'ఫీజు'కు ప్రభుత్వం సరికొత్త ఫిటింగ్

మీ ఇంట్లో గోడ ఉందా...‌! గోడ మీద బల్లి ఉందా...! అన్న చందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. ఫీజు రీయింబర్స్మెంట్‌ విషయంలో మీకు స్లాబు ఇల్లు ఉందా?.. ఇంట్లో రంగుల టీవీ ఉందా?.. లేకపోతే రెండు చక్రాల వాహనం ఉందా అని ఆరా తీస్తోంది. ఒకవేళ పొరపాటునో లేక గ్రహపాటునో మీకు స్లాబ్‌ ఇల్లు, కలర్‌ టీవీ, ద్విచక్ర వాహనం ఉన్నాయా... అయితే మీ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ హుళక్కే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పే ఏ విధంగా ఎత్తేయాలా అని సవాలక్ష దారులు వెతుకుతున్న ప్రభుత్వం తాజాగా ఈ సరికొత్త ఫిటింగ్‌ పెడుతోంది. ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చదవాలి... అందరూ ఆర్థికంగా ఎదగాలన్న మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తోంది.

అందరూ చదువుకోవాలంటూ ప్రకటనలు గుప్పించే రాష్ట్ర ప్రభుత్వం ... దాని ఆచరణలో మాత్రం అడగడుగునా నిబంధనన బంధనాలు వేస్తోంది. ప్రభుత్వం కొత్త ఆంక్షల ఫలితంగా డబ్బుకు పేదవారేమో కానీ... చదువుకు కాదంటూ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్‌ పథకానికి ఈ సర్కార్‌ పెద్దలు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యంతో చదువుకోవడం మాట దేవుడెరుగు దరఖాస్తు చేసుకునేందుకే విద్యార్థులు భయపడేలా ఎత్తుగడలు వేస్తోంది.

ఫీజు రీయింబర్స్మెంట్‌ పథకాన్ని ఖజానాకు గుదిబండగా భావిస్తున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం 
ఎలాగైనా ఈ పథకానికి తిలోదకాలు వదిలేయాలన్న ఆతృతతో శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. 
ఫీజు రీయింబర్స్మెంట్‌ పొందే విద్యార్థుల కుటుంబాలను స్వయంగా తనిఖీ చేయాలన్న అధికారుల ప్రతిపాదనను మంత్రివర్గ ఉప సంఘం ఆమోదించింది. ఇందుకోసమే ప్రత్యేకంగా జిల్లాకు నాలుగైదు బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తనిఖీ బృందం సభ్యులు కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితాను పరిశీలిస్తారు. అనుమానం ఉన్న వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు సంక్షేమ శాఖ కమిషనర్లు, ముఖ్య కార్యదర్శులు కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరపనున్నారు.

తనిఖీలతోనే సరిపెట్టకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లు తేలితే వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారట. దానితో పాటు అందుకు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తనిఖీల తర్వాతే ఫీజు రీయింబర్స్మెంట్‌ చెల్లిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ స్వయంగా ప్రకటించటం విశేషం.

అంతేకాకుండా ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లలో జమ‌చేసే స్కాలర్‌షిప్‌కు ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. ఆధార్ కా‌ర్డు ఉంటేనే ఇకపై స్కాలర్‌షిప్ వర్తిస్తుందని మరో బ్రేకు వేయాలని లిటిగేషన్‌ తెచ్చింది. వీటితో పాటు కళాశాలలో వేలిముద్రలు ఇవ్వాలి. అవి ఆధార్ డేటాబే‌స్‌లో ఉన్న వేలిముద్రలు సరిపొలితేనే స్కాలర్‌షిప్ అకౌంట్‌లో వచ్చి చేరుతుంది. అయితే తొలుత హైదరాబాద్, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో ‌దీన్ని అమలు చేయనున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క జిల్లాలో కూడా ఆధార్ పూర్తయినట్టు అధికారికంగా ప్రకటన జారీ కాలేదు. అంటే అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఆధా‌ర్‌ నంబర్ లేకపోతే అంతే సంగతులు అన్నమాట. దీంతో పాటు రెండేళ్లకు పైగా చదువుకు దూరంగా ఉన్న వారికి అనర్హులుగా ప్రకటించే ప్రతిపాదనకు కూడా ఒకే చెప్పినట్టు సమాచారం. 

ఇక ఫీజు రీయింబర్స్మెంట్‌పై 3 వేల 300 కోట్ల వరకు లోటు ఏర్పడే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 2011 -12 , 2012-13 సంవత్సరాలకు 6 వేల 760 కోట్లు అవసరం. ఇందులో ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 2వేల 650కోట్లు చెల్లించింది. 800 కోట్ల రూపాయలు బడ్జె‌ట్‌లో కేటాయించారు. ఇక మరో 3 వేల 300 కోట్లను ఎలా మేనేజ్ చేయాలా అనేదానిపై కసరత్తు చేస్తోంది. దానిలో భాగంగానే ఫీజు రీయింబర్స్మెంట్‌ను పథకం ప్రకారం అటకెక్కించేందుకు ‌కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పావులు కదుపుతోంది.
Back to Top