చౌకడిపోలు చంద్రన్న కంపెనీల్లో విలీనం

కుక్కని చంపాలంటే పిచ్చిదని
ముద్రేయాలని పాత సామెత. చంద్రబాబు తీరూ అంతే. ఏదైనా ప్రజోపయోగ కార్యక్రమాన్ని
నిర్వీర్యం చేయాలంటే ముందు దాన్ని భ్రష్టుపట్టించి, పనికిరాకుండా చేసి చివరకు మూతపెట్టించేస్తాడు. సహకార సంఘాలు, బ్యాంకులను అదే తరహాలో
మూయించేసిన బాబు ఇప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థను కూడా నెమ్మదిగా నామరూపాల్లేకుండా చేస్తున్నాడు. చౌకడిపోలను
గంపగుత్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టేస్తున్నాడు. అది కూడా తన సొంత కంపెనీ హెరిటేజ్ షేర్లు
ఉన్న మరో కంపెనీ చేతికి చంద్రన్నమాల్స్ గా మారిన చౌకడిపోలను రాసిచ్చేస్తున్నాడు.

పేదలకు, అల్పాదాయ వర్గాలకు చౌకధరలకే
సరుకులు అందించే ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వం పలు రకాల
ఆహార, గృహావసరాలను సబ్సిడీమీద పేదలకు అందించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు
చేసారు. కొన్ని చోట్ల అవకతవకలున్నప్పటికీ, పేదసాదలకునిత్యావసరాలను అందించడంలో చౌక డిపోలు ప్రముఖ పాత్ర
పోషించాయి. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తక్షణం బడ్జెట్ లో ప్రజాపంపిణీకి
కోసం వినియోగిస్తున్ననిధులను కూడా కలిసొచ్చేలా చేసుకోవాలనే ప్లాన్ చేసారు. నెలకో విదేశీ ప్రయాణం, వారాంతాల్లో ఏదో ఒక
పండుగ కార్యక్రమాలు, సమ్మిట్లు, సదస్సులు ఇలా వివిధ రకాల నిరుపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవాల్సిన నిధులను
ప్రజాపంపిణీ మీద నిరర్ణకంగా ఖర్చు చేస్తున్నట్టు ఆయనకు అనిపించి ఉండొచ్చు.

ఆ దురాలోచన వచ్చిందే
తడవుగా బాబు గారు పైన చెప్పిన సామెతను అమల్లోకి తెచ్చారు. బియ్యం, కిరసనాయలు, చక్కెర ఇచ్చే చౌకధరల్లో
గత కొన్నేళ్లుగాకందిపప్పు, నూనె, గోధుమ పిండి, గోధుమలు, ఉప్పు, చింతపండు, కారం, పసుపు వంటి నిత్యావసర దినుసులు కూడా ఇస్తున్నారు. చంద్రబాబు క్రమంగా వీటన్నిటికీ
మంగళం పాడాడు. ఒక్క బియ్యాన్ని మాత్రమే రేషన్ షాపులు ఇస్తున్నాయి. ప్రతిపక్షాలు, ప్రజల తీవ్రనిరసనల అనంతరం
మూడు నెలలుగా చక్కెర ఇస్తున్నారనుకోండి. అయితే చౌక డిపోల స్థానంలో చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో
కొత్త దందాకు తెరలేపారు చంద్రబాబు. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ సంస్థలతో కలిసి రేషన్ షాపులను మాల్స్
గా అభివృద్ధి చేస్తున్నామంటూ హడావిడి చేసారు. ఎపిలో 29,000 రేషన్ షాపులుండగా పైలెట్ ప్రాజెక్టుగా 500 షాపులను చంద్రన్న విలేజ్
మాల్స్ గా పేరు మార్చి, పసుపు రంగుతో షాపులను నింపి, చంద్రబాబు ఫొటోలతో అలంకరించి, అట్టహాసంగా ప్రారంభించారు
విజయవాడలో స్వయంగా చంద్రబాబు తొలి మాల్ కు రిబ్బన్ కట్ చేసారు. అన్ని వస్తువులు మార్కెట్
కంటే తక్కువ ధరలకే అంటూ ప్రచారం చేసినా, లోపలకెళ్లాక ప్రజలు బెంబేలెత్తేలా రేట్లున్నాయి. కొన్ని మాల్స్ లో, సబ్బులు, సౌందర్యసాధనాలు తప్ప
అసలు సరుకులే లేకపోవడం మరో శుభపరిణామం. దాంతో ప్రజలు చంద్రన్న మాల్స్ వంక కన్నెత్తి కూడా చూడటం
లేదు. ఆర్భాటంగా మొదలెట్టి ఆర్నెల్లు గడవకుండానేచాలా చోట్ల ఈ ఎల్లో
మాల్స్ కి తాళాలు వేసి కనిపిస్తున్నాయి. పైగా డీలర్లకు 8% కమీషన్ అని చెప్పిన బాబు తర్వాత దాన్ని 2.5% చేయడంతో డీలర్లంతా కంగు
తిన్నారు. ఇలా అయితే దుకాణాలు నడపలేమంటూ తాళాలేసేసారు. ఈ విధంగా బాబు సక్సెస్
ఫుల్ గా చౌకధరల దుకాణాలను పేదలకు దూరం చేయగలిగాడు.

ఇప్పుడు చౌక డిపోలు
లేవు. ఉన్న డిపోల్లో సరుకుల పంపిణీ లేదు. మాల్స్ అవతారం ఎత్తిన డిపోలు ఉసూరుమంటూ మూతబడ్డాయి. ఇప్పుడు
బాబు తన ప్లాన్ లో పార్టు బిని అమలు చేస్తున్నాడు. హెరిటేజ్ భాగస్వామ్య సంస్థ అయిన ఫ్యూచర్ గ్రూపుకు
మాల్స్ కి సరుకులు పంపిణీ చేసే బాధ్యతతో పాటు నిర్వహణ బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం
తీసుకున్నాడు.. పైలెట్ గా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఉన్న
6,806 రేషన్ షాపుల నిర్వహణ, ముడిసరుకుల సరఫరాలను
ఫ్యూచర్ గ్రూప్ కు బదలాయిస్తూ ఉత్తర్వులిచ్చాడు. బాబు తలుచుకుంటే ఎలాంటి
వ్యవస్థనైనా నట్టేట్టో ముంచేయగలడనడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ మరో ఉదాహరణగా నిలిచింది. 

తాజా వీడియోలు

Back to Top