సూత్రధారి చంద్రబాబు.. పాత్రధారులుగా అధికారులు


రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకటే సూత్రం అమలవుతోంది. భూములు
ఇచ్చేందుకు నిరాకరించిన వారి ని వేధించటం, భయాందోళనలకు గురి చేయటం. ఈ విషయంలో
చంద్రబాబు మార్గదర్శకత్వంలో తెలుగుదేశం నాయకులు పోటీపడి ప్రవర్తిస్తుంటే, ఇప్పుడు
అధికారులు తోడయ్యారు.

మొదట నుంచి ఈ ప్రాంతాన్ని సింగపూర్ సంస్థలకు అప్పగించాలన్నది చంద్రబాబు ఎత్తుగడ.
ఇందుకోసం రైతుల నుంచి భూముల్ని లాక్కొనేందుకు చేయని కుట్రలేదు. పన్నని పన్నాగం
లేదు. గత ఏడాది ఆగస్టులో భూముల్ని లాక్కొనేందుకు నోటిఫికేషన్ వేశారు. అప్పటి నుంచీ
నయానో, భయానో భూములు లాక్కొంటూ వచ్చారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో భూములు
ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోలేదు. దీంతో అక్కడ డిసెంబర్ నెలలో ఒక్కసారిగా 13 చోట్ల
వ్యవసాయ పరికరాల్ని దహనం చేశారు. వీటి విలువ రూ. 20 లక్షలుగా చెబుతున్నారు. దీంతో
భయభ్రాంతులకు గురైన రైతులు తమ సర్వస్వాన్ని అప్పగించేశారు. ఇంత జరిగినా ఆ ఘటనకు
పాల్పడిన వారిని గుర్తించలేదంటూ పోలీసులు చేతులు దులుపుకొన్నారు.

ఈ ఏడాది అక్టోబర్ లో గద్దె చంద్రశేఖర్ అనే రైతుకి చెందిన ఐదున్నర ఎకరాల చెరకు
తోటను తగలబెట్టేశారు. దీని మీద ఆయన ఆందోళన వ్యక్తం చేసి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
కు గోడు వెళ్లబోసుకొంటే.. కక్ష కట్టి ఆయన మేనల్లుడిని ఎత్తుకెళ్లి చిత్రహింసలు
పెట్టారు.

ఇప్పటిదాకా ఈ దుశ్యర్యలకు తెలుగుదేశం నాయకులే పాల్పడేవారు. కానీ, ఇప్పుడు
నేరుగా రాజధాని సాధికారక సంస్థ..క్రీడా కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకొంది. తాజాగా
గుండపు చంద్రం అనేరైతుకి చెందిన 7.3 ఎకరాల పొలాన్ని బుల్ డోజర్లు పెట్టి
దున్నించేశారు. ఒక్కసారిగా పొలంలోకి దూసుకొచ్చిన అధికారులు గంట..గంటన్నర వ్యవధిలో
మొత్తం అరటి తోటను సర్వ నాశనం చేశారు. తర్వాత సర్వే నెంబర్ పొరపాటు అంటూ కొత్త
కలరింగ్ ఇచ్చేసి చేతులు దులుపుకొన్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక విషయం అర్థం చేసుకోదగినది. ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు ఏ ప్రాంతంలోపర్యటిస్తున్నా,  ఏ
కార్యక్రమంలో పాల్గొంటున్నా... ఆయన మనస్సుమాత్రం ఇక్కడే ఉంటోంది. అందుచేత భూములు
లాక్కొనేటప్పుడు ఎదురు తిరిగిన వాళ్లను ఎంత వేధిస్తే అంత ఎక్కువ మార్కులు పడతాయి.
ఈ సూత్రాన్ని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు అప్పుడు అలా రెచ్చిపోయారు. నెమ్మదిగా
తెలుసుకొన్న అధికారులు ఇప్పుడు ఇలా ప్రవర్తించారు. లేదంటే దాదాపు సంవత్సరం క్రితం
వ్యవసాయ పరికరాల్ని తగలబెడితే ఇప్పటిదాకా ఎవరి మీద చర్యలు లేవు. మూడు నెలల క్రితం
చెరకు పంట దగ్దం చేస్తే ఇప్పటిదాకా బాధ్యుల మీద చర్యలు లేవు. దీన్ని బట్టి చూస్తే
చంద్రబాబు సూత్రధారిగా పచ్చ చొక్కాలు, ప్రభుత్వ అదికారులు సాగిస్తున్న డ్రామాలు
అర్థం అవుతాయి. 

తాజా వీడియోలు

Back to Top