భగ్గుమంటున్న రాజధాని గ్రామాల ప్రజలు..!

() రాజధాని గ్రామాల్లో తిరగబడుతున్నరైతులు

() ప్రభుత్వ యంత్రాంగంపై అసహనం

()పత్తా లేని మంత్రులు, ఎమ్మెల్యేలు

విజయవాడ) రాజధాని కోసం ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చంద్రబాబు
ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవం మాత్రం చేదుగా ఉంది. ఎక్కడికక్కడ
రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. భూములు లాక్కొనేటప్పుడు గొప్ప గొప్ప హామీలు
ఇచ్చిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల్ని శాపనార్ధాలు పెడుతున్నారు.

 

రాజధానిలో తిరగబడుతున్న రైతులు

మాస్టర్ ప్లాన్ అవగాహన సదస్సుల పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు
రైతుల అసహనానికి, ఆవేదనకు అద్దం పడుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో
మాస్టర్ ప్లాన్ గురించి చెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ
ఎక్కడికక్కడ రైతులు మాత్రం అధికారుల్ని నిలదీస్తున్నారు. అభ్యంతరాలు
తెలియచేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. సంవత్సరం పొడవునా పండే
భూముల్ని కూడా జరీబు కేటగిరీలో పెట్టలేదని నిలదీశారు. కావాలనే మెట్ట భూములుగా
మార్చేస్తున్నారని వాపోయారు. మరో వైపు రైతు కూలీల పింఛన్ ల ఎంపికలో అక్రమాలు
జరిగాయని వాదించారు. దరఖాస్తు చేసుకొన్న వారిలో సగానికి సగం మంది దరఖాస్తుల్ని
తప్పించేశారని, ఏ ప్రాతిపదికన తప్పించేస్తున్నారని నిలదీశారు.

రైతులకు ఒక తీరు, పారిశ్రామిక వేత్తలకు ఒక తీరు

రైతులకు ఇవ్వాల్సిన భూముల్ని కొండవీటి వాగు దగ్గర కేటాయిస్తున్నారని
నిలదీశారు. అది నీటి ముంపు ప్రాంతం అని తెలిసినా ఎలా కేటాయిస్తారని అడుగుతున్నారు.
పారిశ్రామిక వేత్తలకు మాత్రం రాజదాని కి దగ్గరలో అందుబాటులో స్థలాలు
కేటాయిస్తున్నారని, ఇది ఎలా సాధ్యం అని నిలదీశారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం
తమను మోసం చేస్తున్నదని వాపోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను పిలిపిస్తే వారినే
నిలదీస్తామని పట్టు పడుతున్నారు. మొత్తం మీద అవగాహన సదస్సులు మాత్రం అభాసు
పాలవుతునే ఉన్నాయి. 

ఆగ్రహానికి కానరాని జవాబు

రైతాంగం మూకుమ్మడిగా భగ్గుమంటున్నప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వంలో చలనం ఏమాత్రం
లేదు. రైతుల నుంచి భూములు లాక్కోవటమే తప్ప వెనక్కి ఇచ్చేప్రసక్తి లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.
దీంతో ప్రజల ఘోష అరణ్య రోదన గా మారుతోంది.

 

 

 

 

Back to Top