ప్రభుత్వానికి గులాబీ గిరి దెబ్బ


ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకపోతే వారు రోడ్డుమీద కొచ్చి తమ నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. లేదా ముఖ్యమంత్రిని కలిసి వినతులు అందజేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఆ రెంటికీ అవకాశం లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సమస్యలతో తనని కల్వ వచ్చిన వారికి తిట్లతో సత్కారం చేసి, బెదిరింపులతో భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. తన 9ఏళ్ల పాలనలోనే కాదు ఈ 4ఏళ్ల పాలనలోనూ రోడ్డెక్కిన జనాలపై లాఠీలతో విరుచుకుపడమని పోలీసులకు ఆదేశాలిస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరి గొంతు వినిపించినా నిర్దాక్ష్యణ్యంగా అణిచేస్తూనే ఉన్నారు. అందుకే ఈ రెండు మార్గాలకూ మధ్యే మార్గంగా విశాఖ జిల్లా చోడవరంవాసులు వినూత్న నిరసన కమ్ వినతి తెలిపారు. జుత్తాడ హైస్కూల్ విద్యార్థులతోపాటు, ఆ గ్రామ ప్రజలు  చోడవరం వచ్చిన విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావును కాన్వాయిని అడ్డుకున్నారు. అసలే అంతర్గత కుమ్ములాటలతో వేడెక్కి ఉన్న తరుణంలో ప్రజల వైపు నుంచి ఈ రాస్తారోకో ఏమిటో అని గంటా అనుమానపడి హడావిడిగా కిందకి దిగారు. 
డిజిటల్ ముఖ్యమంత్రికి జుత్తాడ విద్యార్థుల సవాల్
జుత్తాడ వాసులు మాత్రం వివాదాల జోలికి పోకుండా అహింసా పద్ధతిలో తమ నిరసన తెలిపారు. జుత్తాడ హైస్కూల్ లో ఆంగ్లమాధ్యమం లేదని, దాన్ని సాంక్షన్ చేయమంటూ ఎన్నాళ్లుగానో అడుగుతున్నా విద్యాశాఖ కానీ, ప్రభుత్వం కానీ స్పందించడం లేదని మంత్రికి తెలియజేసారు. అంతేకాదు గులాబి పువ్విచ్చి మరీ తమ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం మంజూరు చేయమని కోరారు. అహింసా మార్గంలో ఆంగ్లేయులతో పోరాడి నాడు దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. ప్రజాస్వామ్యం, ప్రజల రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఓటేసి గెలిపించిన ప్రభుత్వాలతో కూడా పోరాడే హక్కులు సాధించాల్సిరావడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అనుకోవాలి. అవినీతి పాలకులను ఎన్నుకున్న పాపానికి ప్రజలు పడుతున్న పాట్లు ఇన్నీ అన్నీ కావు. డిజిటల్ క్లాస్ రూమ్ లు, ఈ హాజర్ అంటూ కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను గాలికొదిలేస్తోంది.
సౌకర్యాల లేమి 
పోటీ ప్రపంచంలో ఆంగ్లమాధ్యమం ఆవశ్యకత తెలిసి, సాంకేతిక సిఎమ్ అని పిలిపించుకునేందుకు ఇష్టపడే చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడం సిగ్గు చేటు కాదా? కేవలం సొంత డప్పా కొట్టుకోవడం తప్ప క్షేత్ర స్థాయిలో పాఠశాలలు ఎంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్నాయో పట్టించుకోరు. రాష్ట్రంలో 44,385 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాధమికంగా 3,500 పాఠశాలల్లో, మున్సిపాలిటీల్లో 478 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసురూములు ప్రతిపాదించారు. ఒక్కో తరగతి గది డిజిటలైజ్ చేయడానికి 5 లక్షల నుంచి 8 లక్షలు ఖర్చు అవుతుందని నిర్ణయించారు. ఇందుకోసం టెండర్లు కూడా పిలిచారు. డిజిటలైజేషన్, ఇంకా నిర్వహణ వారి బాధ్యతే. ఇందుకోసం ఎన్నికోట్లు ఖర్చుకానున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరుగుదొడ్డి సౌకర్యం లేని పాఠశాలలెన్నో ఉన్నాయి. ఉపాధ్యాయ భర్తీలు జరగక అరకొర టీచర్లతో నెట్టుకొస్తున్న స్కూళ్లెన్నో లెక్కేలేదు. చివరకు ఇరుకు తరగతి గదుల్లో, ఆట స్థలం కూడా లేని పాఠశాలలకు లెక్కే లేదు. కొన్ని స్కూళ్లలకు విద్యుత్ కనెక్షన్ కూడా లేదు. మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదం చేసే ఫిజికల్ ట్రైనర్స్ పోస్టులకు చంద్రబాబు హయాంలోనే గండి పడింది. నాణ్యమైన విద్యను అందించాల్సన ప్రభుత్వ విద్యాలయాలను మెరుగు పరిచేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోని చంద్రబాబు సర్కార్, డిజిటలైజేషన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు కోట్లు దోచిపెట్టడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. 

తమ పాఠశాలను డిజిటలైజ్ చేయక్కర్లేదు కానీ ఇంగ్లీష్ మీడియం మంజూరు చేయమని గులాబీగిరీతో విద్యాశాఖా మంత్రి ముందు తమ నిరసనను మెత్తగా తెలియజేసిన జుత్తాడ విద్యార్థులు, ప్రజలను అందరూ అభినందిస్తున్నారు. టిడిపి ప్రభుత్వ విధానాలపై నిరసన చూపడానికి, తమకు దక్కాల్సిన హక్కులను సాధించుకోడానికి ప్రజలు అనుసరించే మార్గాల్లో ఇప్పుడు గులాబీగిరీ కూడా చేరింది. ఘెరావ్ లో ఇరుక్కున్న మంత్రి గంటా అధికారులతో మాట్లాడి హైస్కూలులో ఆంగ్లమాధ్యమం మంజూరుకు ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం ఈ సంఘటనకు కొసమెరుపు.


 
Back to Top