లోకేష్ ఇంటి గొడవ

ధనికుల ఇళ్లతో సమానంగా పేదల ఇళ్లు కట్టిస్తున్నామంటున్నారు నారా లోకేషం గారు. దాన్ని ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటోందని, అలా అడ్డుకున్నా మేం పేదలకు ఖరీదైన ఇళ్లు కట్టించి ఇచ్చేస్తామని చెబుతున్నారు. తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడటంలో తండ్రిని మించిపోతున్నాడు నారా లోకేష్. అవ్వాల్సిన దానికంటే అధికంగా వ్యయం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తే, పేదలకు ఖరీదైన భవంతి కడుతుంటే అడ్డు పడుతున్నారని లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. పేద ప్రజలు ఇళ్లు లేకుండా రోడ్డుపై ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ కూడా లోకేష్ ట్వీట్ చేసాడు. 
ఇళ్లు గుట్టు బైటపెట్టినందుకే
రెండు రోజుల క్రితం మూడు లక్షల గృహాలంటూ టిడిపి చేసిన ఆర్భాటంలో లొసుగులన్నీ బైటపెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్. పూర్తి కాని ఇళ్లు, గతంలో పూర్తైన ఇళ్లను కూడా ఈ జాబితాలోనే చూపించారని విమర్శించింది. అలాగే కొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్లకు అత్యంత ఖరీదైన ఇళ్లు, లబ్దిదారుల ఖాతాలో ఎలా కట్టారని నిలదీశింది. కనీసం 10 నుంచి 15 లక్షలు ఖర్చయ్యేలా విలాసంగా ఇళ్ల నిర్మాణం జరిగిందంటే వారు నిజమైన లబ్దిదారులా లేక టిడిపి వీర విధేయులకు ప్రభుత్వం ఇచ్చిన నజరానాలా అని ప్రశ్నించింది ప్రతిపక్షం. వైఎస్సార్ హయాంలో పేదలకు 45 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. నిరుపేదలకు నిలువ నీడ ఉండాలని, సొంత గూడు ఉండాలని కోరుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. లక్షల ఇళ్లు అని చెప్పుకుంటున్న చంద్రబాబు వాస్తవంగా ఎంత మందికి ఇళ్లను పూర్తి చేసి ఇచ్చారంటే సమాధానం లేదు. పేదలకు నాణ్యమైన ఇళ్లు కడుతున్నామంటూ లోకేష్ చెప్పుకునే గొప్పలు చూసి ఆశ్చర్యపోవడం తెలుగు ప్రజల వంతౌతోంది. ఇంత వరకూ ఒక్కి ఇంటినైనా పూర్తి చేయకుండా, ప్రతిపక్షం అడ్డుకుంటోందని లోకేష్ వగచడం చూస్తే ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ, తమ లోపాలను కప్పిపుచ్చుకుంటున్నాడనిపిస్తోంది. 
సొంత ఇంటి కథ మరచిన లోకేష్ 
ఇక ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి గురించి కూడా ట్విట్టర్ లో లోకేష్ విమర్శలు చేసాడు. నలుగురు ఉండటం కోసం కోట్లు ఖర్చు చేసి ప్యాలెస్ కట్టుకున్నారంటూ అక్కసు వెళ్లగక్కాడు. మరి అటు విజయవాడ కరకట్టలో, ఇటు హైదరాబాద్ లో నారావారి కుటుంబం నివసిస్తున్న ఇంటిని రేకుల షెడ్డులా కట్టుకున్నారా అంటున్నారు లోకేష్ కామెంట్ ను చూసిన నెటిజన్లు. తెలంగాణలో, ఎపిలో కోట్లు విలువచేసే ఇళ్లు మీరు కట్టుకోలేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకమునుపే వైఎస్సార్ కుటుంబం సంపన్న కుటుంబం. రాజకీయాల్లోకి అడుగుపెట్టక మునుపే వైఎస్ జగన్ ఓ విజయవంతమైన పారిశ్రామికవేత్త. వారి హోదాకు తగ్గట్టు వారు పాలెస్ కట్టుకున్నా, బంగ్లా కట్టుకున్నా లోకేష్ కు వచ్చిన నష్టం ఏమిటి? అత్యంత విలాసవంతంగా చంద్రబాబు ఇల్లు కట్టుకుని అతి రహస్యంగా గృహప్రవేశం చేసిన సంగతి ఆంధ్రప్రజలకు తెలియదని లోకేష్ భ్రమ పడుతున్నట్టున్నాడు. గురివింద గింజ తన నలుపెరగదన్నట్టు అవినీతికి ఆధార్ కార్డులాంటి వారు మరొకరిని విమర్శించడం విడ్డూరంగానే ఉంది మరి. 
 


 

తాజా వీడియోలు

Back to Top