తాగునీటి ఎద్దడి..ముందు చూపు కరువు

విజయవాడ) ఆంధ్రప్రదేశ్ అంతటా తాగునీటి ఎద్దడి తాండవిస్తోంది. కనీస అవసరాలు
కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని వదిలేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం
మీద మథన పడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టడంతో అధికారుల్ని వెంట
బెట్టుకొని ప్రలోభాల పనిలో తిరుగుతున్నారు. దీంతో ప్రజల తాగునీటి కష్టాలు
పట్టించుకొనే నాథుడు కరవయ్యాడు.

వేస‌వి తాకిడికి రాష్ట్రం గొంతెండుతోంది. ప‌ల్లెలూ, ప‌ట్ట‌ణాలూ, న‌గ‌రాలూ దాహంతో అల్లాడుతున్నాయి. చెరువులు, జ‌ల‌శ‌యాల్లో నీటిమ‌ట్టం అడుగంట‌డంతో
తాగునీటి ఎద్ద‌డి నెల‌కొంది. ప్ర‌కాశం బ్యారేజీ ఇసుక దిబ్బ‌లతో ద‌ర్శ‌న‌మిస్తోంది.
మ‌రో ప‌ది రోజుల్లో బ్యారేజీ ఖాళీ... ప్ర‌ధానంగా నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని
విజ‌య‌వాడ‌,
గుంటూరు న‌గ‌రాల‌కు, తెనాలి త‌దిత‌ర ప‌ట్ట‌ణాల‌కు, ప‌ల్లెల‌కూ ప‌ది రోజుల త‌ర్వాత తాగునీరు
అందించే మార్గం క‌నిపించ‌డం లేదు. శ్రీ‌శైలం నుంచి నీరు విడుద‌ల కాక‌పోతే కృష్ణా, గుంటూరు జిల్లాల గొంతెండిపోవాల్సిందే. రాయ‌ల‌సీమ‌లోని
క‌డ‌ప‌,
క‌ర్నూలు, నంద్యాల‌, నందికొట్కూరుల‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో
తాగునీటి క‌ష్టాలు చెప్ప‌న‌ల‌వికాదు. అయినా ప్ర‌భుత్వం మాత్రం నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు
వ్య‌వ‌హ‌రిస్తోంది. 

ముంచుకొస్తున్న ముప్పు

కృష్ణాడెల్టాకు ఆయువుప‌ట్ట‌యిన ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద నీటి మ‌ట్టం గ‌ణ‌నీయంగా
ప‌డిపోతోంది. వారం రోజుల వ్య‌వ‌ధిలో రెండు అడుగుల మేర‌కు నీటిమ‌ట్టం త‌గ్గిపోయింది.
ప్ర‌స్తుతం ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద కేవ‌లం ఆరు అడుగుల నీటి మ‌ట్టం ఉంది. ఇది 1.5 టీఎంసీల‌కు స‌మానం. ప్ర‌స్తుతం రోజుకు
వెయ్యి క్యూసెక్కుల నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.
డెడ్ స్టోరేజీలో అర టీఎంసీ నీటిని నిల్వ చేస్తే, మిగిలిన ఒక టీఎంసీ నీరు ప‌ది రోజుల‌కు మాత్ర‌మే
స‌రిపోతుంది. ఆ త‌ర్వాత వ‌ర్షాలు కుర‌వ‌క‌పోయినా, శ్రీ‌శైలం నుంచి నీటిని విడుద‌ల చేయ‌క‌పోయినా
కృష్ణా,
గుంటూరు జిల్లాలు
గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వు. 

నీటి ఎద్ద‌డి తీవ్ర‌రూపం

కృష్ణా,
గుంటూరు
జిల్లాల్లో 20 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేష‌న్లు, 1981 గ్రామ పంచాయ‌తీలున్నాయి. చెరువుల్లో నీటిని
నింపుకోడానికి ఫిబ్ర‌వ‌రిలో రెండుసార్లు కాల్వ‌ల‌కు నీటిని విడుద‌ల చేశారు. కృష్ణా
ప‌శ్చిమ డెల్టా కింద గుంటూరు జిల్లాల్లో 129 తాగునీటి చెరువులు, ప్ర‌కాశం జిల్లాలో 22 చెరువులున్నాయి. ఇందులో 200కు పైగా చెరువులు నెర్రెలు చీలి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.
2015 న‌వంబ‌ర్ 0.02 టీఎంసీలు, ఏఫ్రిల్ నెల‌లో 0.042 టీఎంసీలు ఎడ‌మ కాల్వ ద్వారా ఇచ్చారు. కృష్ణా
జిల్లాకు సాగ‌ర్ ఎడ‌మ కాల్వ కింద రెండు టీఎంసీలు విడుద‌ల చేయాల‌ని కృష్ణా బోర్డు
ఆదేశాలు జారీ చేసినా ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ఫ‌లితంగా తెచ్చుకోలేక‌పోయారు. 

కృష్ణా తూర్పు డెల్టాలో మ‌రీ ఘోరం

కృష్ణా,
ప‌శ్చిమ గోదావ‌రి
జిల్లాల్లో విస్త‌రించి ఉన్న కృష్ణా తూర్పు డెల్టాలో 393 తాగునీటి చెరువులు ఉండ‌గా, 43 చెరువుల్లో చుక్క‌నీరు లేదు. 25శాతం కంటే త‌క్కువ నీరు ఉన్న చెరువుల సంఖ్య 60. స‌గానికంటే త‌క్కువ నీరు ఉన్న చెరువులు 96, పూర్తిగా నీరు నిండి ఉన్న 16 చెరువులు కాకుండా మిగ‌తా చెరువులో నీటితో ఈ
నెల 24 వ‌ర‌కు నెట్టుకురావ‌చ్చ‌ని, ఆ త‌ర్వాత వేస‌వి కాల‌మంతా తాగునీరు అందించ‌డానికి
2.07 టీఎంసీల నీరు అవ‌స‌ర‌మ‌ని అధికారులు ప్ర‌భుత్వానికి
నివేదించారు. కానీ శ్రీ‌శైలం ప్రాజెక్టులో తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న నీరు 3 టీఎంసీలే. అందులో కేవ‌లం కృష్ణా తూర్పు
డెల్టాకు 2.07 టీఎంసీల నీరు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని
అధికారులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌లు గురించి ప్ర‌భుత్వం
ఇప్ప‌టికీ దృష్టి పెట్ట‌లేదు. 

మ‌రి రాయ‌ల‌సీమ‌లో....

క‌డ‌ప కార్పోరేష‌న్ తాగునీటి అవ‌స‌రాల‌ను తీర్చిన అల‌గ‌నూరు బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్
పూర్తిగా ఖాళీ అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌ల గురించి ప్ర‌భుత్వం
ఆలోచించ‌నే లేదు. క‌ర్నూలు న‌గ‌రం తాగునీరు అందించే సుంకేసుల బ్యారేజీలో 0.08 టీఎంసీల వినియోగార్హ‌మైన నీరు ఉంది. ఈ
నీటితో 10 రోజులు నెట్టుకురావ‌చ్చు. క‌ర్నూలులో ఉన్న
ఎస్ఎస్ ట్యాంకు నీటిని హేతుబ‌ద్ధంగా వినియోగించుకుంటే, గ‌రిష్ఠంగా నెల రోజుల పాటు  తాగునీటి అవ‌స‌రాలు
తీర‌తాయి. 

       తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటే
జిల్లాల స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ పటిష్టమైన ఏర్పాట్లు జరగటం లేదు. మంత్రులకు
ప్రజల అవసరాలు తీర్చటంలో టార్గెట్లు లేకపోయినా, ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని కొనుగోలు
చేయటం మీద టార్గెట్లు పెడుతున్నారు. దీంతో ప్రజల కష్టాలు పట్టించుకొనే నాథుడు కరవు
అయ్యాడు.

 

 

Back to Top