వెంటవెంటనే దీక్షతో జగన్‌కు ఆరోగ్య సమస్య

హైదరాబాద్ :

నెల రోజుల వ్యవధిలో వెంటవెంటనే రెండుసార్లు కఠోర నిరాహార దీక్ష చేసిన కారణంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావం చూపిందని నిమ్సు వైద్యులు వివరించారు. ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన శ్రీ జగన్‌ని పోలీసులు బుధవారం అర్ధరాత్రి బలవంతంగా నిమ్సు ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్సు ఎక్కించారు.‌ ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం నిమ్సు వైద్యులు శ్రీ జగన్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి నెల రోజుల కిందట దీక్ష చేసినప్పుడే కీ టోన్సు (గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వులు శక్తి‌ రూపంలో వినియోగమవుతున్నప్పుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) అధికంగా ఉన్నాయని, మళ్ళీ నెల రోజుల వ్యవధిలోనే నిరాహార దీక్ష చేయడం, అదే స్థాయిలో కీటోన్సు విడుదల కావడం శరీరంపై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. ప్రస్తుతం కీటోన్సు అధికంగా ఉన్నాయని (బుధవారం రాత్రి శ్రీ జగన్ నిమ్సుకు వచ్చే సమయానికి కీటో‌న్సు 4 ప్లస్‌గా ఉన్నాయి) అవి తగ్గడానికి సమయం పడుతుందని అన్నారు.

పళ్లరసాలు తీసుకోవాలి- వైద్యుల సూచన :
వైద్య పరీక్షల అనంతరం చక్కెర స్థాయి 113 కు పెరిగిందని, (నిమ్సుకు తీసుకు వచ్చే సమయానికి ఆ స్థాయి 54గా ఉంది) సాధారణ స్థాయికి చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఇంకా ఐవీ ఫ్లూయిడ్సు ఎక్కిస్తున్నామని, ఆయన ఎలాంటి ఘనాహారమూ తీసుకోవడం లేదని, పళ్లరసాలు తదితరాలేవైనా (ఓరల్ ఫ్లూయి‌డ్సు) తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. శుక్రవారం మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, త్వరగా కోలుకునేందుకు తాము కృషి చేస్తున్నామని వైద్య బృందం పేర్కొంది. ఓరల్ ఫ్లూయి‌డ్సు తీసుకుంటే మరింత వేగంగా కోలుకునే అవకాశం ఉందని ఒక వైద్యుడు పేర్కొన్నారు. శ్రీ జగన్ శ్వాస తీసుకోవడం, ప‌ల్సు రేటు, రక్తపోటు తదితరాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తెలిపారు.
శ్రీ జగన్‌ శరీరంలో పదే పదే కీటోన్సు విడుదల అవుతుండటం భవిష్యత్‌లో ఆయనపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సీనియర్ వైద్యు‌డొకరు అన్నారు. నిమ్సు వైద్యులు డా. ఎం.నాగేశ్వరరావు (జనరల్ మెడిసిన్), డా.శేషగిరిరావు‌ (కార్డియాలజీ), డా.గంగాధర్ (నెఫ్రాలజీ), డా.లక్ష్మీభాస్కర్ తదితరులు‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని పర్యవేక్షిస్తున్నారు.

వైద్యుల సలహా ఇస్తేనే డిశ్చార్జి - శ్రీమతి భారతి :
వైద్య పరీక్షల ఫలితాలు, వైద్యుల నిర్ణయం తర్వాతే శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని డిశ్చార్జి చేస్తారని ఆయన సతీమణి శ్రీమతి వైయస్ భారతి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆమరణ దీక్ష చే‌సిన శ్రీ జగన్‌ను బుధవారం అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా నిమ్సు ఆస్పత్రికి తరలించారు. నిమ్సు ఆస్పత్రిలో ఉన్న ఆయనను గురువారంనాడు శ్రీమతి భారతి పరామర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన పలు జాతీయ టి.వి. చానళ్ల ప్రతినిధులతో ఆమె మాట్లాడారు.

‘దీక్ష భగ్నం సమయంలో శ్రీ జగన్‌ శరీరంలో కీటోన్ బాడీ‌స్ అత్య‌ధిక స్థాయిలో విడుదలయ్యయి. రక్తంలో చక్కెర స్థాయి 50కి పడిపోయింది. అనంతరం వైద్యులు శ్రీ జగన్‌కు ఫ్లూయిడ్సు ఎక్కించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన నుంచి రక్తం నమూనాలు సేకరించారు. ఈ ఫలితాల వచ్చిన తర్వాత శుక్రవారం ఉదయం డిశ్చార్జిపై నిర్ణయం ఉంటుంది’ అని శ్రీమతి భారతి తెలిపారు.

Back to Top