వర్గాలు సమైక్య శంఖారావం సభకు హాజరు కావాలని కోరారు.

దేవాదాయ ఉద్యోగులు కూడా :
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు దేవాదాయ సీమాంధ్ర ఉద్యోగుల మద్దతు ప్రకటించింది. దేవాదాయ శాఖ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కృపావరం ‌ఈ విషయం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమైక్యవాదులు సమైక్య శంఖారావం సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

తిరుపతి ఉద్యోగ జేఏసీ :
సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు తిరుపతి ఉద్యోగ జేఏసీ మద్దతు ప్రకటించింది. సభకు ప్రతిఒక్కరూ హాజరై సమైక్యవాణిని ఢిల్లీకి వినిపించాలని తిరుపతిలో నిర్వహించిన ఒక సమావేశంలో పిలుపునిచ్చింది.

తాజా వీడియోలు

Back to Top