వైఎస్ జగన్ ధర్నాతో కదిలిన యంత్రాంగం..!

పొగాకు బోర్డులో కదలిక..!
నష్టపరిహారం చెల్లింపునకు అంగీకారం..!
గుంటూరుః ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టంగుటూరు ధర్నాతో  ప్రభుత్వం దిగివచ్చింది. పొగాకు రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది. జిల్లాలో పొగాకు రైతుల వరుస ఆత్మహత్యలతో చలించిపోయిన వైఎస్ జగన్ ..వారికి అండగా నిలిచేందుకు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి టుంగుటూరులో  పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. టుంగుటూరులో ధర్నా చేపట్టి ప్రభుత్వాలను ఏకిపారేశారు. 

వైఎస్ జగన్ ధర్నాతో కదలిక..!
నష్టపరిహారం చెల్లించడంలో తాత్సారం చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు  టొబాకో బోర్డు అధికారులను నిలదీశారు. ఈక్రమంలోనే సర్కార్ లో కదలిక వచ్చింది. పొగాకు బోర్డు నష్టపరిహారం చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. పొగాకు లోగ్రేడ్ లు అయిన ఎఫ్ 9, ఎఫ్ 10తోపాటు ఎన్ఓజీ గ్రేడ్ లకు నష్టపరిహారం కింద కిలో రూ.20 పొగాకు బోర్డులో నమోదైన రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. 

ఎట్టకేలకు నష్టపరిహారం..!
పొగాకు కొనుగోళ్లు జరపక, గిట్టుబాటు ధర లేక జిల్లాలో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఐనా ప్రభుత్వాల్లో చలనం లేకపోవడంతో వైఎస్ జగన్ పొగాకు రైతులకు బాసటగా నిలిచారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోకపోవడంపై వైఎస్ జగన్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. నష్టపరిహారం చెల్లింపు కోసం రైతుల పక్షాన పోరాడినందుకు అన్నదాతలు  వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  
Back to Top