ఉత్తరాంధ్ర ఉనికి మరచిన బాబు

 

మెడికల్ హబ్, మల్టీస్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుప్రతులు, మెడికల్ కాలేజీలు...చంద్రబాబు మైకు పట్టుకుంటే చెప్పే ముత్యాల్లాంటి మాటలివి. మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా...బాబు మాటలు చూడ మురిపెంబుగుండు...తరచి చూడబోతే బోడి గుండు అన్నట్టుంది రాష్ట్రం ఆరోగ్య దుస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం విషజ్వరాలతో మూలుగుతోంది. కార్పొరేట్ ఆసుపత్రులకెళ్లి లక్షల్లో బిల్లులు చెల్లించగల వారికి వైద్యం అందదనే బెంగలేదు. ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన నాయకులకూ విదేశాలకెళ్లి రూట్ కెనాల్ కు కూడా ప్రభుత్వ ఖర్చులతో ఖరీదైన వైద్యం అందుతుంది. కానీ బడుగులకు, బలహీనులకు, ఓటు బాంకుగా ఆ నాయకులు లెక్కపెట్టుకునే జనానికి మాత్రం సాధారణ జ్వరానికి కూడా మందులుండవు. విజయనగరం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలే కాదు మైదాన ప్రాంతాల్లోనూ విషజ్వరాలు, డెంగ్యూ మరణాలు ఉధృతమౌతున్నాయి. వేలాదిరోగుల్లో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు రోగుల తాకడి ఎక్కువౌతోంది. కానీ ఎక్కడా పరీక్షలు, మందులు ఉండటం లేదు. దాంతో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న రోగులను ఫీజుల పేరుతో పీడించుకుతింటున్నారు. తప్పని పరిస్థితుల్లో వేల రూపాయిల ఫీజులు చెల్లించుకుంటున్నారు రోగులు. గత పదిరోజుల వ్యవధిలో ఉత్తరాంధ్రలో 100మందికి పైగా డెంగ్యూతో మరణించినట్టు సమాచారం. జిల్లా పి.హెచ్.సిల్లో మందులు డాక్టర్ల కొరత, చివరకు జ్వర నిర్థారణ కిట్లు కూడా లేకపోవడం వీటిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.   
పారిశుధ్యలోపం, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఖరి ఈ మరణాలకు ముఖ్య కారణం. ఎక్కడ చూసినా పేరుకుపోతున్న చెత్త చూస్తే చంద్రబాబు చెబుతున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర లేదా అని అనిపించకమానదు. విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన చికిత్సలు అందుబాటులో ఉండటం లేదు. ప్రత్యేక వైద్య శిబిరాలు, మందుల పంపిణీ, తక్షణ దిద్దుబాటు చర్యలే లేవు. వైద్యశాఖా అధికారులు సైతం ఎలాంటి చలనం లేకుండా ఉండటం దురదృష్టకరం. తనిఖీల పేరుతో డెంగ్యూ బాధితుల లెక్కింపు తప్పించి, అదుపు చేసేందుకు తక్షణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ప్రతిపక్షం, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర నటిస్తోంది. నిజానికి ఉత్తరాంధ్రలో మెడికల్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు వైద్యనిపుణులు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గూడెల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు ఈ ప్రాంతం గురించి కానీ, ఇక్కడి ప్రజల ఆనారోగ్య పరిస్థితులపై కానీ పెదవి విప్పడం లేదు. ఓ పక్క ఇంత దారుణమైన పరిస్థితులు ఉత్తరాంధ్రలో విలయతాండవం చేస్తుంటే విషజ్వరాలే లేవని బొంకుతోంది ప్రభుత్వం. పేదలకు అండగా ఉన్న ఆరోగ్యశ్రీని లేకుండా చేసిన ప్రభుత్వం ప్రజల సాధారణ ఆరోగ్య అవసరాలను కూడా తీర్చలేని నిర్లక్ష్యపాలన సాగిస్తోంది.  ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఈ పరిస్థితులను చూసే 1000 దాటే ప్రతి చికిత్సనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చారు. 
 


తాజా వీడియోలు

Back to Top