ప్రజలకు ప్రతిబింబం ప్రజా సంకల్పం

ఆశలు చిగురించే దారి. తోడుందనే ధైర్యం నిండిన ఊపిరి. ఆ అడుగులు భవితను రాసే సంతకాలనే నమ్మకం. ఇది ప్రజా సంకల్పం. వేలాదిగా తరలివస్తున్న ప్రజా సమూహంలో కదలలేని దివ్యాంగులు, కొడిగట్టిన దీపాల్లా వృద్ధులు మైళ్లకు మైళ్లు నడిచి వచ్చి, గంటల కొద్దీ ఎదురు చూపులు చూస్తున్నారు. ఎందుకు...?? ఓ భరోసా కోసం. నేనున్నాను భయపడకండి అని తలపై నిమిరి, గుండెలకు హత్తుకుని, నుదుటిని ముద్దాడి మరీ పోస్తున్న జీవం కోసం. ఫించన్లకోసమో, సమస్యలు చెప్పుకోవడం కోసమో మాత్రమే రావడం లేదా అవ్వా తాతలు. ఒక్కసారి తమ ప్రియతమ నేత బిడ్డను చూసి పోదామనే ఆత్రంతో వస్తున్నారు. ఆప్యాయంగా గడపగడపనూ పలకరిస్తున్న ఆ ఇంటింటి పెద్ద కొడుకును ప్రేమగా పలకరించి, ఆశీర్వదించి పోవాలని ఎదురు చూస్తున్నారు. చెడు దృష్టులు, దుర్మార్గుల కుట్రలను చీల్చుకుని చైతన్యమై నిలబడిన ఆ యువనవ సారధికి అక్కచెల్లెళ్లు హారతి పట్టేందుకు కళ్లలో వత్తులేసుకుని చూస్తున్నారు. ప్రజా సంకల్పంలో అడుగడుగునా ఓ ఉద్వేగ వాతావరణం. జన నేతను చూస్తే చాలనే ప్రజల ఆరాటం...మేడలు, మిద్దెలు, దారులు, చెట్లు అన్నీ ప్రజా సమూహాలతో నిండి పోతున్నాయి. జన నేతకు ఘన స్వాగతం పలుకుతున్నాయి. 

 చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలో సాగిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కర్షకుల కష్టాలకు కేరాఫ్ అడ్రస్ లా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజక వర్గం ఇది. ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. సొంత ప్రాంతం వాడిగా తన ఊరిని ఉద్ధరిస్తాడనుకున్న చంద్రగిరి వాసులు చంద్రబాబు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎన్నో ఏళ్లుగా టిడిపి ఏదో చేస్తుందని నమ్మిన వందలాది మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడి జగన్ మోహన్ రెడ్డికి మద్దతిచ్చారు.  తెలుగుదేశానికి చెందిన నెత్తకుప్పం గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ ఇతర సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మర్నాడు శనివారం 63వ రోజు ప్రజా సంకల్ప యాత్ర రామచంద్రాపురంలో కొనసాగింది. అక్కడ జరిగిన భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఆ వేదికపై ప్రజలతో మాట్లాడిన జగన్ ’ఎన్నికలు దగ్గరపడుతుంటే పింఛన్లు, హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ అవసరం గుర్తొచ్చాయా’ అని చంద్రబాబు పై ధ్వజం ఎత్తారు.. 

పెద్ద పండక్కి పెద్ద కొడుకు ఇంటికొచ్చాడని నెన్నూరు గ్రామ ప్రజలు సంబర పడ్డారు. తోరణాలతో, వాకిళ్లలో ముగ్గులతో, గంగిరెద్దులు, తప్పెట్లు, వాయిద్యాలతో యువనేతకు ఘన స్వాగతం పలికారు. యువత ప్రతిపక్షనేతతో సెల్ఫీలు దిగాలని పోటీపడ్డారు. సంప్రదాయ నృత్యాలతో, ఆటపాటలతో ప్రజాసంకల్పానికి సంక్రాంతి సొబగులు అద్దారు. సోమవారం నాడు తాను బస చేసిన శిబిరం వద్దే సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు యువనేత. కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, ప్రజల మధ్యలో జరుగుతున్న ఈ సంక్రాంతి ప్రజా సంకల్పంలో మరో అపూర్వ ఘట్టంగా నిలిచిపోయిందని అభిప్రాయపడ్డారు. ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు పార్టీ నేతలు, ప్రజలు, అభిమానుల సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపగా, వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు.

ప్రజా సంకల్ప  యాత్రలో 63వ రోజు నగరిలో కొనసాగింది. ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి ప్రాంతంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు వైఎస్ జగన్. సహకార వ్యవస్థను బాబు నాశనం చేసాడని విమర్శించారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు సహకార ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని అక్కడకు వచ్చిన కార్మికులు యువనేత ముందు తమ ఆవేదనను వినిపించారు. చక్కెర ఫ్యాక్టరీలు, పాల డైయిరీలు బాబు హయాం లోనే మూతబడ్డాయని, మన ప్రభుత్వం రాగానే సహకార సంఘాలకు పూర్వ వైభవం తెస్తామని మాటిచ్చారు ప్రతిపక్షనేత. గాలేరు నగరిలో భాగంగా సమ్మర్ స్టోరేజీ ట్యాంకును దివంగ ముఖ్యమంత్రి వైయస్సార్ కట్టించారనీ, అది నేటికీ ఈ ప్రాంత వాసులకు ఉపయోగ పడుతోందని అన్నారు. కానీ బాబు వచ్చి ఇన్నేళ్లైనా హంద్రీ నీవా కాలువు రాలేదు, గాలేరు నగరి కాలువా రాదు అన్నారు. చంద్రబాబు వచ్చిన దగ్గర నుండీ ఏం చేసాడో ప్రజలు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పారు వైఎస్ జగన్. 

64వ రోజు ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాళహస్తి నియోజక వర్గంలో కొనసాగింది. బీసీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన జగన్ ’ఏటా 10వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్న బాబు నాలుగేళ్లలో మొత్తం 10వేల కోట్లను కూడా సాంక్షన్ చేయలేద’ని విమర్శించారు. వివిధ కులాలకు ఆయనిచ్చిన హామీలన్ని మాటలవరకే. తీర్మానం చేసి కేంద్రానికి పంపి నాపని అయిపోయింది, చేయాల్సింది కేంద్రమే అంటాడని ఎద్దేవా చేసారు. మత్సకారులు తమ హామీలపై నిలదీస్తే తాట తీస్తా అని బెదిరించడం ఓ ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా అని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత.. చేయలేని హామీలను ఇచ్చి, తర్వాత అడిగితే వారిపై విరుచుకుపడి పోతున్న చంద్రబాబు అహంకారాన్ని గద్దె దించి మరీ దించాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. అడుగడుగునా ఆంధ్రప్రజల గుండె చప్పుళ్లను వింటూ, వారి కన్నీళ్లను తుడుస్తూ సాగుతున్న మహాపాదయాత్ర త్వరలో 1000కి.మీ.ల మైలు రాయికి చేరువ కాబోతోందని, ఇదో మరో గొప్ప ప్రస్థానమని అంటున్నారు విశ్లేషకులు.  
 
Back to Top