ఎవడబ్బ సొమ్ముని ..!

హామీలు అమలు చేయని ఘనత బాబుదే..!
రాష్ట్రాన్ని విదేశాల్లో తాకట్టుపెట్టాడు..!
గుంటూరుః  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహార దీక్షకు సీపీఎం సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు వైఎస్ జగన్ దీక్షా స్థలిని సందర్శించి మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ను ఆయన అభినందించారు. ఈసందర్భంగా మధు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.

ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారు..!
వైఎస్ జగన్ ప్రత్యేకహోదా ఉద్యమం ఉప్పెనలా సాగుతుందని మధు అన్నారు. ప్రజాగ్రహంలో టీడీపీ,బీజేపీలు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధాలన్నీ తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుదేనని మధు నిప్పులు చెరిగారు. చంద్రబాబు గురించి మాట్లాడుకోకపోవటం చాలా పొరపాటు  అవుతుందని, ముఖ్యమంత్రిగా ఆయనకు కనీసం నిజాయితీ కూడా లేదని విమర్శించారు. అప్పట్లో ప్రత్యేక హోదా తెస్తానన్న బాబు...ఇప్పుడు ప్యాకేజీతో సరిపెడతానంటున్నాడని మధు ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్రాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టాడని విమర్శించారు. చంద్రబాబుకు అధికార ప్రయోజనమే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవని ధ్వజమెత్తారు. 

ఏముహుర్తాన సీఎం అయ్యావో గానీ..!
చంద్రబాబు ఏ రోజు అయితే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడో ఆ రోజే రాష్ట్రంలోని రైతులకు కష్టాలు మొదలైయ్యాయని మధు మండిపడ్డారు. ఏపీ రాజధాని శంకుస్థాపన అదిరిపోవాలంటున్న చంద్రబాబు....  రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో ఎలా అదిరగొట్టాడో అందరం చూశామని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ చేయటానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు ...రాజధాని శంకుస్థాపనకు మాత్రం రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్నారని  మధు నిప్పులు చెరిగారు. ఇదంతా ఎవడబ్బ సొమ్మని సభా ముఖంగా చంద్రబాబును నిలదీశారు.
Back to Top