బస్సులు కడుగుతున్న రైతన్న

ఇబ్రహీంపట్నం:

అతనో రైతు. ఓ విధివంచితుడు.. బతికి చెడ్డాడు. నాలుగు ఎకరాలకు ఆసామి. ఊరికి పెద్దమనిషి. పేరు గోడికొండ్ల యాదయ్య. ఊరు రంగారెడ్డి జిల్లా మూని గౌరెల్లి.  దర్జాగా బతికిన రోజుల్లో నలుగురికి అన్నం పెట్టాడు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం బస్సు డిపోలో బస్సులు కడుగుతూ కుటుంబాన్ని సాకుతున్నాడు. నాలుగెకరాల ఆసామికీ ఈ కష్టం ఎందుకొచ్చింది. కరెంటు కష్టాల వల్ల వచ్చిందంటున్నాడు యాదయ్య.
     అంతా బాగున్న రోజుల్లో ఆరుగాలం కష్టపడి పంటలు పండించి కుటుంబాన్ని సాకాడు యాదయ్య. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో  యాదయ్య అప్పుల పాలయ్యాడు. అయినా వ్యవసాయం వదిలిపెట్టలేదు. ఇద్దరు మగ పిల్లలు.. ఓ ఆడపిల్లను చదివించాడు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రి కాగానే రుణాలు మాఫీ అయ్యాయి. పిల్లలు బడికి వెళ్తుంటే... జీతగాణ్ణి పెట్టుకొని వ్యవసాయం చేశాడు. ఆడపిల్ల పెళ్లి చేశాడు. పెద్ద కొడుకును బీఈడీ చదివించాడు. చిన్న కొడుకుని కాలేజీకి పంపించాడు. అంతా బాగా సాగుతుందనుకున్న సమయంలో ఊహించని విధంగా మహానేత వైయస్ఆర్ మరణ వార్త. అది తట్టుకోలేక కొద్దికాలం మంచాన పడ్డాడు. మెల్లమెల్లగా తేరుకున్నాడు. ఏడాది గచిచిపోయింది. కాలం కన్నెర్రజేసింది.

     పంటలు ఎండిపోయాయి. ఆడబిడ్డను భర్త వదిలేశాడు. పెద్ద కుమారుడికి ఉద్యోగం కొద్దిలో తప్పిపోయింది. అయినా వ్యవసాయన్నే నమ్ముకున్నాడు. మళ్లీ అప్పుల పాలయ్యాడు. ఇన్ని కష్టాల సమయంలో సాయం చేయాల్సిన సర్కారు వేల రూపాయల కరెంటు బిల్లు కట్టాలని మెడ మీద కత్తి పెట్టింది. అప్పులకు తట్టుకోలేక భూమి అమ్మకానికి పెట్టాడు. అది లావణి పట్టా భూమి అని కొనేందుకు ఎవరూ రాలేదు. పూట గడవని పరిస్థితి రావడంతో కుటుంబాన్ని బతికించుకోవడానికి యాదయ్య పని కోసం పట్నం బాట పట్టాడు. ఇబ్రహీంపట్నం బస్సు డిపోలో బస్సులు కడిగే కార్మికుడిగా అవతారమెత్తాడు. గురువారం పాదయాత్రలో అటుగా వచ్చిన శ్రీమతి షర్మిలను కలిశాడు. ఆమెతోపాటు దాదాపు 45 నిమిషాలు నడుస్తూ బాధలు వివరించాడు. ‘ఈ సర్కారు పేదోళ్లకు సాయంగాదు బిడ్డా.. అన్నొస్తే మల్లా రైతునై కాడిపట్టుకుంటా’ అని అనడంతో.. అన్న తప్పకుండా త్వరలోనే బయటకొస్తాడు అని శ్రీమతి షర్మిల ఆయనకు ధైర్యం చెప్పి ముందుకుసాగారు.

Back to Top