తూర్పు గోదావరి తరగని అభిమాన ఝరి


జూన్ 11వ తేదీన రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జిపై నుండి తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది. 40 రోజులుగా యువనేత తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు. చలిగాలులు, వర్షం, బురద మయమైన దారుల్లో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడతారని అనిపించినప్పుడు అక్కడక్కడా యాత్రకు కొద్దిపాటి విరామం ఇస్తూ కొనసాగుతున్నారు. ఇన్నాళ్లుగా ఆ జిల్లా వాసుల అభిమానం ఆ గోదావరిలాగే ప్రవహిస్తోంది. ప్రజా యాత్రికుని పాదాలను ప్రేమగా ముద్దాడుతోంది. 
దారులు కష్టం లక్ష్యం ముఖ్యం
వేల కిలోమీటర్ల రహదారులు వేశామంటూ పంచాయితీరాజ్ మంత్రి లోకేష్ పదే పదే గొప్పలు చెబుతుంటారు. కానీ గ్రామాల్లో. ప్రధాన రహదారుల్లో రోడ్ల దుస్థితి తేటతెల్లం అవుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో తూర్పు గోదావరిలో పాదయాత్ర సాగిసున్న వైఎస్ జగన్ చిత్తడి నేలపై, బురద దారులపై నుంచి ముందుకు పోతున్నారు. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న తీరుగా ఉన్న రోడ్ల దుస్థితిని ఈ పాదయాత్ర బైటపెడుతోంది. ప్రతి ఊరూ చిన్న పాటి వర్షానికే గోదారిని తలపించేలా ఉంటోంది. అలాంటి క్లిష్టమైన మార్గంలోనే తన లక్ష్యాన్ని సాధించే దిశగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు జగన్. 
ప్రతి ఊరూ పదూళ్ల ప్రజానీకాన్ని చూస్తోంది
అనపర్తి, కాకినాడ నియోజకవర్గాల మీదుగా వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతోంది. ప్రతి ఊరూ పక్క ఊళ్లను కలుపుకున్న జన సందోహంతో పోటెత్తుతోంది. కాలువ గట్లు, రోడ్లు, చిన్నపాటి దారులు కూడా జనహోరుతో దద్దరిల్లుతున్నాయి. ఆ నవనాయకుడి వెంట అడుగులు వేయాలని ఉవ్విళ్లూరే జన సమూహాలు ప్రజా సంకల్ప యాత్రలో వేగంగా సాగుతున్నాయి. ప్రతి ఊరూ పది ఊళ్ల ప్రజలను పాదయాత్రలో కలుపుకు పోవడం ఓ అద్భుతం. గొల్లలమామిడాడ, కాకినాడల్లో జరిగిన బహిరంగ సభల్లో వైఎస్ జగన్ ప్రసంగాలకు ముగ్ధులయ్యారు తూర్పు వాసులు. వర్షం వస్తున్నా కదలకుండా సభ పూర్తయ్యే దాకా వేచి చూసారు. సభ పూర్తయి వైఎస్ జగన్ శిబిరానికి వెళ్లే వరకూ కూడా వెన్నంటే నడిచింది వెనుదిరగని అభిమానం. నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగులు, ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని రైతులు, కట్టుకున్న ఇళ్లకు బిల్లులు విడుదల చేయడం లేదని, ఆరోగ్యశ్రీ వర్తించక వైద్యం అందడం లేదని, దివ్యాంగులను పట్టించుకోవడం లేదని ప్రతి ఒక్కరూ తమ సమస్యలను ప్రతిపక్ష నేతకు విన్నవించుకుంటున్నారు. అందరి కష్టాలనూ ఓపికగా వింటూ, వారికి ధైర్యం చెప్పారు జననేత. సంఘమిత్ర, వీవోఎ, వెలుగు యానిమేటర్లకు నెలకు 10000 వేతనం ప్రకటించారు యువనేత. నవరత్నాలు ప్రతి వ్యక్తికీ వరంలా మారుతాయని హామీ ఇచ్చారు. 

 
Back to Top