కలిసి కదులుతున్న పశ్చిమ పల్లె.. పట్టణం

గుండె గుడిలో రాజన్న రూపం... గొంతు గొంతులో జగన్నినాదం.. పల్లె... పట్టణం ఉమ్మడిగా కదులుతున్నాయి. ‘మీ వెంటే ఉంటామం’టూ మరో ప్రజా ప్రస్థానంలో శ్రీమతి షర్మిలతో అడుగులు వేస్తున్నాయి. ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ.. దానితో అంట కాగుతున్న టిడిపిపై దుమ్మెత్తిపోస్తూ ముందుకు సాగుతున్నాయి. రాజన్న బిడ్డను చూసేందుకు.. ఆత్మీయంగా పలకరించేందుకు.. హారతులు పట్టి ఆశీర్వదించేందుకు.. కరచాలనం చేసేందుకు అభిమానజనం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చిన మహానేత వై‌యస్‌ఆర్ కుటుంబమే లక్ష్యంగా దుష్ట ‌త్రయం సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

నిడదవోలు :

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న రాజన్న తనయ శ్రీమతి షర్మిలకు పశ్చిమగోదావరి జిల్లా పల్లె ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రజలను పట్టించుకోని.. విశ్వసనీయత, విలువలు లేని కాంగ్రెస్, ‌టిడిపిలకు సరైన సమయంలో బుద్ధి చెబుతామని ఎక్కడికక్కడ జనం ప్రతినబూనుతున్నారు.

శనివారం ఉదయం 9.15 గంటలకు తణుకులో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. తణుకు నియోజకవర్గం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు శ్రీమతి షర్మిల వెంటే నడిచారు. అనంతరం ఉండ్రాజవరం మండలం పాలంగి వద్ద నిడదవోలు నియోజకవర్గంలోకి పాద యాత్ర ప్రవేశించింది. భారీ జనసందోహం నడుమ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌ కృష్ణ పాదయాత్రకు అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జెండాల రెపరెపల నడుమ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది.

రాజన్న, జగనన్న అభిమానులు‌ ముఖ్యంగా మహిళలు వేలాదిగా తరలివచ్చి శ్రీమతి షర్మిల వెంట నడిచారు. పాలంగిలో తమ్మినేని గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన మహానేత వైయస్‌ఆర్ విగ్రహాన్ని‌ శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన ఎం.కొండయ్య అనే వ్యక్తి శ్రీమతి షర్మిలను ఆశీర్వదించేందుకు రాగా.. ‘అన్నా..! జగనన్నకు మీ ఆశీస్సులు కావాలి’ అని అడగ్గా.. ‘మీ కుటుంబానికి మా అండ ఎప్పుడూ ఉంటుంది. మేమే కాదు ప్రజలంతా శ్రీ జగన్ వెంటే ఉన్నారం’టూ దీ‌వించారు. తణుకుకు చెందిన యువకుడు కె.రమేష్‌బాబు శ్రీమతి షర్మిలను కలిసి ‘అక్కా.. మిమ్మల్ని కలిసేందుకు రెండు రోజులుగా వస్తున్నా. నీ వెంటే నడుస్తున్నా. జనం మనిషి శ్రీ జగనన్న కోసం యువత ఎదురుచూస్తోంద’ని ఉద్వేగంగా చెప్పాడు.

ఎండలో పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిలను చూసి ఎన్.ముత్యాలమ్మ కన్నీటి పర్యంతమమైంది. ‘మీ కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రె‌స్, ‌టిడిపిలకు బుద్ధి చెబుతాం. ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడతామ’ని చెప్పింది. పాదయాత్ర ఉండ్రాజవరం చేరుకుంటున్న సమయంలో నాగరాజు అనే వృద్ధుడు ‘షర్మిలమ్మా.. మీ నాన్నగారు పుణ్యమాని నాకు నెలనెలా రూ.200 పింఛను వస్తోంది. అదే నాకు ఆధారమైంది’ అని చెప్పాడు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. జగనన్న ముఖ్యమంత్రి అయితే వృద్ధులకు రూ.700 పింఛను వస్తుంద’ని చెప్పారు. ఉండ్రాజవరంలోని వస్త్ర వ్యాపారం చేసే సరస్వతి కుటుంబీకులు శ్రీమతి షర్మిలకు పసుపు, కుంకుమతో చీర ఇచ్చి స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థులు తనను చూసేందుకు రాగా, వారిని శ్రీమతి షర్మిల ఆప్యాయంగా పలకరించారు. ఉండ్రాజవరం సెంటర్‌లోని మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్ విగ్రహానికి‌ శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మోర్తలోనూ మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సిపిఎం నాయకుడి ఆశీర్వాదం :
మోర్తకు చెందిన పోతుల సోమన్న అనే వృద్ధుడు తాను పెదతాడేపల్లికి చెందిన వాడినని, తన కుమార్తె పంచన చేరానని చెప్పాడు. రాబోయే జగన్‌బాబు ప్రభుత్వంలో తనకు పింఛను ఇప్పించాలని కోరాడు. శ్రీమతి షర్మిల స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందన్నారు. సిపిఎం సీనియర్ నాయకుడు సంకుల సత్యనారాయణ‌ శ్రీమతి షర్మిలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. ఆయన, నేను మంచి స్నేహితులం. మీకు మంచే జరుగుతుంది. వెళ్లి రామ్మా’ అని ఆశీర్వదించారు. నిడదవోలు మండలం కలవచర్లకు చెందిన నూతన దంపతులు డి.సూర్యరామాంజనేయ, విజయదుర్గలకు శ్రీమతి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.

మోర్త నుంచి పాదయాత్ర దమ్మెన్ను, నడిపల్లికోట మీదుగా కానూరు అడ్డరోడ్డుకు చేరుకోగా.. వానజల్లులు కురిశాయి. చల్లని జల్లుల నడుమ జనవాహిని తరలిరాగా, శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగించి మునిపల్లి చేరుకున్నారు.

Back to Top